Sunday, June 29, 2008

పుస్తక సమీక్ష-New thought of Peter Singer


కొత్త తత్వంతో ముందుకొచ్చిన పీటర్ సింగర్

Peter Singer : “Living High And Letting Die”.

గౌరి తీరిగ్గా టి.వి. చూస్తున్నది. అనాధ పిల్లల్ని అప్పగిస్తే లక్ష రూపాయలు ఒక్కొక్కరికీ యిస్తామని, అమెరికాలో పిల్లలు లేని సంపన్నులు పెంచుకోడానికి ముందుకు వస్తున్నారని ప్రకటన చూచింది. వెంటనే తనకు తెలిసిన వీధి అనాధ బాలుడిని టి.వి.లో చూపిన అడ్రస్ కు చేరవేసింది. లక్షరూపాయలు కళ్ళజూసింది. హాయిగా కొత్త మోడల్ టి.వి. సెట్ కొనుక్కున్నది. విలాసవంతమైన హోటల్ కు వెళ్ళి ఖరీదైన భోజనం చేసి తృప్తిగా తేపింది. ఇంతలో పక్కింటి లక్ష్మి వచ్చి గౌరికి ఒక వార్త చేరవేసింది. టి.వి.లో ప్రకటించినట్లు, కొనుక్కున్న పిల్లల్ని అమెరికా సంపన్నులకు చేర్చడం లేదట. పిల్లల్ని చంపేసి వారి కిడ్నీలు, లివర్, కళ్ళు విడి భాగాలుగా అమ్ముతున్నారట. గౌరి యీ దుర్వార్తకు అదిరిపడింది. ఇప్పుడేం చేయాలి. తన వద్ద వున్న డబ్బు తిరిగి యిచ్చేసి పిల్లవాడిని వాపస్ కోరాలా? వీధిలో దిక్కులేకుండా తిరుగుతున్న అబ్బాయి ఏమైతేనేం అని వూరుకోవాలా?
ఇది నైతిక సమస్య. ఇలాంటివి ఎదురైతే ఏం చేయాలి? ఆధునిక తాత్వికుడు పీటర్ సింగర్ చర్చను ప్రారంభించి పెద్ద దుమారం లేపాడు. సంపన్న దేశాలలో విలాసాలకు ఖర్చుచేసే వారు ఒక్కసారి ఆలోచించి, వాటిని తగ్గించుకుంటే, ఆ పొదుపుతో పేద పిల్లలు బాగుపడతారంటాడు.
పీటర్ సింగర్ హేతుబద్ధమైన ఉపయోగతావాది, చింతనాపరుడు. మనం చేసే పనుల ఫలితాలను, బాగోగులను బట్టి మంచిచెడ్డలు నిర్ధారించాలంటాడు.
వస్తువులన్నీ వుండగా వాటిని మార్చేసి, లేదా అవతలపారేసి, కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన వాటికోసం సంపన్నులు పరుగెడుతుంటారు. సెలవుల్లో ఖరీదైన పిక్నీక్ లకు వెడతారు. అత్యంత విలాసవంత హోటళ్ళలో బాగా ఖర్చుపెట్టి తాగుతారు, తింటారు. అవసరం లేని ఖర్చులు పెడతారు. ఆ డబ్బులో కొంతైనా విరాళంగా యిస్తే చాలామంది అనాధ పిల్లలు, పేద పిల్లలు బాగుపడతారంటాడు పీటర్ సింగర్.
తన వాదానికి మద్దతుగా పీటర్ సింగర్ మరో తాత్వికుడి రచనలు కూడా ఉదహరించాడు. న్యూయార్క్ యూనివర్శిటీ ఫిలాసఫర్ పీటర్ సింగర్ 1996లో ప్రచురించిన పుస్తకంలో యిలాంటి వాదన ఆకట్టుకున్నది.
అయితే పిల్లల్ని ఎందుకు కాపాడాలి? అంటే, రోగాలకు, ఆకలికి పిల్లలు బాధ్యులు కారు. వారిని కన్న తల్లిదండ్రులు, సమాజం అందుకు బాధ్యత వహించాలి. కనుక అలాంటి పిల్లల్ని ఆదుకోవడం బాధ్యతగా స్వీకరించాలని పీటర్ సింగర్ వాదించాడు.
బాల్యదశలో ఆకలి, రోగాలు లేకుండా బయటపడితే ఆ తరువాత వారి తిప్పలు వారు పడతారు. కనుక 2 వేల రూపాయలు దానం చేస్తే ఒక పిల్లవాడు (లేదా బాలిక) ప్రమాదస్థితిని దాటి బయటపడే అవకాశం వుంది.
ప్రపంచంలో అనేక మంది ఆ మాత్రం దానం చేయగల స్థితిలో వున్నారు. అయినా ఉదాసీనంగా అశ్రద్ధ చేస్తున్నారు. ఎందరో పిల్లలు సహాయం అందక చనిపోతున్నారు. ఇదీ స్థితి.
జర్మనీలో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో యూదులను చంపారు, చిత్ర హింసలకు గురి చేశారు. నాజీలు హిట్లర్ నాయకత్వాన జరిపిన యీ దారుణ అమానుష చర్యలు జర్మనీ పౌరులకు తెలుసు. అయినా వూరుకున్నారు. పిల్లలు చనిపోతున్నా, బాధపడుతున్నా తెలిసీ, కనీస దానం చేయకపోవడం అలాంటిదేనని పీటర్ సింగర్ అంటున్నాడు.
కనీస అవసరాలు తీరేవారు, విలాసాల జోలికి పోకుండా దానం చేయడం నైతిక బాధ్యత అని తాత్వికుడు పీటర్ సింగర్ విజ్ఞప్తి చేస్తున్నాడు. జీవించడమే కాదు. నైతికంగా మంచి జీవనం అవసరం. ఆ దృష్టా అతడు వాదిస్తున్నాడు.
ఎవరీ పీటర్ సింగర్?
1946లో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో పుట్టిన పీటర్ సింగర్ అటు ఆస్ట్రేలియాలోనూ, ఇంగ్లండ్ లోనూ చదివి రెండేళ్ళు ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో లెక్చరర్ గా పనిచేశాడు. ఆమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాలలో విజిటింగ్ లెక్చరర్ గా అనుభవం పొందాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో మొనాష్ యూనివర్శిటీ ప్రొఫెసర్.
మానవ జీవ నీతి శాస్త్ర కేంద్రం డైరెక్టరుగా పీటర్ సింగర్ ప్రపంచ ఖ్యాతి పొందాడు. ఆస్ట్రేలియాలోని విక్టోరికా ప్రాంతంవారు ఆయన్ను సెనేటర్ గా నిలబడమని కోరారు. 1992 నుండీ అంతర్జాతీయ బయో ఎథిక్స్ సంస్థ స్థాపకుడుగా కృషి చేస్తున్నాడు. 1985 నుండీ బయో ఎథిక్స్ పత్రిక సహసం పాదకుడు.
ఇప్పుడు పీటర్ సింగర్ ను అమెరికాలోని ప్రిన్స్ టన్ యూనివర్శిటీ వారు మానవ విలువలు అధ్యయనం చేసే బయో ఎథిక్స్ కేంద్రంలో ప్రొఫెసర్ గా ఆహ్వానించారు. ఆయన అంగీకరించి చేరారు. కాని ఆయన నియామకాన్ని ప్రశ్నిస్తూ ప్రిన్స్ టన్ యూనివర్శిటీలో జీవకారుణ్య సంఘాలవారు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఎందుకని?
పుట్టిన పిల్లలు ఒకనెల లోపు వికలాంగులని, శారీరకంగా తీవ్ర లోపాలు వున్నాయని తెలిస్తే వారిని చంపేయడం మంచిదని పీటర్ సింగర్ అభిప్రాయం. పిల్లలు సుఖ సంతోషాలను యివ్వాలేగాని, తాము బాధపడుతూ, తల్లిదండ్రులకు, సమాజానికి క్షోభ తీసుకొచ్చే రీతిలో పరిణమించరాదని ఆయన ఉద్దేశం. కనుక అలాంటి పిల్లల్ని నెల రోజుల లోపు చంపేస్తేనే అందరికీ మంచిదన్నాడు. దీనిపై హాహాకారాలు బయలుదేరాయి.
గర్భస్రావం అనుమతించాలనీ, తీవ్ర బాధలు భరించలేక ఎవరైనా చనిపోతామంటే వారిని అలా చనిపోనివ్వాలని అందుకు డాక్టర్లు తోడ్పడడంలో తప్పు లేదని పీటర్ సింగర్ వాదించాడు. యూరోప్, అమెరికాలలో పెద్ద చర్చనీయాంశంగా యీ వాదం మారింది.
1968 పీటర్ సింగర్ రెనాటా డయమంగ్ ను వివాహమాడాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. రచనలతో బాటు, కూరగాయల పెంపకం, ఈత, నడక ఆయన అభిరుచులు.
కోతుల జాతిని సంరక్షించాలనే (Ape Project) పథకంలో విశ్వవిఖ్యాత శాస్త్రజ్ఞుల మద్దత్తు పీటర్ సింగర్ గడించాడు. పరిణామంలో మానవులతో సమంగా వున్న వివిధ కోతి జాతుల్ని ఏ మాత్రం సంహరించరాదని వాదించాడు. కోతి అంగాలు పరిశోధనకు స్వీకరించడం తప్పుకాదనప్పుడు, మెదడు లేకుండా పుట్టిన శిశువుల అంగాలను తీసుకోవచ్చు గదా అంటున్నాడు.
21వ శతాబ్దంలో కొత్త సూత్రాలు రావాలి. లోగడ టాలమీ విశ్వాసాన్ని కోపర్నికస్ దెబ్బ కొట్టాడు. అతడి లోపాల్ని కెస్లర్ సరిదిద్దాడు. అలాగే ముందుకు సాగడంలో మార్పులు చేసుకోవాలి. ఇందుకు గాను పీటర్ సింగర్ కొత్త నిబంధనలు సూచించాడు. బైబిల్ 10 ఆజ్ఞలు యిప్పుడు మార్చుకోవాలం టున్నాడు. అందులో ముఖ్యమైనవి :
1. మానవ జీవితం మారుతుందని గ్రహించాలి.
2. నీ నిర్ణయాలకు వచ్చే ఫలితాలను స్వీకరించే బాధ్యత నీదే.
3. బ్రతకాలా వద్దా అనేది వ్యక్తి యిష్టం. దానిని గౌరవించు.
4. పిల్లలు కావాలంటేనే వారిని యీ లోకంలోకి తీసుకురావాలి.
5. జీవరాసులలో విచక్షణ చూపవద్దు.
జంతువుల పట్ల హింసను పీటర్ సింగర్ తీవ్రంగా ఖండించాడు. ఆయన రాసిన పుస్తకం జంతు వియోచన (Animal Liberation) చదివి అనేక మంది శాఖాహారులుగా మారిన దాఖలాలున్నాయి. జంతువుల హక్కుల పోరాట కర్తలకు యిది ప్రమాణంగా వుంది.
అధునాతన ఎన్ సైక్లోపీడియా బ్రిటానికాలో (1996) ఎథిక్స్ పై పీటర్ సింగర్ విపుల వ్యాసం రాశాడు. ప్రాచ్య పాశ్చాత్య నైతిక పరిణామాన్ని చక్కగా సమీక్షించాడు. 21వ శతాబ్దంలో ఎదురుకాబోతున్న నైతిక సమస్యల ప్రస్తావన తెచ్చాడు. ఈ విషయంలో ఆయన జొనాథన్ గ్లోవర్ రచన చూపాడు. (Jonathan Glover, 1984, What Sort of People should there be?) రానున్న అనేక క్లిష్ట సమస్యలను, నైతిక సంక్షోభాలను ఆయన మన దృష్టికి తెచ్చాడు. ముఖ్యంగా జనిటిక్స్ రీత్యా యీ సమస్యలు తలెత్తనున్నాయన్నాడు. పిల్లలు లేని వారికి తోడ్పడే నిమిత్తం, స్థంభింపజేసిన రేతస్సు కణాల ద్వారా ఒకామె గర్భం ధరిస్తుంది. తీరా పిల్ల పుట్టిన తరువాత తానే అట్టి పెట్టుకుంటానంటే, ఏమౌతుంది. మనకు అనూహ్యమైన నైతిక సమస్యలు వస్తాయంటున్నాడు.
భారతదేశంలో నీతి, తత్వం, మతం కలసి పోయిన రీతిని పీటర్ సింగర్ ప్రస్తావించాడు. వేదాలు, బౌద్ధ, జైనాలు, చార్వాక నీతి విషయాలు చూపాడు. జంతువుల్ని చంపి యజ్ఞాలు చేస్తే పుణ్యలోకాలకు పోతారనే వేదాలను ప్రశ్నిస్తూ, అలాగయితే వృద్ధ తల్లిదండ్రులను చంపేస్తే సరాసరి స్వర్గానికి పోతారుగదా అని చార్వాకుడు చెప్పిన ఉదంతాన్ని పీటర్ సింగర్ ఆశ్చర్యంతో చూపాడు.
పీటర్ సింగర్ ను పట్టించు కొనకతప్పదు.

