Monday, December 31, 2007

Ethical values -Scientific Method-END


. నైతికవిలువల విశ్వజనీనత


ప్రతి సమాజం కూడా కొన్ని ప్రమాణాలను అనుసరించి విలువలను పాటిస్తుంది. సాంస్కృతికంగా అభివృద్ధి చెందిన సమాజాలలో వీటినే నైతిక విలువలు అంటారు. దాతృత్వం, తోటివారి పట్ల దయ, నిజాయితీ, వినయం, ఇత్యాది నైతిక విలువలు పేర్కొన్నదగినవి. అనేకమతాలు కూడా మానవుడి పట్ల గౌరవాన్ని ప్రబోధించాయి. మత విశ్వాసం గలవారు తమ తమ వ్యక్తుల పట్ల ఇటువంటి గౌరవాన్ని చూపాలని పేర్కొన్నాయి. మానవ గౌరవాన్ని ఈ విలువలు అంతగా పట్టించుకోలేదు. కాలం గడిచేకొద్దీ ఈ మతాల పిడివాదం, కర్మకాండ లలోని పటుత్వం సడలిపోయింది. మానవజాతి ఐక్యత అనే ప్రబోధం ఒక్కటే నైతిక విషయంగా మిగిలింది. నైతిక పరమైన అన్వేషణ పద్ధతులు లేనప్పుడు ఈ విధానాన్ని వివరించటం ఎలా?. ప్రపంచవ్యాప్తంగా అన్వేషణాపద్ధతులు ఆమోద యోగ్యంగా ఉండేటట్లు ఆవిర్భవించటానికి పూర్వం, విశ్వవ్యాప్తమైన విలువలకు మూలాధారంగా దేన్ని చూపాలి?.
ఈ ప్రశ్నలకు సమాధానాన్ని అన్వేషించేటప్పుడు నైతిక విలువలు పనిచేసే తీరు, అవి ఏమేరకు సరి అయినవి, అనే వాటికి కూడా సమాధానం లభిస్తుంది. ప్రస్తుతం విలువ, విశ్వజనీనత, సరైనది, అనే మాటలు నైతిక విలువలకు అన్వయించి చూద్దాం.
నైతిక పదాలకు అర్థం
సమాజంలో వ్యక్తి ఒక వస్తువును పొందడం లేదా, ఒక కార్యకలాపం జరగడం వాంఛనీయమనుకుంటే, విలువ అనే పదానికి అర్థం లభిస్తుంది. మానవుడు ఆశ్రమవాసిగా ఏకాకిగా కాక, సమాజంలో ఒక విశిష్టవ్యక్తిగా వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొనే ధోరణి ప్రధానం. వ్యక్తిత్వంలోని ప్రతిభకూ, వాంఛలకూ సంబంధం ఉంది. విలువ అనేది కేవలం వ్యక్తిపరం కాదు. వ్యక్తిని తీర్చి దిద్దే సమాజానికీ, వ్యక్తి వల్ల ప్రభావితమయ్యే సమాజానికీ ఇది వర్తిస్తుంది. కాబట్టి విలువ అనేది కేవలం మేధస్సుకు, రామణీయకతకు సంబంధించింది కాక, వ్యక్తుల మధ్య సంబంధంగా తలెత్తుతుంది. అంటే ఇతర వ్యక్తులతో నిమిత్తం లేకుండా ఏకాకిగా మేధస్సు, లేదా రామణీయకత విలువలను సాధించవచ్చని అర్థం కాదు. తోటి వ్యక్తితో సంబంధం ఉన్నప్పుడే నైతిక విలువలను సాధించటం సంభవం. దీని వల్ల ఇతర విలువలకూ, నైతిక విలువలకూ తేడాలు గమనించవచ్చు. జ్ఞానం అనేది మేధా సంబంధమైన విలువ. సత్యం, స్వేచ్ఛ అనేవి నైతిక విలువలు, సంగీతం రామణీయకతకు చెందిన విలువ. కాని ఒక రాగాన్ని కూర్చడానికి స్వేచ్ఛ, ఇష్టం వచ్చిన సంగీతాన్ని వినే అవకాశం ఉండటం నైతిక విలువలు. అడవి మృగం ఎదురైనప్పుడు చూపే సాహసం మనుగడకు సంబంధించిన విలువ. అదే యుద్ధరంగంలో అయితే నైతిక విలువ అవుతుంది.