Friday, June 27, 2008

Sahiti parulato Sarasaalu-Gopala Sastri


గోల శాస్త్రి
(1931-1994)










ప్రభుత్వ సమాచారశాఖకు వెడితే నిర్జీవంగా వుండేది. అలాంటి చోట పని చేసిన ఉపద్రష్ట గోపాల చక్రవర్తి తన చతుర సంభాషణలు, హాస్యంతో కాస్త ఉపశమనం యిచ్చేవారు. పైగా ఒకకాలు అవుడుగావడం వలన, నడకకు సహాయం అవసరమయ్యేది. ఆజానుబాహుడు. శారీరక లోపాల్ని మరచిపోయేట్లు చక్కగా సమయస్ఫూర్తి మాటలు, వ్యాఖ్యలు చేస్తుండేవారు.
గోరాశాస్త్రి మేనల్లుడుగా గోపాల చక్రవర్తితో పరిచయమైంది. అదే కొనసాగింది. వివిధ పత్రికలలో చమత్కార రచనలు, క్లుప్తంగా, విపరీతంగా రాసేవాడు. చదివి ఆనందించేవాళ్ళం. ఆమాటే చెప్పేవాళ్ళం.
అనేక మార్లు గోపాలశాస్త్రిని ఆయన ఇంట్లో, గోరాశాస్త్రి గృహంలో, సమాచారశాఖలో కలసి ముచ్చటించాను. ఎప్పుడూ ఆనందమేగాని, ఆయనతో మరొకటి వుండేదికాదు. అది విశేషం. వ్యక్తులను పేర్లు మార్చిచమత్కారంగా సంబోధించేవారు. డి. ఆంజనేయులును డాంజనేయులు అనేవారు. గోరాశాస్త్రి మాత్రం చనువుగా చివాట్లు పెడుతుండేవారు. ఉద్యోగ రీత్యా అనేక మారుపేర్లతో వివిధ చిన్న, పెద్ద పత్రికలలో రాశారు.
రచనలు : కలం కలలు, ఆనంద జీవనది, నాతి కథలు, నీతి కథలు, గోలా యణం, నవ్వు గోపాలం.
పత్రికలలో నిర్వహించిన శీర్షికలు : సల్లాపం (ఈనాడు), చెవిలో జోరీగ (ఆంధ్రజ్యోతి), గోపాల భూపాలం (ఉదయం), మిరపకాయ బజ్జీలు (ఆంధ్రజనత), శ్రవణానందం (ఆంధ్రప్రభ) యిత్యాదులు. చిన్న పత్రికలలోనూ నిర్వహించారు.

Tuesday, June 24, 2008

ఫ్రాయిడ్ - 2వ భాగం







ఒడిపస్ కథ ఏమిటి?
మనో విశ్లేషణలో మూలసూత్రంగా స్వీకరించిన ఒడిపస్ సూత్ర కథ ఏమిటి? ఇది గ్రీకు గాథ. థీబ్స్ అనే ప్రాంతానికి రాజు లూయిస్. అతనికి పిల్లలు లేరు. ఆరకిల్ కొండ దేవతను అడిగితే, పిల్లవాడు పుడతాడు కాని వాడే నిన్ను చంపుతాడని చెబుతుంది. ఆ మాటలు నమ్మిన రాజు లూయిస్ తన భార్య జొకాస్తకు దూరంగా వుంటాడు. దీనికి ఆమె ఆగ్రహిస్తుంది. అతన్ని బాగా తాగించి, అతనితో జతకడుతుంది. ఆ తర్వాత పిల్లవాడిని కంటుంది. రాజు ఆ పసివాడిని లాక్కొని రెండు కాళ్ళు కలిపి మేకులు కొట్టి సిథారస్ పర్వతంపై పడేస్తాడు. లాయిస్ అనుకున్నట్లు ఆ పిల్లవాడు కొండపై చనిపోలేదు. ఒక పశువుల కాపరి చూసి కొరింత్ ప్రాంతానికి తీసుకువచ్చి, ఒడిపస్ అని పేరు పెడతాడు. ఆ ప్రాంతానికి రాజు అయిన పోలిబన్, రాణి పెరిబోయాకు పిల్లలు లేకుంటే, వారికి ఒడిపస్ ను ఇచ్చేస్తాడు. పిల్లవాడు పెరిగి, యవ్వనదశకు వస్తాడు. అతణ్ణి చూసిన స్నేహితులు తల్లిదండ్రులు పోలికలు అతనిలో లేవని నెపం వేస్తారు. సంప్రదాయానుసారం ఆరికల్ కొండ దేవత దగ్గరకు వెళ్ళి తనను గురించి అడుగుతాడు. నువ్వు నీ తండ్రిని చంపి, నీ తల్లిని పెళ్ళాడతావు ఫో అంటుంది. తల్లిదండ్రులను విపరీతంగా ప్రేమించిన ఒడిపస్ ఈ జోస్యం విని, తిరిగి కొరింత్ ప్రాంతానికి కాకుండా దూరంగా వెళ్ళిపోవాలనుకుంటాడు. డాలిస్ ప్రాంతంవైపు వెడుతుంటే ఒకచోట ఇరుకుదారిలో రథంపై వస్తున్న లాయిస్ ఎదురౌతాడు. ఇద్దరూ ఎదురెదురుగా తప్పుకొని వెళ్ళేటంత వెడల్పు లేదు. ఒడిపస్ ను తప్పుకోమని లూయిస్ హుకుం చేస్తాడు. ఒడిపస్ నిరాకరిస్తాడు. రథం ముందుకు సాగగా, లూయిస్ రథ చక్రాలు ఒడిపస్ కాలును నలిపేస్తాయి. ఆగ్రహంతో లూయిస్ ను, రథసారధిని ఒడిపస్ చంపేస్తాడు. తాను చంపుతున్నది తన నిజ తండ్రినే అని ఒడిపస్ కు తెలియదు. థీబ్స్ వెళ్ళగా అక్కడ చిక్కు ప్రశ్నలు వేసే స్ఫినిక్స్ ఎదురౌతుంది. చిక్కుముడి విప్పినవారే బతికి ముందుకు సాగిపోగలరు. ఒడిపస్ ఆ చిక్కు ప్రశ్నల్ని విప్పి, నగరాన్ని పీడిస్తున్న స్ఫినిక్స్ ను వదిలిస్తాడు. నగరవాసులు ఆనందంతో అప్పుడే విధవగా మారిన జొకాస్తా రాణిని ఇచ్చి ఒడిపస్ కు పెళ్ళి చేస్తారు. ఆమె తన నిజమైన తల్లి అని ఒడిపస్కు తెలియదు. థీబ్స్ ప్రాంతానికి ప్లేగువ్యాధి వ్యాపిస్తుంది. డెల్విక్ దేవతను అడిగితే, లూయిస్ రాజును చంపినవాడిని వెళ్ళగొట్టమంటుంది. తానే చంపినట్లు ఒడిపస్ కు తెలియక, హంతకుడిని తరిమేస్తానంటాడు.
గ్రీసులో గౌరవపాత్రుడైన టైరిసియన్ అనే అంధుడు. ఒడిపస్ ను కలిసి, నగరం కోసం ఒక వ్యక్తి ఆహుతి కావాలంటాడు. తాను త్యాగం చేయటానికి సిద్ధమని జొకాస్తా రాణి తండ్రి ప్రకటిస్తాడు. కాని అసలు రహస్యం మరొకటి వున్నదనీ, దేవతలు బలికోరే వ్యక్తి వేరే వున్నాడనీ చెబుతాడు. తన కుమార్తె జొకాస్తాను పెళ్ళాడిన ఒడిపస్ ఆమె కుమారుడనీ, అతను చంపింది అతని తండ్రి లూయిస్ నేనని బయటపెడతాడు. ఒడిపస్ పొరుగురాజుకు ఎలా దత్తపుత్రుడో వెల్లడౌతుంది. జొకాస్తా ఆ కథోర సత్యం విని ఉరి వేసుకుంటుంది. ఆమె దగ్గరే ఒక పిన్ను లాక్కొని, కంట్లో పొడుచుకొని, ఒడిపస్ అంధుడౌతాడు.
ఇదీ ఒడిపస్ గాథ. ఫ్రాయిడ్ ఉదహరించే ఒడిపస్ కాంప్లెక్స్ ఈ గాథ నుండే స్వీకరించాడు. అదెలాగో పరిశీలిద్దాం. అసలు గ్రీక్ కథను ఫ్రాయిడ్ యథాతథంగా స్వీకరించలేదు. తన సెక్స్ సిద్ధాంతానికి అనుగుణంగా కథను మలచుకొని, భాష్యం చెప్పాడు. ప్రచారం చేశాడు. అది ఫ్రాయిడ్ సిద్ధాంత ప్రచారబలం.
ఒడిపస్ తన తండ్రిని చంపదలచుకోక వెళ్ళిపోయాడు. అసలు తండ్రి ఎవరో అతనికి తెలియదు. అడ్డొచ్చిన వ్యక్తిని చంపుతున్నప్పుడు తాను హతమారుస్తున్నది తన తండ్రినే అని ఒడిపస్ కు తెలియదు. తల్లిని పెళ్ళి చేసుకుంటున్నప్పుడు ఆమే తన తల్లి అనేది కూడా ఒడిపస్ కు తెలియదు. తల్లితో చిన్నతనం నుండే లైంగిక సంబంధం పెట్టుకోవాలని అతను కోరుకోలేదు. కనుక ఫ్రాయిడ్ సిద్ధాంతానికి ఒడిపస్ కథ యిమడదు. అయినా అదే కథను తీసుకొని, ఒడిపస్ చేసిందంతా అవ్యక్త అచేతన మనస్తత్వం బలం వల్ల అని చెప్పి లోకాన్ని నమ్మించడం ఫ్రాయిడ్ ప్రచార బలానికి నిదర్శనం.
ఒడిపస్ కాంప్లెక్స్ ప్రకారం తండ్రి పట్ల ద్వేషం, తల్లీ పట్ల కామం వుండాలి. అవి ఒడిపస్ కథలో లేవు. అయినా ఫ్రాయిడ్ ఒడిపస్ కాంప్లెక్స్ సృష్టించాడు. ఒక ప్రాచీన గాథను తన సిద్ధాంతానికి అనుగుణంగా మార్చుకోవడమే గాక, అది శాస్త్రీయమని చెప్పడం ఫ్రాయిడ్ బుకాయింపుతనం. ఇది సైకో ఎనాలసిస్ మూలాధారం. అది ఎవరూ పరీక్షకు పెట్టకుండా చాలాకాలం అంగీకరించడం విశేషం. ఫ్రాయిడ్ వాడి, ప్రచారంలో పెట్టిన సూపర్ ఈగో, ఇద్, ఈగో వంటి పదాలను ఆకర్షణ వున్నదేగాని శాస్త్రీయ పరిశోధనగాని, ఆధారాలతో కూడిన రుజువుగాని లేదు. అయినా కథకుడివలె ఫ్రాయిడ్ తరచు యీ పదజాలాన్ని వాడుతూ పోయాడు. అలా వాడగా, అదే నానుడిగా మారి, మూలాధారణ ఏమిటి అని అడగడం మరచిపోయారు జనం.

స్త్రీలు-ఫ్రాయిడ్

స్త్రీల పట్ల ఫ్రాయిడ్ ధోరణి, అవగాహన అశాస్త్రీయతకు పరాకాష్ట. ఆడపిల్ల పెరగడంలో ఆమె లైంగికంగా చిదికిపోవడం పెద్దమలుపు అంటాడు. పిల్లలు పుట్టించకుండా ఎద్దుకు వట్ట చితకకొడతారు. అలాగే పురుషాంగం స్త్రీలలో చితికిపోవడమే స్త్రీ లైంగిక లోపంగా ఫ్రాయిడ్ చిత్రించాడు. లైంగిక లోపాన్ని కప్పిపుచ్చుకోవడం స్త్రీ జీవిత పర్యంతం అవస్థగా మారిందంటాడు. మిగిలిన విషయాలలో మాత్రం స్త్రీకి వ్యక్తిగా గౌరవం వుంటుందన్నాడు. సెక్స్ సిద్ధాంతాలకు ఆద్యుడు, మూలపురుషుడు అని భ్రమపడేవారు తెలుసుకోవాల్సిన సత్యమిది. స్త్రీ పురుషుల మధ్య సెక్స్ సంబంధంలో ఆప్యాయతలు, ప్రేమ, వ్యక్తిత్వం వెల్లడి వంటివేమీ ఫ్రాయిడ్ దృష్టిలో లేవు.
ఆద్యంతాలూ యూదు జాతీయత
తన స్వీయగాథలలో ఫ్రాయిడ్ రాస్తూ తాను యూదుగానే వున్నానన్నాడు. అబ్రహాం, ఫెరెంకిలకు రాసిన ఉత్తరాలలో కూడా తన జాతీయతత్వం గట్టిగా చెప్పాడు. మనోవిశ్లేషణ ఉద్యమాన్ని, చికిత్సను, సిద్ధాంతాన్ని వ్యతిరేకించడాన్ని, విమర్శించడాన్ని యూదు వ్యతిరేకతగా ఫ్రాయిడ్ చూపిన సందర్భాలు లేకపోలేదు. యూదులలో మార్మిక దృష్టి లేదనీ, కనుక వైజ్ఞానిక దృష్టికి వారు బాగా పనికొస్తారని ఫ్రాయిడ్ ఉద్దేశం.
ఫ్రాయిడ్ పలుకుబడి, బహుళ ప్రచారం వల్ల అతడి సిద్ధాంతాన్ని ఆనాడు ఎవరూ టెస్ట్ కు పెట్టలేదు. సైంటిఫిక్ కాదని ఎవరైనా అంటే, విరుచుకుపడడం తప్ప, శాస్త్రీయ సమాధానం ఎన్నడూ రాలేదు. మతాలలో ఆత్మను అడ్డం పెట్టుకున్నట్లే, మానసిక రంగంలో సైకో ఎనాలసిస్ కారుడు అవ్యక్తం, ఉపవ్యక్తం వంటి పదాలను కవచాలుగా వాడారు. అది ఫ్రాయిడ్ ప్రచార సాధనం. అదే ప్రచార గొప్పతనం. ఫ్రాయిడ్ సైకో ఎనాలసిస్ చికిత్సా విధానాన్ని అక్షరాలా పాటించడం మానేశారు. చాలా మార్పులు వచ్చాయి. వాషింగ్టన్ సెయింట్ ఎలిజబెత్ సైకియాట్రి ఆస్పత్రిలో యీ విషయాలు గమనించాను. థామస్ సాజ్ ను సిరక్యూస్ విశ్వవిద్యాలయంలో (న్యూయార్క్ రాష్ట్రం, అమెరికా) కలిశాను. ఆయన పుస్తకాలు, వ్యాసాలు గమనించాను. ఫ్రాయిడ్ శిష్యులు కూడా అనేక మార్పులు చేశారు. ఎరిక్ ఫ్రాం కూడా ఫ్రాయిడ్ గొప్పతనాన్ని గుర్తిస్తూనే, ఆయన లోపాల్ని చూపారు.

ఫ్రాయిడ్ స్వదస్తూరి

Monday, June 23, 2008

పుస్తక సమీక్ష-ఫ్రాయిడ్ కలలపై సరికొత్త శోధన!























రోగులను ఇలాంటి పడకపై ఉంచి ఫ్రాయిడ్ ప్రశ్నించి, విని విశ్లేషించేవాడు.




ఫ్రాయిడ్

1. Anti Freud. : Karl Kraus’s Criticism of Psychoanalysis & Psychiatry.
2. Myth of Mental Illness by Thomas Szasz.

ఇరవయ్యో శతాబ్దంలో కొత్త ఆలోచనలు పాదుకున్నాయి. మానసిక ప్రపంచంలోని అంశాల గురించి శోధించడానికి తగిన భూమిక అంతకుముందే ఏర్పడింది. ఇందుకు సిగ్మండ్ ఫ్రాయిడం చేసిన పరిశోధనలే మూలంగా ప్రచారమొందాయి. ఫ్రాయిడ్ పరిశోధనలు విభిన్నరంగాలపై, ప్రాంతాలపై ప్రసరించాయి. తెలుగునేల కూడా అందుకు మినహాయింపు కాదు. అయితే ఆయన పరిశోధనల ప్రామాణికతపై ఇదివరలోనే ప్రశ్నలు తలెత్తాయి. సాహిత్య కళారంగాలకి సైతం ఫ్రాయిడ్ ఆలోచనల్ని అనుసంధానించి వ్యాఖ్యానించే పద్ధతి ఉంది. ఈ దృష్ట్యా ఫ్రాయిడ్ నేపధ్యాన్ని, ఆయన పరిశోధనల తీరును, వాటి ఫలితాల్ని గురించి తెలుసుకోవడం అవసరం. ఆయన ఆలోచనల్ని ఎంతవరకు ఆమోదించగలమన్న విషయాలపై సరైన అంచనాలకు రావడం తప్పనిసరి. ఇందుకు ఉపకరించే వ్యాసమిది.