నైతిక విలువల విశ్వజనీనత-బాహ్యసత్యం
నైతిక విలువలకు ఉన్న సామాజిక దృక్పథాన్ని బట్టి, కొంత మేరకు వాటికి బాహ్య సత్య దృష్టి ఏర్పడుతుంది. సృజనాత్మక వ్యక్తిపరమైంది. అప్పుడు బాహ్య సత్యం అనేది అరుదుగా సాధ్యపడుతుంది. నైతికవిలువలు విశ్వవ్యాప్తంగా ఉండా లంటే, బాహ్యసత్యం అనేది అవసరం. ఒక నిర్ణయం గనక వ్యక్తిగతమైందైతే, దానికి లభించే విలువ కూడా నిర్ణయంలోని స్వభావాన్ని బట్టి గాక, యాదృచ్ఛికమైందే అవుతుంది. వ్యక్తిపరమైన అసూయలకు మించిన నిర్ణయమే బాహ్యసత్యంతో కూడింది.
నైతికవిలువలు విశ్వజనీనమైనవి అనగానే, అన్ని కాలాల్లోనూ అన్ని సమాజాలలోనూ ప్రతివారూ వీటిని ఆమోదించారనుకోరాదు. కొన్ని విలువలు విశ్వజనీనమైనవి అంటే, రెండు ప్రతిపాదనలను గట్టిగా చెబుతున్నామన్నమాట. నైతికంగా చైతన్యవంతులైనవారిలో అత్యధిక సంఖ్యాకులు ఆ విలువలను గమనిస్తారు. ఒక వ్యక్తి ఈ విలువల గురించి తీవ్రంగా ఆలోచిస్తే, అవి సరైనవని భావిస్తాడు. తన వ్యక్తిగత ఆసక్తులు, పరిస్థితులు పరిగణనలోకి తీసుకోడు. ఇప్పుడు ఎవరైనా అలా చేయలేక పోతున్నారంటే అన్ని కోణాల నుంచి సమస్యను పరిశీలించలేదని భావించాలి. ఉపనిషత్తు పేర్కొనే అంధకారం నుంచి వెలుగులోకి తీసుకుపో, అనే సూత్రమూ, సోక్రటీస్ సూత్రీకరించిన జ్ఞానమే ధర్మం అనడమూ, ఒకే అర్థాన్ని సూచిస్తాయి.
నైతిక విలువల విశ్వజనీనత గురించి ఇంతవరకూ చేసిన చర్చ అంతా, చుట్టూ తిరుగుతూ ప్రారంభించిన చోటుకే వచ్చినట్లు అనిపించవచ్చు. విశ్వజనీనత అనేది వాస్తవంకానప్పుడు, అన్వేషణా పద్ధతినుంచి వచ్చినప్పుడు, సమస్యను ఇంకొక రంగానికి మళ్ళించినట్లయింది. అటువంటి పద్ధతి ఉంటుందా?. ఉంటే తెలుసుకోవటం ఎలా?. తెలుసుకుంటే అది విశ్వవ్యాప్తంగా ఆమోదయోగ్య మైన పద్దతి అనిహామీ ఏమిటి? మొదలైన ప్రశ్నలు జనిస్తాయి.