జగమంతా సెక్స్ మయంగా చూసిన ఫ్రాయిడ్ ఒక శతాబ్దం పాటు ప్రపంచంలో ఎన్నో రంగాల్ని ప్రభావితం చేశాడు. ఐన్ స్టీన్, మార్క్స్, డార్విన్ కోవలో ఫ్రాయిడ్ ను చేర్చిన సంధర్భాలు లేకపోలేదు. రానురాను ఫ్రాయిడ్ ను బాగా అధ్యయనం చేసి, ఆయన చెప్పినవి, చేసినవి ఎంతవరకు నిలుస్తాయో పరిశీలించారు. ఆయన శిష్యులే గురువును కొంతవరకు నిరాకరించి, పనికొచ్చేవి ఏమిటో బేరీజు వేస్తున్నారు.
సిగ్మండ్ ఫ్రాయిడ్ (1856-1939) నాస్తికుడు, హేతువాది, యూదు డాక్టరుగా ఆరంభమైన ఫ్రాయిడ్ ఈల్ లో గోనడ్స్ గురించి పరిశోధనతో రంగప్రవేశం చేశాడు. ఫ్రాయిడ్ పై గ్రీక్ సాహిత్య ప్రభావం అధికం. ఆస్ట్రియా, జర్మనీ, ఫ్రాన్స్ లలో జీవించిన ఫ్రాయిడ్, తన చివరి రోజులలో హిట్లర్ నాజీ నియంతృత్వ ధోరణుల వల్ల ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడే గడిపి కేన్సర్ తో చనిపోయాడు.

మతాన్ని ఆద్యంతాలు వ్యతిరేకించిన ఫ్రాయిడ్, మన చుట్టూ వున్న ప్రపంచంలో మనం సృష్టించుకున్న కోర్కెల లోకంపై, అదుపు పెట్టే యత్నమే మతం అన్నాడు. మతం అనేది ఒక భ్రమ అనీ, అయితే ఓదార్పు యిచ్చే విషయంగా అది పరిణమించిందనీ ఫ్రాయిడ్ అన్నాడు. మతం నుండి బయటపడినవారు, స్వేచ్ఛగా సంపూర్ణ జీవనం సాగించగలరని కూడా ఫ్రాయిడ్ చెప్పాడు. దీనితో మతస్తులు ఆయనపై విరుచుకపడ్డారు. క్రైస్తవ మతం, అందులోనూ కేథలిక్ శాఖ మానవ శ్రతువు అని కూడా స్పష్టం చేశాడు. ది ఫ్యూజర్ ఆఫ్ ఇల్యూజన్ లో ఫ్రాయిడ్ మత విమర్శ చేశాడు. (1927) విశ్వవ్యాప్తంగా వున్న మానసిక రుగ్మతగా మతాన్ని చిత్రించిన ఫ్రాయిడ్, దాన్నుండి బయటపడాలన్నాడు.















సృష్టి, ఊహ అనేవి ఫ్రాయిడ్ మూలాధారాలు. వాటిని జనం మధ్యకు తెచ్చి చర్చలో పెట్టాడు. ప్రతి వ్యక్తికీ కొద్దోగొప్పో యీ సృష్టి లక్షణాలుంటాయి. అందరూ వూహిస్తారు. సంకేతాలు వాడతారు. మనోవిశ్లేషణ సిద్ధాంతసారంగా ఫ్రాయిడ్ యీ సంగతి నొక్కి చెబుతాడు. ఫ్రాయిడ్ డాక్టరు. కాని అతని చికిత్సలో నయమైన రోగుల దాఖలాలు తక్కువ. అతని సిద్ధాంతాలు ప్రజాబాహుళ్యంలో తగ్గిపోతున్నా, కొన్ని మూలసూత్రాలు మాత్రం చర్చలో మిగిలాయి. బాధాకరమైన కోర్కెల్ని, వూహల్ని బలవంతంగా అణచివేస్తామనేది అందులో పేర్కొనదగింది. నోరుజారి మాట అనడంపై ఫ్రాయిడ్ వివరణ ఆకర్షణీయంగా మారింది. యంగ్ వంటి శాస్త్రపరుల పట్ల ఫ్రాయిడ్ రాగద్వేషాలు, సిద్ధాంత ప్రచారాలు సైకో ఎనాలసిస్ ఒక చికిత్సగా వ్యాప్తికి తేవడం, స్వప్నాలకు అర్థం చెప్పడం, యివన్నీ అతని ప్రజ్ఞకు నిదర్శనాలు. సనాతన మత నమ్మకాలు గల కుటుంబంలో పుట్టిన ఫ్రాయిడ్ తనకు నాస్తికుడుగా, అజ్ఞేయవాదిగా పేర్కొన్నాడు. కాని జీవితమంతా యూదుగానే వున్నాడు. యూదు సంస్కృతి, ఆచార వ్యవహారాలు, అలవాట్లు ఫ్రాయిడ్ పాటించాడు.

వైద్యునిగా ఆరంభం

వియన్నా యూనివర్శిటీలో 1881లో ఫ్రాయిడ్ మెడిసిన్ డిగ్రీ పుచ్చు కున్నాడు. వియన్నా జనరల్ ఆస్పత్రిలో పనిచేశాడు. తరువాత 1883 నుంచీ నరాలపై దృష్టి పెట్టి అధ్యయనం చేస్తూ నిపుణుడుగా తేలాడు. పారిస్ లో అప్పటికే జీమార్టిన్ చార్కాట్ సుప్రసిద్ధుడుగా వున్నాడు. ఫ్రాయిడ్ 1885లో చార్కాట్ వద్ద అధ్యయనం చేశాడు. (1885-1886) తరువాత మెదడుపై ప్రత్యేక పరిశీలన మొదలెట్టి, రచనకు పూనుకున్నాడు. కాని అది ఎన్నడూ పూర్తి చేయలేదు. ఎందుకోమరి. నరాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఫ్రాయిడ్ తన తొలి రచన 1891లో వెలువరించాడు. నరాల విషయంలో అది గొప్ప గ్రంథంగా పేరొందింది. 1883లో నరాల పరిశీలన ఆరంభించిన ఫ్రాయిడ్ 1897 వరకూ అందులో నిమగ్ను డయ్యాడు. అది అతడి పరిశోధనగా దృష్టికి పరీక్షా సమయం. ఫ్రాయిడ్ కొత్తగా వైద్యం ప్రాక్టీసు చేస్తున్న రోజులలో ఎలక్ర్టో థెరపీ వుండేది. స్టడీస్ ఇన్ హిస్టీరియా అనే రచనలో ఫ్రాయిడ్ ఎలక్ట్రో థెరపీ ప్రస్తావన తెచ్చాడు.

ఫ్రాయిడ్ యిష్టపడిందీ, అసలు చికిత్సగా నమ్మిందీ మనోవిశ్లేషణ (సైకో ఎనాలసిస్) దీనివల్ల అతనికి పేరు, ప్రపంచ ఖ్యాతి వచ్చాయి. కొత్తపేర్లు ప్రచారంలోకి తేవడంలో, ఉపమానాలు వాడడంలో, గ్రీక్ రోమన్ గాథల నుండి ఉదాహరణలు స్వీకరించడంలో ఫ్రాయిడ్ దిట్ట. ముప్పయ్యవ యేట నరాల జబ్బులను కుదిర్చే డాక్టర్ గా జీవితాన్ని ఆరంభించిన ఫ్రాయిడ్ అనువాదాలు, పుస్తక సమీక్షలు చేసేవాడు. విద్యుత్ చికిత్స హిప్నాసిస్ (మోహనిద్ర) చికిత్సలు క్రమంగా విరమించి, కొత్త సిద్ధాంతంతో, సరికొత్త పదజాలంతో ఫ్రాయిడ్ తన ప్రాక్టీసు అవతారాన్నే మార్చేశాడు. అతన్ని ప్రపంచం గుర్తించింది. ఫ్రాయిడ్ మనో విశ్లేషణ సిద్ధాంతం రావడానికి ముందు జోసఫ్ బ్రాయర్ (1842-1925) చికిత్స ప్రభావం వుండేది. దీనిని కథార్ సిస్ అనేవారు. ఇది కేవలం రోగితో సంభాషించడం. గ్రీక్ పదం కథార్ సిస్ ను చికిత్సలో చేర్చుకున్నారు.

రోగిని ఒకపడక కుర్చీపై ఆసీనులయ్యేటట్లు చేసి, మాట్లాడుతూ, వింటూ పోవడం యీ కథారసిస్ చికిత్స ప్రత్యేకత. పడుకున్న రోగి పక్కనే డాక్టరు కూర్చొని, ఒకానొక లక్షణం పై ఆలోచన నిలిపి, అందుకు సంబంధించిన పాత జ్ఞాపకాలన్నిటినీ చెబుతూ పొమ్మంటారు. ఆలోచనలకూ రోగానికీ సంబంధం చూడడం యీ చికిత్సలో ప్రధానాంశం. ఈ విధంగా వివిధ పద్ధతులు ప్రయోగిస్తూ ఫ్రాయిడ్, 1896లో మొదటిసారిగా సైకో ఎనాలసిస్ అనే మాట వాడాడు. ఆ మాటే ప్రపంచప్రసిద్ధి చెంది, వాడుకలోకి వచ్చింది. దీనికి పితామహుడుగా ఫ్రాయిడ్ సుప్రసిద్ధుడయ్యాడు. సైకో ఎనాలసిస్ (మనోవిశ్లేషణ) ఒక ఉద్యమంగా తలెత్తింది. వివిధ దేశాలలో ఎందరో యీ చికిత్సను అనుసరించారు.

ఫ్రాయిడ్ జీవితంలో విలియం ప్లెస్ (1858-1928) చాలా ముఖ్యుడు. అతనితో జరిపిన ఉత్తరప్రత్యుత్తరాల వల్ల ఎన్నో లోతుపాతులు బయటపడ్డాయి. నరాల జబ్బుకు లైంగిక సంబంధమైన మూలం వున్నదని అతనివద్దే ఫ్రాయిడ్ గ్రహించాడు. సెక్స్ కారణాలుగా జబ్బులు వస్తాయని ఫ్రాయిడ్ అనేక ఉపమానాలు, కథలు, గ్రీకుగాథలు ఉదహరించి, విస్తారంగా వివరించాడు. పురుషులలో నరాల జబ్బు (న్యూరస్తేనియా) రావడానికి హస్తప్రయోగం కారణమని యిది యవ్వనారంభదశలో వస్తుందని అన్నాడు. యవ్వనదశలో స్త్రీలతో సంపర్కంగల పురుషులకు ఈ జబ్బు రాదన్నాడు. హస్తప్రయోగం వల్ల పిచ్చి వస్తుందనే నమ్మకం వైద్యరంగంలో ఫ్రాయిడ్ కాలం నాటికే బలపడి వుంది.
స్త్రీలలో హిస్టీరియాకు, నరాల జబ్బులకు యవ్వనారంభ దశలో బలవంతపు సెక్స్ ప్రయోగాలు కారణమని ఫ్రాయిడ్ అన్నాడు. పురుషులలో యవ్వనదశలో సెక్స్ ప్రయోగం రోగాన్ని రాకుండా చేస్తుంటే అదే సెక్స్ ప్రయోగం స్త్రీలలో రోగానికి దారితీస్తుందని ఫ్రాయిడ్ పరస్పర విరుద్ధనిర్ణయాలు చేశాడు.