ఒక్కక్షణం ఆలోచిస్తే ఈ ప్రశ్నలు నీతిశాస్త్రానికి ప్రత్యేకించినవి కావని స్పష్టపడుతుంది. దేన్ని అన్వేషించినా, ప్రకృతి విజ్ఞానంతో సహా అన్ని రంగాలలోనూ ఏదో ఒక దశలో ఈ ప్రశ్నలు జనిస్తాయి. విజ్ఞానవేత్తలు ఆచరించే వైజ్ఞానిక పద్దతి ప్రపంచవ్యాప్తంగా సరైందని ఎవరుగట్టిగా చెపుతారు. విజ్ఞానాన్ని అధ్యయనం చేసే విద్యార్థులతో సహా బహు కొద్దిమందికే బాగా అవగాహన ఉంటుంది. కాబట్టి పై ప్రతిపాదనను ఆమోదించటం, నిరాకరించటం అనేది కష్టం. అయినా ప్రపంచ వ్యాప్తంగా సరైందని ఎందుకంటున్నామంటే, వివేచనాత్మాకంగా సంతృప్తినివ్వడం, ప్రాపంచిక అనుభవంరీత్యా ఫలితాలనివ్వడం గమనిస్తున్నాం గనకనే మూడు వందల సంవత్సరాల నుంచీ క్రమంగా పరిణమిస్తూ, మూలంలో నిమిత్తంలేకుండా, నిర్మాణ క్రమాన్ని విజ్ఞానంచూపుతోంది. వైజ్ఞానిక అన్వేషణా లక్ష్యాన్ని అంగీకరించిన వారు, వైజ్ఞానిక పద్ధతిని కూడా ఆమోదించవలసి ఉంటుంది. ఆ పద్ధతి ఒక్కటీ లక్ష్యానికి చేర్చగలదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇది సరైంది అంటున్నాం. వైజ్ఞానిక పద్ధతిలో విశ్వజనీనత అనటంలో ఎటువంటి సూచనకూడా చేయడం లేదు. ప్రతివారూ ఒకేరీతిలో అనుసరించాలని అనడం లేదు. విజ్ఞానవేత్తలు సైతం అన్ని సందర్భాల్లోనూ ఒకే మార్గాన పోరు, క్వాంటమ్ సిద్ధాంతం పట్ల ఐన్ స్ట్టీన్ ధోరణి ఇందుకు ఉదాహరణంగా చూపవచ్చు. పదార్థ అస్థిరత్వం ఉందని కనుక్కొన్నప్పటికీ, ఐన్ స్టీన్ ఒక పట్టాన ఇందుకు అంగీకరిం చలేక పోయాడు. క్వాంటమ్ సిద్ధాంతంలో ఉన్న దోషాన్ని ఏనాటికైనా తొలగించ వచ్చునని ఆశించాడు. దేవుడు చదరంగం ఆడతాడని అతడు నమ్మజాలక పోయాడు.
నైతిక అన్వేషణా లక్ష్యం
పైన పరిశీలించిన వాటిని నీతి శాస్త్రానికి అన్వయించి చూద్దాం.
నైతిక అన్వేషణ లక్ష్యం ఏమిటి?. ఈ అన్వేషణలో అనుసరించే పద్ధతి ఏమిటి?. నైతిక విలువలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయని దేన్నిబట్టి చెప్పగలం?.
ఇంతవరకూ జరిగిన చర్చనుబట్టి, నైతిక అన్వేషణాలక్ష్యం అంతాకూడా కొన్ని ప్రమాణాలను కనుక్కోవటమేనని చెప్పవచ్చు. వ్యక్తుల మధ్య సంబంధా లను ఇవి సూచిస్తాయి. వ్యక్తి జీవిత వికాసానికి సాధ్యమైనంత మేరకు ఇవి ఉపకరిస్తాయి. కాబట్టి ఇతరుల ఆసక్తి చూపని వాటితో నీతిశాస్త్రానికి నిమిత్తంలేదు. ఒక వ్యక్తి మాంసాహారా?. శాఖాహారా?. మద్యపానం సేవిస్తాడా? లేదా అనే విషయాలు వ్యక్తి ఆరోగ్యం పైనా, అతడి ఆర్థిక వ్యవహారాలపైనా ఆధారపడి ఉంటుంది. కాని వాటిని బట్టి నైతిక నిర్ణయం చేయడం కుదిరే పనికాదు. వ్యక్తి ఏమి చేసినా సమాజం పట్టించుకోవచ్చు. సమాజం ఎంత పెత్తందారీతనంతో ఉంటే అంతగా వ్యక్తిని పట్టించుకుంటుంది. ఏం చదువుతున్నాడు, ఎవరితో స్నేహం చెస్తున్నాడు, పిలక పెంచుతున్నాడా లేదా, జంద్యం వేసుకున్నాడా లేదా, ఎటువంటి దుస్తులు ధరించాడు, ఏమి ఆహారం తీసుకున్నాడు. ఎవరిని వివాహమాడాడు అనేవన్నీ మన సమాజానికి సమస్యలుగా తయారయ్యాయి. వ్యక్తికి అట్టే స్వేచ్ఛలేదు. వ్యక్తి స్వేచ్ఛను అదుపు పేట్టే విషయంలో జాగ్రత్త వహించాలని ఈ విషయాలన్నీ సూచిస్తున్నాయి. ఇక్కడ స్వేచ్ఛను ఎలా వినియోగించుకోవాలనేదిగాక, ఎలా అణచాలనేది ప్రధానమైందిగా ఉంది.