ఫ్రాయిడ్ సెక్స్ సిద్ధాంతాలు ప్రపంచాన్ని బాగా ఆకర్షించాయి. తన సెక్స్ సిద్ధాంతాలకు తన సొంత అనుభవాలే కారణమని ఫ్రాయిడ్ పేర్కొన్నాడు. సంభోగంలో రేతస్సు ముందుగానే పడిపోవడం, తృప్తిగా సంభోగం జరగకపోవడం రోగ లక్షణాలకు దారితీస్తున్నట్లు ఫ్రాయిడ్ చెప్పాడు. సుఖరోగాలను కూడా ఫ్రాయిడ్ తన సిద్ధాంతంలో స్వీకరించాడు. అలాంటి రోగాలను ఆపవచ్చుగాని, పూర్తిగా నయం చేయలేమన్నాడు. గనేరియా, సిఫిలిస్ వంటి లక్షణాలు దృష్టిలో పెట్టుకొని ఫ్రాయిడ్ తన సెక్స్ సిద్ధాంతంలో వివరణ యిచ్చాడు. క్రమేణా సైకో ఎనాలసిస్ అనే ఫ్రాయిడ్ సిద్ధాంతం పుంజుకున్నది. హిస్టీరియా, కలలు, కోర్కెల్ని అణచుకోవడం, చిన్నతనంలో సెక్స్, అచేతనం అనే వాటిని ఫ్రాయిడ్ ప్రచారంలోకి తెచ్చాడు. ఇరవయ్యో శతాబ్దం ఆరంభంలోనే ఫ్రాయిడ్ తన సిద్ధాంత రచనలు లోకానికి చాటాడు. దీని ఆచరణకు ఉపక్రమించినవారు సైకో ఎనాలసిస్ ను ఒక ఉద్యమంగా స్వీకరించారు. ఎదురు చెప్పడానికి భయపడ్డారు. ఫ్రాయిడ్ పలుకుబడి అలా వుండేది.

మనోవిశ్లేషణ (సైకో ఎనాలసిస్)

ఫ్రాయిడ్ కనుగొన్నట్లు ప్రసిద్ధి చెందిన సిద్ధాంతం పేరు సైకో ఎనాలసిస్. అంటే మనోవిశ్లేషణ. అదొక ప్రపంచ ఉద్యమంగా వ్యాపించి, సంఘాలు వెలిశాయి. అంతర్జాతీయ సంఘాధ్యక్షులుగా సుప్రసిద్ధ మనోవైజ్ఞానికుడు కార్ల్ యుంగ్ ను పెట్టి ఫ్రాయిడ్ ప్రచారం చేశాడు. వియన్నా సంఘాధ్యక్షుడుగా మరో మనో వైజ్ఞానికుడు యాడ్లర్ వున్నాడు. 1906 నాటికే ఫ్రాయిడ్ తన వినూత్న సిద్ధాంతాలు రాసి, ప్రచారంలో పెట్టాడు. వాటిని అమలులోకి తెచ్చాడు. ఎదురులేని విధంగా యీ సిద్ధాంతాలు అతిత్వరలో అల్లుకుపోయాయి. వైజ్ఞానిక దృక్పధంతో పరీక్షకు నిలుస్తాయా లేదా అని చూడదలచినవారు మైనారిటీ అయ్యారు. అలాంటివారు విమర్శలు ఆనాటి ప్రచారంలో కొద్ది మందికే చేరాయి.

హిస్టీరియా అంటే ఏమిటి, అణచివేతకు అర్థం ఎలా చెప్పాలి, కలలు వాటి స్వభావం, చిన్నప్పటి సెక్స్ ప్రవృత్తి, అచేతనం బలం గురించి ఫ్రాయిడ్ చెప్పినవి ఆకర్షణీయంగా అంటుకుపోయాయి. సైకో ఎనాలసిస్ రంగంలో ఫ్రాయిడ్ సిద్ధాంతాలు ప్రచారంలో పెట్టడానికి యాంగ్ యాడ్లర్ కు తోడు, కార్ల్ అబ్రహం, విల్ హెల్మ్ స్టెకల్ వంటివారు బాగా కృషి చేశారు. ఫ్రాయిడ్ అనంతరం కారన్ హార్నే, హారీస్టాక్ సల్లివన్, ఎరిక్ ఫ్రాంలు యీ రంగంలో నిలిచి పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి గాంధి ఎలా వుండేవారో, సైకో ఎనాలసిస్ సంఘానికి ఫ్రాయిడ్ అలా నిలిచాడు. పదవులు నిర్వహించకపోయినా, పెత్తనం చేశాడు. ఆయన మాట చెల్లింది. వ్యతిరేకుల్ని చిత్తు చేసి నెగ్గుకురావడంలో ఫ్రాయిడ్ ఆరితేరాడు. యూంగ్, యాడ్లర్ క్రమేణా తమ సొంత వ్యాఖ్యానాలతో ఫ్రాయిడ్ కు దూరం అయ్యారు. అయినా ఫ్రాయిడ్ పలుకబడి తగ్గలేదు. సైకో ఎనాలసిస్ పై సర్వహక్కులూ తనకే వున్నాయని, అందులో అక్షరం మార్చాలన్న తన అనుమతి కావాలన్నట్లు ఫ్రాయిడ్ ప్రవర్తించాడు. మార్పులు చేసే హక్కు తన ఒక్కడికే వున్నదని చూపాడు. ఈ నేపధ్యంలో సైకో ఎనాలసిస్ సిద్ధాంతం ఆచరణ ఎలా సాగిందో గమనిద్దాం.

ఇది 20వ శతాబ్దపు విచిత్ర కథనం. ఫ్రాయిడ్ గొప్పతనం గమనార్హం. సైకో ఎనాలసిస్ లో మాట్లాడడమే ముఖ్యం. అటు వైద్యుడు, ఇటు రోగి ఇద్దరే వుంటారు. ఒకరు మాట్లాడుతుంటే మరొకరు వింటారు. రోగిని మాట్లాడనిచ్చి, అతని పదాలలో అర్థాన్ని గూఢార్థాన్ని సంకేతాలను విప్పి చెప్పడం సైకో ఎనాలసిస్ చికిత్స. ఈ విద్యలో ఫ్రాయిడ్ ఆరితేరినవాడు. గ్రీకు, రోమన్ గాథల నుండి ఎంతో అరువుతెచ్చి ఫ్రాయిడ్ తన రచనల్లో వాడాడు.

ఫ్రాయిడ్ మూలాధారం ఆవ్యక్త మనస్సు. అదే వ్యక్తుల్ని కదలించి, నడిపించి, మాట్లాడిస్తుంది. అంటే మానవుడిని అవ్యక్త మనస్సు నిర్దేశిస్తుంది. మానవుడు స్వేచ్ఛగా ఇచ్ఛాపూర్వకంగా ప్రవర్తించే శక్తిమంతుడు అనుకోవడం సరికాదు. మానవుడి ప్రవర్తన గురించి ది సైకో పాథాలజీ ఆఫ్ ఎవ్విరిడే లైఫ్ లో ఫ్రాయిడ్ వివరించాడు. దీని ప్రకారం స్వేచ్ఛగా ప్రవర్తించే అవకాశం లేదు. అవ్యక్త మనస్సు నడిపిస్తుంది. అవ్యక్తత నుండి ప్రవహించేవన్నీ మన చేతన దశను ప్రభావితం చేస్తాయి. ఇది తిరుగులేని విషయంగా ఫ్రాయిడ్ పేర్కొన్నాడు. మార్టిస్ లూథర్, లియొనార్డో వంటి సుప్రసిద్ధ వ్యక్తుల ప్రవర్తన తన అవ్యక్త సిద్ధాంతాన్ని బలపరుస్తున్నట్లు చెప్పుకున్నాడు. ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతంలో చాలా వినూత్న ప్రయోగాలు, పదాలు, ఉపయోగాలు, కథలు కనిపిస్తాయి. అందులో గ్రీకుకథగా వుంటూ వచ్చిన ఒడిపస్ విషయాన్ని ఫ్రాయిడ్ స్వీకరించాడు. దీనినే ఒడిపస్ కాంప్లెక్స్ అంటారు. మనో విశ్లేషణలో కీలకపాత్ర వహించిన ఒడిపస్ కథను 1910లో మొదటిసారి ఫ్రాయిడ్ రంగం మీదకు తెచ్చాడు. ఫ్రాయిడ్ సెక్స్ సిద్ధాంతంలో మూల విషయంగా యిది పరిణమించింది. చిన్నతనంలో ఆరంభమయ్యే సెక్స్ ఆలోచన, ప్రవర్తన పెద్దదయిన తరువాత ఎలా ప్రభావితం చేస్తుందో చూపడానికి యీ కథను ఫ్రాయిడ్ వాడుకున్నాడు. ఫ్రాయిడ్ ప్రకారం ఏడాది వయస్సుకే పిల్లవాడికి తల్లిపై లైంగిక ప్రేమ అంకురార్పణ జరుగుతుంది. ఆడపిల్లలకు తండ్రిపై అలాంటి యిచ్ఛ వుంటుంది. ఇదే తండ్రిపై ద్వేషంగా పిల్లవాడిలోనూ, తల్లిపై ద్వేషంగా కుమార్తెలోనూ అంకురార్పణ అవుతుంది. దీనినే ఒడిపస్ కాంప్లెక్స్ గా చెబుతున్నారు. కానీ అసలు కథకి ఎన్నో వక్రీకరణలు చేశారు. కనుక మూలం ఏమిటో తెలిస్తే గానీ ఫ్రాయిడ్ విశ్లేషణల విశ్వసనీయత బయటపడదు.
రెండో భాగం లొ

ఒడిపస్ కథ ఏమిటి?