నైతిక అన్వేషణ లక్ష్యాన్ని బట్టి, సంతృప్తికరమైన సాంఘికవ్యవస్థకు కొన్ని ప్రధాన లక్ష్యాలున్నాయి. మానవులలో కనిపిస్తున్న ప్రతిభ ఎన్నో విధాలుగా ఉంది. కాని వ్యక్తివికాసానికి సర్వసాధారణ పరిస్థితులుకొన్ని అవసరం, ఆహారం, వస్త్రాలు, గృహం, మంచి ఆరోగ్యం, అవసరాల కొరతలేని స్వేచ్ఛ, ఇతరులు ఒత్తిడి పెట్టకపోవడం, ప్రభుత్వం జలవంతం చేయకబోవడం, అనేవి కనీస అవసరాలుగా ఉండాలి. ఇతర జంతువులకూ, మానవుడికీ ప్రధాన తేడా ఉంది. మానవుడికి ఆలోచించే శక్తి ఉంది. ఆలోచనలనూ, ఆవేదనలనూ భావం ద్వారా, కళల ద్వారా వెల్లడించగలడు. కాబట్టి మానవుడుగా జీవనాన్ని సాగించటానికి స్వేచ్ఛాయుత ఆలోచన యథేచ్ఛగా వ్యక్తం చేయడం, సంఘాలుగా ఏర్పడటం, ప్రతిభలకు వన్నె తెచ్చే చదువు అవసరమవుతాయి. ప్రతి మానవుడికీ మనుగడ అనేది ముఖ్య మైనప్పటికీ, కేవలం జంతువులలాగ ఉండలేడని అనుభవం చెబుతున్నది. సంతృప్తికరమైన బతుకుతెరువు మానవుడికి అవసరం. ఎంత దయామయ మైన నియంతృత్వం కూడా ఆ వ్యవస్థను నిలుపుకోడానికి క్రూరనియంతృత్వంగా దిగజారిపోతుంది. శారీరక, సాంస్కృతిక విషయాలు మానవుడిలో విడదీయ రానివిగా కలిసిపోయాయి. ఆహారం లేకపోతే మనిషి బతుకును సాగించలేడు. ఇంకా ముఖ్యమైన విషయమేమంటే తనను తాను గుర్తించనిదే మానవుడు ఆహారాన్ని సంపాదించుకోలేడు. అందుకే స్వేచ్ఛకై పోరాడతాడు. కమ్యూనిస్టు విప్లవం దెబ్బతినిపోయింది. రష్యా, పోలండ్, హంగరీలలో ప్రజల తిరుగుబాట్లకూ, తూర్పు జర్మనీనుంచి పారిపోవాలనీ, చైనా నుంచి తప్పించుకు పోవాలనీ భావించడానికి మానవుడిలో ఉన్న స్వేచ్ఛ అనే లక్షణమే కారణం.
సాంఘికభద్రత, మానసిక స్వేచ్ఛ అనేవి వ్యక్తి వికాసానికి తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ పరిస్థితులు బాగా సాధించుకోడానికి తోడ్పడే సాంఘిక వ్యవస్థల్ని, మానవలక్షణాలను కనుక్కోవడమనేది నైతిక అన్వేషణలో ఉంటుంది. ఈ అన్వేషణ రెండు విధాలుగా సాగుతుంది. మానవులు బతికుండగానే నైతిక విలువలను సాధించుకోవాలి. కనక చారిత్రక, సాంస్కృతిక పరిస్థితుల దృష్ట్యా నైతిక అన్వేషణ జరగటం అనేది తప్పనిసరి అన్నమాట. ఈ విధంగా చూస్తే నైతిక అన్వేషణలోకానికి చెందింది కూడా. మానవుడు తన సహకారాకృషితో పరిసరా లను సరిదిద్దగలడు. ప్రభావితం చేయగలడు. ఈ విధంగా చూస్తే వర్తమాన పరిధికే నీతి పరిమితం కానక్కరలేదు. భవిష్యత్తులోకి తొంగి చూసి, ఆశలనూ, ఆశయాలనూ రూపొందించుకొని మానవుడు నేటి కలలను రేపు నిజం చేసుకో గలడు. ఇందుకు తగిన తెలివితేటలూ, పట్టుదల మానవుడికి ఉన్నాయి. నీతి శాస్త్రం ముందు చూపుగల ప్రమాణశాస్త్రం. వ్యక్తి ఏమి చేయాలి. చేయకూడదు అనేవాటిని సాధారణమయిన నియమాలతో నైతిక శాస్త్రం పేర్కొంటుంది. మానవ ప్రవర్తనకు ఉపకరించే సంస్థలను ఏర్పరచుకోడానికి నైతిక శాస్త్రం తోడ్పడుతుంది.
నైతిక అన్వేషణా క్రమం
వైజ్ఞానిక అన్వేషణ వంటిదే నైతిక అన్వేషణ కూడా, రెండింటిలోనూ ఒకానొక లక్ష్యంతో ప్రారంభిస్తాం. తొలుత దీనిని స్థూలంగానే గమనిస్తాం. అన్వేషణ సాగుతున్న కొద్దీ వివరాలలోకి పోతాం. రెండు రంగాలలోనూ, ప్రపంచపరంగా అన్వేషణ సాగుతుంది. వాస్తవాలతో కూడిన అనుభవం అనేది ఆధారంగా ఉంటుంది. కార్యకారణ సంబంధంతో అవగాహనకు ప్రయత్నిస్తాం. వైజ్ఞానిక అన్వేషణలో కార్యకారణ సంబంధం స్పష్టమే. నైతికరంగంలో మానవవ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను కనుక్కోవడానికి ప్రయత్నిస్తాం. ఈ రెండు అన్వేషణలూ ప్రాపంచిక అనుభవంతోనూ, విశ్లేషణతోనూ ఉన్నాయి. ప్రతిపాదన చేసి రాబట్టే పద్ధతినే రెండూ అనుసరిస్తాయి.
నైతిక విలువల్లో బాహ్యసత్యం, విశ్వజనీనత అనేవి పైన చెప్పిన పద్దతిని అనుసరించి కనుక్కొన్నవే. కనక వీటికి ఉన్న పరిమితులు కూడా గుర్తించాలి. తాత్కాలికమూ, ఆస్తిరత్వమూ అనేవి నీతిరంగంలోనూ ఉన్నాయి. కాబట్టి నైతిక విలువలు సాపేక్షకాలు, సాంఘిక, సాంస్కృతిక పరిస్థితులననుసరించి ఈ విలువలకు హద్దులేర్పడతాయి. అన్వేషణలో వినియోగించే జ్ఞానం విధానం కూడా ఇందులో జతచేర్చి చూసుకోవాలి. ఆధునిక రవాణా సౌకర్యంవల్ల ప్రపంచ సంస్కృతి ఆవిర్భవించటం సాధ్యమే. అటువంటప్పుడు పరిసరాల పరిమితులు తమ ప్రాధాన్యాన్ని కోల్పోతాయి. విజ్ఞానంలాగే నైతికసిద్ధాంతం కూడా విశ్వజనీనం అవుతోంది. స్థానిక సంప్రదాయం, సాంఘిక వ్యవస్థల్లో తేడా ఉన్నప్పటికీ విశ్వజనీ నత సాధ్యపడుతోంది. వ్యక్తి స్వేచ్ఛ, రాజకీయ, ఆర్థిక సమానత్వం, సాంఘిక న్యాయం అనే విలువలు ప్రజాస్వామిక పాశ్చాత్య ప్రపంచంలోని మానవులనే గాక, నియంతృత్వంలో ఉన్నవారిలో కూడా స్పందన కలిగిస్తున్నాయి. ఏ నైతిక సిద్ధాంతంలోనయినా కొంత మేరకు చారిత్రక, సాంఘిక సాపేక్షతా విధానం తప్పనిసరి అయినప్పటికీ మౌలికమయిన విలువలు విశ్వవ్యాప్తంగా ఉంటున్నాయి.