Saturday, June 21, 2008

సాహితీ పరులతొ సరసాలు 30 - సి నా రె


C. Narayana Reddy

సింగిరెడ్డి నారాయణరెడ్డి

ఉస్మానియా విశ్వవిద్యాలయం (హైదరాబాద్)లో సి.నా.రె. తెలుగు లెక్చరర్ గా వున్నప్పుడు, నేను కొన్నాళ్ళు ఫిలాసఫీ శాఖలో లెక్చరర్ గా (1967-68) పరిశోధకుడుగా పనిచేశాను. అప్పుడే మా పరిచయం ఆరంభమైంది.
నూరుల్ హసన్ కేంద్ర మంత్రిగా వున్న రోజుల్లో చరిత్ర గ్రంథాలను భారతీయ భాషల్లోకి అనువదించే పధకం తెచ్చారు. హిస్టారికల్ రీసెర్చ్ వారు తలపెట్టిన పుస్తకాలలో ఎం.ఎన్. రాయ్ రాసిన “మారుతున్న భారత దేశం” (India in transition) తెలుగు అనువాదం నేను చేపట్టాను. సినారె పరిష్కర్త, మొదటి ప్రతి రాసి, ఆయన దగ్గర చదివితే, సులభంగా అర్థం అయ్యేట్లు తెనిగించడం అవసరమని సలహా యిచ్చారు. నా ప్రథమ అనువాద ప్రతి కృత్రిమంగా వున్నట్లు భావించారు. నేనందుకు అంగీకరించి, మొత్తం తిరగరాశాను. ఆపథకం కొనసాగనందున, తెలుగు అకాడమీ వారు ప్రచురణకు స్వీకరించారు. కాని మారుతున్న భారత దేశం వెలుగు చూడలేదు. పరిష్కర్తగా సినారెకు, అనువాదకుడిగా నాకు కొంత డబ్బిచ్చారు. అలా మొదలైన మా పరిచయం స్నేహంగా మారింది.

నా పుస్తకాల, అనువాదాల సమావేశం 1988 లో తెలుగు అకాడమీ హైదరాబాద్ లో ఏర్పరచారు. ఎం.ఎన్. రాయ్ రచనలు, ఒక సెట్ గా విడుదల చేశారు. వైస్ ఛాన్సలర్ నవనీతరావు అధ్యక్షత వహించగా, సినారె ప్రధాన వక్త. ఆ రోజు సినారె రివ్యూ ప్రసంగం విని, జర్నిలిస్ట్ వి. సతీష్ (నాడు డేటా న్యూస్ ఫీచర్స్ లో, (నేడు జెమిని టి.వి.లో) పనిచేశారు). నాలుగు పెగ్గుల స్కాచ్ విస్కీ పుచ్చుకున్నట్లున్నదన్నారు.

ఎం.ఎన్. రాయ్ బృహత్తర గ్రంథం రీజన్ రొమాంటిసిజం రెవల్యూషన్ అనే రచనకు నేను వివేచన, ఉద్వేగవాదం, విప్లవం అని తెనిగించాను. సాహిత్యంలో ఉద్వేగం అనే పదానికి వున్న అర్థం వేరనీ, యీ రచనలో భావాన్ని నేను మరో కొత్త కోణంలో వివరించానని సినారె చెప్పారు. మొత్తం మీద అనువాదాలు చదివి, విశేషాలతో గంట ప్రసంగించారు.
సినారె తరువాత తెలుగు యూనివర్శిటి, ఓపెన్ యూనివర్శిటి వైస్ ఛాన్సలర్ అయ్యారు.
తెలుగు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గా సినారె కు విజ్ఞప్తి చేస్తూ జ్యోతిష్యం అశాస్త్రీయమని, కోర్సుగా తగదని, విద్యార్థులకు జ్యోతిష్యం డిగ్రీలు యివ్వాలంటే శాస్త్రీయం అని సాక్ష్యాధారాలు చూపాలన్నాం.సినారే మా వాదనతో అంగీకరించి, శాస్త్రీయత చూపమని శాఖను అడిగారు. దీనిపై జ్యోతిష్యశాఖ సలహాదారుగా వున్న బెంగుళూరు జ్యోతిష్యుడు రామన్ మండిపడ్డాడు. సినారేపై నాటి ముఖ్యమంత్రి తదితరులకు ఫిర్యాదు చేశాడు. సినారె వెనక్కు తగ్గలేదు. అంతటితో ఆగక, నాకూ కొత్తపల్లి వీరభద్రరావుకూ తన ఛేంబర్ లో వాదోపవాదాలు పెట్టారు. ఉభయులవాదనా విని, సాక్ష్యాధారాలు చూపాల్సిందే అనే నావాదన వైపు మొగ్గారు.



Innaiah addressing the meeting in Ravindra Bharati Mini theatre-1973.
Sitting Right to left: C.Narayana Reddy, Sanjivadev, Mohanarao (Librarian,S.C.E.R.T) with child
Second row extreme left, behind Sinare : cbrao

సంజీవదేవ్ హైదరాబాద్ రాక సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశాను. అందులో సినారె వచ్చిపాల్గొని ప్రసంగించారు.

మిసిమిఎడిటర్ రవీంద్రనాథ్, నేనూ, సినారే అనేక పర్యాయాలు కలసి కూర్చొని, కబుర్లు చెప్పుకుంటూ, విస్కీ తాగాం. సినారేకు విస్కీ, కోడి మాంసం యిష్టం. అడిగి మరీ పెట్టించుకొని ఆనందించేవారు. బాగా కబుర్లు చెప్పేవారు. కాని విమర్శ సహించేవారు కాదు.Telugu Literary Personalities పై డి. ఆంజనేయులు ఇంగ్లీషులో ప్రచురించిన పుస్తకంలో (Publisher: P.Lal of Kolkataa) తనపై రాసిన విషయం పట్ల సినారె మండిపడ్డాడు. ఆంజనేయులు చాలా సమతూకంలో రాస్తూ, నిశిత వ్యాఖ్యానాలు చేశారు. అది సినారెకు నచ్చలేదు. ఆయనకు స్తోత్ర పాఠమే కావాలి. నేను ఆంజనేయులు వాదనవైపే మొగ్గాను.


నారాయణ రెడ్డి సభలలో మాట్లాడేటప్పుడు అందరూ శ్రద్ధగా వినాలని, నిశ్శబ్దంగా వుండాలని కోరేవాడు. సభలో ప్రథమ స్థానం, ప్రాధాన్యత కావాలనుకునేవాడు. తనకు గౌరవ ప్రదంగా యిచ్చిన బిరుదులు విధిగా ఇన్విటేషన్ లో వేయాలనేవాడు. కాని ఇతరులు మాట్లాడేటప్పుడు సినారే క్రమశిక్షణ పాటించేవాడుకాదు. సభారంజకంగా శబ్ద చమత్కారాలతో మాట్లేడే సి.నా.రే, బాగా డిమాండ్ లో వుండేవాడు.

నేనూ హేతువాదినే అని నాతో చెబుతుండేవాడు. తాను గుడులచుట్టూ ప్రదక్షణ చేయనని, బాబాలకు మొక్కనని, వారి సభలకు వెళ్ళననేవారు. కాగా, హేతువాదుల వలె బయటబడి ప్రచారానికి పూనుకోననేవారు.

సాహిత్య రంగంలో శ్రీశ్రీ పట్ల సినారేకి బాహట పోరాటమే వుండేది. సినారే భళారే, దేనికైనా సరే అంటూ శ్రీశ్రీ ఆయన్ను ఎద్దేవాచేశారు.
ఒకప్పుడు తెలంగాణా యువ జంటలుగా పేరొందిన దాశరథి (కృష్ణమాచార్య) సినారేలకు తరువాత అభిప్రాయ భేదాలు వీధికెక్కాయి. సినారే గత చరిత్ర విమర్శిస్తూ దాశరథి చెప్పారు.

అనేక సందర్భాలలో సినారే నేను కలసినప్పుడు, తన రచనలు సంతకం చేసి నాకు యిచ్చిన సినారే, నా రచనలు కూడా అలాగే స్వీకరించారు. ఆచార్య రంగా ఆయన యింట్లో అద్దెకుండేవారు కొన్నాళ్ళు. హైదరాబాద్ అశోక్ నగర్ లో, రంగా గారిని కలియడానికి వెళ్ళినప్పుడు సినారెని పలకరించేవాడిని. ఆతరువాత జూబ్లిహిల్స్ లో ఫిలింనగర్ క్లబ్ వద్ధ సినారే స్థిరపడ్డారు.

ఓపెన్ యూనివర్శిటి వైస్ ఛాన్సలర్ గా సినారే ఏమంత సమర్థ పాలన చేయలేదు. అది ఆయన రంగం కాదు. అప్పుడు కలుస్తుండేవాడిని. ఒకసారి వెడితే, ఒక ఆకాశ రామన్న ఉత్తరం చూపెట్టారు. నేను వైస్ ఛాన్సలర్ ను ఉద్దేశించి రాసినట్లున్నది.
నేను చెప్పినట్లు వినకపోతే మంచిది కాదని హెచ్చరిస్తున్నట్లున్నది. నాకు చూపినప్పుడు, నవ్వుకొని, దొంగ ఉత్తరం అనీ, ఎవరో చిలిపిగా రాశారని అనుకున్నాం. అంతటితో ఆగింది. కాని అలాంటి ఉత్తరమే ఢిల్లీలో ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ గా వున్న జి. రాంరెడ్డికి వచ్చింది. ఆయన అది నిజమేనని నమ్మి, నాకు ఫోను చేశాడు. అబద్ధమని చెప్పాను.
ఆ తరువాత ఒక సెమినార్ లో జి. రాంరెడ్డి ఓపెన్ యూనివర్శిటీ అసలు ఉద్దేశం అమలు పరచకుండా, తన వంది మాగధులతో పోస్టులు నింపి, సంప్రదాయ యూనివర్శిటి వలె నడిపాడని విమర్శించాను.

రామిరెడ్డి శిష్యులకు అది నచ్చలేదు. నా విమర్శకు రాంరెడ్డి బెంబేలెత్తి, నాకు వ్యతిరేకంగా ప్రచారం చేయమని, అందరినీ కలసి చెప్పమనీ, ఢిల్లీ నుండి పురమాయించాడు. ఎన్.టి. రామారావు ముఖ్యమంత్రిగా వున్న కాలం అది. ఓ పెన్ యూనివర్శిటీ వారు సినారె నాయకత్వాన ముఖ్యమంత్రిని, అధికారులను, మంత్రులను, పత్రికల వారిని కలసి నాపై ప్రచారం చేశారు. దీని వలన నిష్ర్పయోజన మని నెలరోజులు తిరిగిన తరువాత తెలుసుకున్నారు. చాలా కాలం జి. రాం రెడ్డితో ఎడముఖం పెడముఖంగా వున్న సినారె, పదవుల వలన రాంరెడ్డికి యింత ప్రాధాన్యత యిచ్చారు. అదంతా వృధాశ్రమ అని తెలిసీ రాంరెడ్డి బంధుత్వం, పదవి దృష్ట్యా అలా చేశారు.