నైతిక విలువలు తప్పనిసరి
భిన్న సాంఘిక, సాంస్కృతిక పరిస్థితులలో నివసిస్తున్న మానవులు అనేక మంది, విశ్వజనీనమైన విలువలను ఆమోదించడంతో సరిపోదు. ఈ విలువలలో నైతికమైన బాధ్యతకూడా ఉంది. మానవులందరూ వీటిని ప్రమాణంగా అంగీకరిస్తారు. విశ్వజనీనమైన నైతికవిలువల విషయమై కొంత వివరణ అవసరం.
ఇక్కడ కూడా విజ్ఞానాన్వేషణతో పోల్చి చూడవచ్చు. సత్యంలో కూడా విధిగా పాటించవలసిన గుణం ఉంది. మానవుల ఆసక్తులు, సహజమైన ధోరణులు భిన్నంగా ఉన్నప్పటికీ ఇది తప్పదు. సత్యంలో నచ్చజెప్పే శక్తి ఉన్నదంటే అందరికీ వెల్లడించి చూపే గుణం ఇందుకు ప్రధానంకాదు. ఎందుకు, ఎలా సంభవిస్తుంది అనే విషయమై మానవుడు చూపే ఆతృతలో దీని అంతటికీ మూలం ఉంది. తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్నట్లే ఉత్తమ జీవితమంటే ఏమిటో కనుక్కొనే వరకూ మానవుడు విశ్రాంతి చెందడు. సోక్రటీస్, క్రీస్తు, చార్యాకుడు, గౌతమ బుద్దుడు వంటివారిని చూస్తుంటే ఇది తెలుస్తుంది. జిజ్ఞాస, అందాన్ని ఆరాధించటంలాగా, నైతిక పిపాసకుడా మానవుడిలో అంతర్గతంగా ఉంది. బహుశా ఇందుకు మూలం జీవరాశిలో చూడవచ్చునేమో. వైజ్ఞానిక, రామణీయ కతలాగే నైతికతృష్ణ కూడా మానవజీవితంలో ప్రధానదృక్పథంగా ఉండవచ్చు. ఇదేగనక వాస్తవమైతే నైతిక విలువల్ని పాటించడం జీవితానికి, సామూహిక ధోరణికి బలాన్ని సమకూర్చడమే అవుతుంది.
నైతిక విలువల విశ్వజనీనతను, మానవుడి నైతిక తృష్టలోని అంతర్భాగంగా గ్రహిస్తే వాటికి బలం చేకూరుతుంది. వైజ్ఞానిక పద్ధతిలో చేసే అన్వేషణ వల్ల చాలా విలువలు రాబట్టేవని తేలింది. వాటి తార్కిక వాస్తవికత కూడా మౌలికమైన వాటితో సమానమైనదే ప్రాథమిక విలువలు సహితం ప్రాపంచిక అనుభవరీత్యానే సరైనవి. సమానత్వం, సాంఘిక న్యాయం, పౌరహక్కులనేవి కొన్ని మౌలిక విలువల వల్ల తార్కికంగా వచ్చాయనవచ్చు. విజ్ఞాన సిద్ధాంతంలో ప్రాధమిక పదాలూ, ప్రతిపాదనలలాగే, నైతిక సిద్ధాంతంలో ఈ విలువలను ప్రారంభదశగా స్వీకరించాలి.