పింగళి జగన్మోహన రెడ్డి ప్రధాన న్యాయమూర్తిగా రిటైడ్ అయిన తరువాత, ఉస్మానియా విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్ గా క్రమశిక్షణ తెచ్చారు. అప్పుడు జి. రాం రెడ్డి చేసిన తప్పుడు పనులు తెలిసి, తరువాత పుస్తకం రాశారు. రాం రెడ్డి గుట్టు బయట పెట్టారు. ఇంగ్లీషులో The university I served అని రాశారు. అది నేను తెనిగించాను. తెలుగు యూనివర్శిటీ వారు దానిని వేయడానికి అంగీకరించారు. ఆ లోగా వైస్ ఛాన్సలర్ మారి, సినారే వచ్చారు. రాం రెడ్డికి భయపడి వేస్తామన్న పుస్తకాన్ని పక్కన బెట్టారు. సినారే పక్షపాతం, పిరికితనం అలా వెల్లడయ్యాయి.

సినారే పబ్లిక్ డిమాండ్ వలన తానా, ఆటా సభలకు, అమెరికా ఇంకా కొన్ని యితర దేశాలు పర్యటించారు. సినిమాలలో కొంత వరకే రాణించారు. తరువాత ఆ రంగం నుండి విరమించారు. తెలుగు కవిత్వం, సాహిత్యంపై పిహెచ్ డి పుచ్చుకున్నారు.
జి. రాం రెడ్డి చనిపోయిన తరువాత మళ్ళీ సినారె నాతో మామూలుగా ప్రవర్తించారు. అధికార భాషా సంఘాధ్యక్షుడుగా సినారే ఏమీ చేయలేకపోవడంలో ఆశ్చర్యం లేదు. పరిపాలనలో ఆయన మనస్సు పెట్టలేదు. తన భార్య పేరిట సాహితీ పురస్కారం ఏర్పరచాడు. ఆయనకు కుమార్తెలు వున్నారు. వారికి నదులు పేర్లు పెట్టారు. తెలంగాణా ఆంధ్రవివాదంలో, సమైక్య రాష్ట్రం వుండలన్నారు. ఆలపాటి రవీంద్రనాథ్ కు అమెరికా నుండి వచ్చిన బోగస్ డాక్టరేట్ డిగ్రీ సందర్భంగా సమావేశం ఏర్పరచి, ఆహ్వానిస్తే, సినారే నిరాకరించారు. ముందు డిగ్రీ సరైనదని నిర్ధారణ కావాలన్నారు. అలాంటి ఔచిత్యం పాటించిన సినారే, కుల పక్షపాతం పోగొట్టుకోలేదనే విమర్శ వుంది. కవితలలో అలాంటిది కనిపించదు.

రచనలు : కర్పూర వసంత రాయలు, విశ్వనాధ నాయకుడు, నాగార్జున సాగరం.
చదువు : ఉర్ధూ మీడియంలో
సినిమా పాటలు :
కవితలు : తెలుగు స్వతంత్ర
పద్యాలు : ఆంధ్రప్రభ, భారతి
ఉర్దూ, హిందీ : గజల్స్, రుబాయిలు
గేయనాటిక : అజంతా సుందరి

Saturday, June 14, 2008

Sahiti parulato sarasaalu 29

కావ్యజగత్తులో జి.వి. కృష్ణారావు

(1914-1979)

సాహిత్యంలో రామణీయకతల్ని చూపి, సిద్ధాంతీకరించిన గవిని వెంకట కృష్ణారావు కూచిపూడి (తెనాలి తాలూకా, గుంటూరు జిల్లా)కు చెందిన పండిత కవి.

ఒరే, జనానికి అర్ధమయ్యేటట్లు రాయమని ఆయన మిత్రుడు ఎలవర్తి రోసయ్య అంటుండేవారు.

బి.ఎ. వరకూ చదివిన కృష్ణారావు తెనాలి వి.ఎస్. ఆర్. కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా, విజయవాడలో ఆలిండియా రేడియోలో ప్రోగ్రాం డైరెక్టర్ గా ఉద్యోగాలు చేశారు. బి.ఎ. డిగ్రీతోనే పి.హెచ్.డి. సంపాదించగలిగారు. కళాపూర్ణోదయం (పింగళి సూరన ప్రబంధ కావ్యం)పై ఇంగ్లీషులో సిద్ధాంతం రాసి మద్రాసు యూనివర్శిటీకి సమర్పించారు. కొంత తాత్సారం చేసిన ఎగ్జామినర్లు చివరకు డిగ్రీ యిచ్చారు. ఆ సిద్ధాంతాన్ని నేను తెలుగులోకి అనువదించాను. కొన్ని భాగాలు గోలకొండ పత్రికలో (హైదరాబాద్ నుండి వెలువడేది) ఆదివారాలు సీరియల్ గా 1962 ప్రాంతాల్లో ప్రచురించారు.

1940 నుండీ జి.వి. కృష్ణారావు మానవ వాద ప్రభావితుడై, ఎం.ఎన్. రాయ్ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యాడు. ఆంధ్రప్రభలో నార్ల వెంకటేశ్వరరావు ఆయన కళాసిద్ధాంత రచనల్ని ప్రోత్సహించారు. రాయ్ రచన తెలుగులో వర్గ సంబంధాలుగా కృష్ణారావు అనువదించారు. ఆయన కావ్య జగత్తు రామణీయకతల లోతుపాతుల్ని చూపింది.

కృష్ణారావు గద్యపద్య రచనలు చేశారు. నాటికలు రాశారు. నవలలు కథలు ఎన్నో రాశారు. అందులో కీలుబొమ్మలు మంచి ఆదరణ పొందింది. పాపికొండలు నవల పూర్తి కాకుండానే ఆగిపోయింది.

కృష్ణారావు వక్తకాదు. ఆకర్షణీయంగా కాకున్నా ప్రసంగాలు చేసేవాడు. ఆయన జీవితమంతా ఉబ్బసవ్యాధితో (ఆస్తమా) తీవ్రబాధ పడ్డారు. చివరి రోజులలో హైదరాబాద్ లో వున్నారు.

1955 నుండీ కృష్ణారావులో నాకు సన్నిహిత పరిచయం వుంది.

ఎం.ఎన్. రాయ్ సిద్ధాంతాలలో ముఖ్యంగా 22 సూత్రాలలో కొన్నిటితో విభేదించినట్లు చెప్పేవారు మానవుడు ప్రాయకంగా హేతువాది (Man is essentially rational) అనేది ప్రశ్నార్థకం అనేవారు. నిర్థారితవాదం, స్వేచ్ఛాపూరిత యిచ్ఛ అనేవాటిలో కూడా సందేహాలున్నాయనేవారు. కాని మార్గాంతరాలు సూచించలేదు.

కృష్ణారావు బాగా చదివేవారు. అధునాతన పాశ్చాత్య రచయితల్ని బాగా స్టడీచేసేవారు. తెనాలిలో అనేక సందర్భాలలో ఆయనతో కూర్చొని యిష్టా గోష్టి చర్చలు చేశాం. హైదరాబాద్లో యింటికి వెళి పరామర్శ చేసేవాడిని. రాడికల్ హ్యూమనిస్ట్ అధ్యయన శిబిరాలకు వచ్చి కృష్ణారావు ఉపన్యాసాలు చేసేవారు.

రచనలు : - Ph.D. Thesis Studies on Kalapoornodayam, విగ్రహ వ్యావర్తిని (అనువాదం), జే గంటలు (ప్లేటో తత్వం), ప్లేటో రిపబ్లిక్ అనువాదం (ఆదర్శ రాజ్యం), వరూధిని, శివరావు, యుగసంధ్య (కావ్యాలు), భిక్షాపాత్ర (నాటిక), బొమ్మఏడ్చింది (నాటకం), ఆదర్శ శిఖరాలు (నాటికలు), కీలు బొమ్మలు (నవల), పాపికొండలు (నవల), రాగరేఖలు (నవల), జఘనసుందరి (నవల), చైత్రరథం (కథలు), వర్గ సంబంధాలు (ఎం.ఎన్. రాయ్ రనచ అనువాదం).

Sunday, June 8, 2008

Sahiti parulato sarasaalu 28

ఫండిత గొర్రెపాటివెంకటసుబ్బయ్య

(1898-1982)




వూళ్ళో వాళ్ళు ఎర్ర వెంకటసుబ్బయ్య అనేవారు. బయటి వారు పండిత అని చేర్చారు. మరో వెంకట సుబ్బయ్య నల్లగా వుండడం, ఇరువురూ ఆచార్యరంగా అభిమానులు గావడం వలన, తేడా కోసం అలా జరిగింది.


విజయవాడలో 1960 ప్రాంతాలలో ఆయనతో పరిచయమైంది. మంచి మనస్సు గల వ్యక్తి. ఆయన అల్లుడు బొందలపాటి శివరామకృష్ణ దేశి కవితా ప్రచురణల ద్వారా పుస్తకాలు వెలువరిస్తుండేవారు. వెంకట సుబ్బయ్య గారి కుమార్తె శకుంతలా దేవి కూడా కొన్ని రచనలు చేశారు. ఆంధ్రలో శరత్ సాహిత్యాన్ని ఇంటింటా ప్రచారం కావడానికి వీరే కారణం. వెంకట సుబ్బయ్యగారి రచనలు కూడా దేశి కవితా వారే ముద్రించారు. అనేక పర్యాయాలు వారిని కలసి ముచ్చటించాం. విషయ సేకరణ ఆసక్తిగలవారు. అయితే ఒక క్రమపద్ధతి వుండేదికాదు.

వెంకటసుబ్బయ్య గారి రచనలలో జీవిత చిత్రణలు ఎక్కువ. ఆచార్య రంగాను గురించి పుస్తకం రాస్తే అందులో రంగాను ఎక్కడ ప్రస్తావించరో వెతుక్కో వాల్సిందే. అనేక పూర్వాపరాలు, ఉదంతాల మధ్య అసలు విషయం యిరుక్కొని వుండేది. రచయితగా ఆసక్తి వున్నది గాని, చరిత్ర రచనలో శిక్షణ లోపం బాగా కనిపించేది. ఆయన దగ్గర కూర్చొని మాట్లాడినప్పుడు కూడా సంభాషణలు ఎటో వెడుతుండేవి.

రచనలు : ఆచార్య రంగా, ప్రకాశం, సరోజనీదేవి, సి. ఆర్. రెడ్డి, గొట్టిపాటి బ్రహ్మయ్య వల్లభాయి పటేల్, లాలాలజపతిరాయ్, చలం, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, నవ మేధావి నార్ల, శరద్దర్శనం, అక్షరాభిషేకం మన జమిందారీలు, ఘంటసాల చరిత్ర.





1

Tuesday, June 3, 2008

సాహితి పరులతో సరసాలు 27












శ్రీపాద గోపాలకృష్ణమూర్తి

(1901-1977)

చదివింది ఫిజిక్స్. నమ్మింది జిల్లెళ్ళమూడి అమ్మమహిమను. అన్నిటా ప్రవేశం. లండన్ లో పి.హెచ్.డి. చేసిన శ్రీపాద గోపాలకృష్ణ మూర్తితో, ఆయన చివరి దశాబ్దంలో పరిచయమైంది. చాలా సన్నిహితంగా కలసి పోయాం. అప్పట్లో నేను పి.హెచ్.డి. చేస్తూ, గోపాల కృష్ణమూర్తిని సంప్రదించేవాడిని. ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ నా టాపిక్ గావడం వలన, ఆయన కూడా ఆసక్తిగా చర్చించేవారు. విభేదించినా, స్నేహం పెరిగింది.
హైదరాబాద్ లో ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయంలో సైన్స్ ప్రాజెక్టులో గోపాలకృష్ణమూర్తి పని చేస్తుండేవారు. 1968 నాటి మాట. ఇద్దరం మధ్నాహ్నాలు లంచ్ తింటూ అనేక చర్చలు చేసేవాళ్ళం.
నేను ఏర్పాటు చేసిన చర్చా గోష్టులలో గోపాలకృష్ణమూర్తి పాల్గొనేవారు. బర్కత్ పురాలో ఆసియన్ స్టడీస్ కేంద్రంలో ఆధునిక కవితా పోకడలపై చర్చ జరిపాం. అందులో అప్పుడే ప్రారంభమైన దిగంబర కవులంతా పాల్గొన్నారు. గోపాలకృష్ణ మూర్తి గారి ప్రసంగంతో చర్చ ఘాటుగా సాగింది. నగ్నముని (కేశవరావు, అసెంబ్లీలో రిపోర్ట్ ర్) జ్వాలాముఖి (బి.ఎ.లో ఫెలాసఫీ తరగతులలో నా స్టూడెంట్), చరబండరాజు, భైరవయ్య, అంతా వచ్చారు.
గోపాలకృష్ణమూర్తి అప్పటికే కవితా ధోరణులపై పత్రికలో రాశారు. భారతిలో ఎప్పటి నుండో రాస్తున్నారు. ఆయన ప్రవేశించని రంగం అంటూ లేదు. కళలు, శిల్పం, దేవాలయాలు, కవిత్వం, సైన్స్ వుండేవి. వినువీధుల శీర్షికన సైన్స్ ఎంతో చక్కగా అందరికీ అర్థం అయ్యే శైలిలో వివరించారు.
నేను తరచు గోపాలకృష్ణ మూర్తి యింట్లో కలసి, భోం చేస్తూ చర్చలు చేశాం. ఆయన ద్వారకా పురి కాలనీలో అల్లుడి యింట్లో వుండేవారు. (అల్లుడు రామారావు ఐ.ఎ.ఎస్. ఆఫీసర్). ఎటోచ్చీ జిల్లెళ్ళమూడి అమ్మ విషయమై తీవ్ర స్థాయిలో విభేదించాం. తన సైన్స్ జ్ఞానాన్ని అడ్డం పెట్టుకొని జిల్లెళ్ళ మూడి అమ్మ మాటలకు భాష్యం చెప్పేవాడు. అది కేవలం సైన్స్ ను దుర్వినియోగం చేయడమని నేను విమర్శించే వాడిని. అయినా మా స్నేహానికి యీ విభేదాలు అడ్డు రాలేదు. జిల్లెళ్ళ మూడి అమ్మ గుట్టు బయట పెడుతూ మల్లాది రామమూర్తిచే పుస్తకం రాయించి, స్టేట్ బుక్ క్లబ్ పక్షాన ప్రచురించాను. అందరూ అవాక్కయ్యారు.
గోపాలకృష్ణ మూర్తి గారు నా సిద్ధాంత వ్యాసంలో భాగాలు విని, నియతి వాదంపై ఎం.ఎన్. రాయ్ వాదనలు బాగున్నాయన్నారు. సూరి భగవంతం అప్పటికే సత్యసాయి బాబా శిష్యుడుగా వున్నారు. ఆయన్ను దుయ్యబట్టేవారు శ్రీపాద. సాయిబాబాను ఖండించేవారు. గోపాలకృష్ణమూర్తి గారు టీచర్ గా, ప్రిన్స్ పాల్ గా చేశారు. బాగా పాఠాలు చేప్పేవారు.
పరిశోధనా తత్వంగల శ్రీపాద, వరంగల్లు ప్రాంతంలో దేవాలయాలు పరిశీలించారు. బౌద్ధ ఆరామాలను హిందూ దేవాలయాలుగా మారిన తీరుపై రాశారు. తిరుపతిలో వెంకటేశ్వర విగ్రహం స్త్రీ రూపంలో వుంటుందన్నారు. ఆయన రచనలు రాష్ట్ర ఆర్కియిలాజికల్ శాఖ ప్రచురించింది.
సాహిత్యంలో ఎన్నో వాదోపవాదాలలో పత్రికా ముఖంగా చర్చించారు. నండూరి రామమోహన రావు తెలుగులో సైన్స్ రచనలు చేయగా అందులో విపరీత దోషాలను, రచయిత అర్థం చేసుకోకుండా రాసిన అంశాలను శ్రీపాద ఎత్తి చూపి, ఘాటుగా విమర్శించారు. నండూరికి దిమ్మ తిరిగింది.
రచనలు : లేపాక్షి కళామండపం, స్వర కల్పన, కవితా పరిశీలనం, దేశి సారస్వతం, ఏకాంకికా పరిచయం, దాక్షిణాత్య శిల్పం, విజ్ఞాన వీధులు (సైన్స్), స్త్రీ ల పాటలు (సేకరణ), విజ్ఞాన సర్వస్వంలో భౌతిక శాస్త్రం పై రచన.

Monday, June 2, 2008

సాహితీ పరులతో సరసాలు 26







బెజవాడ గోపాల్ రెడ్డి
(1907-1997)
మిసిమి ఎడిటర్, మిత్రులు ఆలపాటి రవీంద్రనాథ్ నన్ను బెజవాడ గోపాలరెడ్డికి పరిచయం చేశారు. హైదరాబాద్ వచ్చినప్పుడు జూబ్లిహిల్స్ లో మాగంటి సుబ్బరామి రెడ్డి గెస్ట్ హౌస్ లో వుండే గోపాలరెడ్డి నాకు ఫోను చేస్తే వెళ్ళి కలసి కాలక్షేపం చేసేవాడిని ‘ఆమె’ కవితల రచనలు చేస్తున్న కాలం గనుక, అవి చదివి వినిపించేవారు. చక్కగా కబుర్లు చెప్పేవారు. కలసి సమావేశాలకు వెళ్ళేవాళ్ళం. ఇదంతా గోపాలరెడ్డి చివరి కాలంలో మాట.
అప్పటికి ఆయన పదవులనుండి రిటైర్ అయినందున, రిలాక్స్ అయ్యారు. ఆయన ఆహ్వానంపై నెల్లూరు వెళ్ళి కలిశాను. చాలా సింపుల్ గా ఎలాంటి భద్రతా దళం లేకుండా, సిబ్బంది సైతం లేకుండా వున్నారు.
అరమరికలు లేకుండా అనేక పాత సన్నివేశాల గురించి అడిగే వాడిని. కొన్నిటికి సమాధానం చెప్పేవారు. విశ్వనాథ సత్యనారాయణకు జ్ఞానపీఠ అవార్డు యిప్పించడంలో తన కీలకపాత్ర వున్నట్లు అంగీకరించారు. వివాదాస్పద రాజకీయాలు ప్రస్తావనకు వస్తే దాటేసేవారు.
ఆయన రచనలు కొన్ని చదివాను. బెంగాలీ అనువాదాలు కృత్రిమంగా వుండేవి. బెంగాల్ లో శష్పం అంటే పచ్చగడ్డి అట. తెలుగులో ఆ మాటకు కొంత అశ్లీల ఆపాదన వుంది. అయినా గోపాలరెడ్డి అలాగే రాశారు.
ఇంతకూ మీరు తరచు రాసే ఆమె ఎవరు అని అడిగితే, నవ్వి, దాటేసేవారు.
గోపాలరెడ్డితో చివరి దశలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాను. ఆయన రాసిన ఉత్తరాలు కొన్ని స్టేట్ ఆర్కీవ్ తారనాక, హైదరాబాద్ వారికి అప్పగించాను.
రాజాజి మంత్రివర్గంలో (1937)
రాజకీయ జీవితం ఆరంభించి ఆంధ్ర ముఖ్య మంత్రిగా, తరువాత ఉప ముఖ్య మంత్రిగా సంజీవ రెడ్ది కింద చేయడానికి వెనుకాడక పోవడం విలక్షనమే.గవర్నర్ గా వివాదాలు లేకుండా గడిపారు .
నెల్లూరు యాస తో చక్కగా ఉపన్య సించే వారు.


రచనలు :
ఆమె జాడలు, ఆమె నీడలు, ఆమె తళుకులు, ఆమె బెళుకులు, స్ఫులింగాలు, దీపికలు, కళికలు, కలవాలనీ, సౌరభనీరజాలు, మలయమారుతాలు, ప్రసూనమంజరి, కలవాలనీ, సాహిత్య సుందరి, ఠాగూర్ రచనల తెలుగు అనువాదాలు, గాలిబ్ రచనల తెలుగు అనువాదాలు, ఇక్బాల్ కవితల అనువాదాలు మొదలగున్నవి.