మానవ వ్యక్తిత్వానికీ, పవిత్రతను సమకూర్చటం ఒక్కటేచాలా, లేదా మరికొన్ని విలువలు చేర్చాలా అనేది వివరాలకు సంబంధించిన విషయం. ఇతర సిద్ధాంతాలలాగే నైతిక సిద్ధాంతంలో కూడా అంగీకరించటమనేది తార్కికవాదనకు సంబంధించింది కాదు. అది మనందరి అనుభవ ఫలితమే. మానవ సంపద వల్ల రూపురేఖలు దిద్దుకున్న ధోరణి ఇందులో ఉంది. ప్రారంచిక అనుభవానికీ, మానవ ఆలోచనకూ వారధిగా తర్కం ఉండజాలదు. మానవుడి భావాలను విశ్లేషించి, వాటిలో ఇమిడి ఉన్న అర్థాన్ని మనకు స్పష్టం చేయటమే తర్కంచేయగల పని. మౌలిక విలువల్ని గురించి అంగీకారానికి వస్తే, వాటి నుంచి మిగతా విలువలు రాబట్టి అంచలవారీగా ఏర్పాటు చేసి దేనికి ఎంత విలువ ఇవ్వాలో తర్కం చూపు తుంది. మౌలిక విలువలు సరైనవి అవునా, కాదా అనేదానికి తార్కికమైన రుజువు ఉండదు. తర్కంలో ఇమిడి ఉన్న ఈ పరిమితిలోని మానవుడిని, ఉద్రేకాల ఆవశ్యకతను గమనించకపోవటంతో నిర్ధారణ కావాలని అన్వేషిస్తుంటాం. తత్వవేత్తలు తరతరాలుగా అలౌకకవాదంతో కూడిన నీతిశాస్త్రాలను, అధిభౌతిక సిద్ధాంతాలను నిర్మించారు. అటువంటి ప్రయత్నాలన్నీ విఫలంగాక, తప్పదని, వైజ్ఞానిక పద్ధతి స్పష్టం చేసింది. మానవుడి జ్ఞానానికి గల పరిమితిని, అవకాశాన్ని ఈ పద్ధతి సూచించింది. అనేక నైతిక సిద్ధాంతాలు ఉండవచ్చుననీ, అసలు ఎటువంటి నైతిక ధోరణీ లేకుండా కొందరు మానవులు ఉండగలరనీ తార్కికంగా చూపవచ్చు. కాని అనుభవరీత్యా మానవులలో కొన్ని సర్వసాధారణ మైన జిజ్ఞాసలు ఉన్నాయని స్పష్టపడింది. ఈ జిజ్ఞాసలు విశ్వజనీనమైన భావాలలో, విలువలలో వ్యక్తమవుతున్నాయి. ఇది, తప్పనిసరిగా పాటించే అవసరమున్నట్లు కొన్ని సమాజాలలో వ్యక్తులతో స్వభావం తెలుపుతోంది. చారిత్రకంగా వీటికి గల సాపేక్షతాగుణం, కాలానుగుణంగా పరిణమించిన తీరునుబట్టి ఈ విలువలకు గత విశ్వజనీనత పోదు. వీటిల్లోని పరిణామ స్వభావం మానవ వివేచనా శక్తికి నిదర్శనం. చైతన్య స్థాయిలో పరిణామం అనేది సాంస్కృతిక అభివృద్ధిగా, పరిసరాలలో ఇమిడిపోయేదిగా ఉంటుంది. అంతేగాని ఉదాసీనంగా లొంగిపోవటం జరగదు. మానవుడు తన అనుభవాన్ని ఆధారంగా నేర్పడం ఆలోచిస్తూ ఉండటం వల్ల ఇటువంటి పరిణామానికి అవకాశముంది. మానవుడు వివేచనాత్ముడు కాబట్టి నైతికంగా ఉండగలడు. అంతేగాని అతనిలో మూక స్వభావం ఉన్నందువల్ల ఇలా ప్రవర్తించటం లేదు. తెలిసి ఎంపిక చేసుకునే పద్ధతి వల్ల మానవుడిలో నీతికి విశిష్టత !

Sunday, December 30, 2007

Scope of Morals in Science


. వైజ్ఞానిక పద్ధతి - నీతి శాస్త్రం


నీతిశాస్త్ర సమస్య


ఉద్రేకానికి సంబంధించి వైజ్ఞానిక పద్ధతి ఏమి చెబుతున్నదో, అదే నీతి శాస్త్రానికి కూడా వర్తిస్తుంది. నైతిక విలువలు మానవుడిలోని అంతర్గత అపేక్షలకు రూపాలు మాత్రమే. ఈ విషయం స్పష్టం కావాలంటే నీతిశాస్త్ర సమస్య ఏమిటో అవగాహన చేసుకోవాలి.
శతాబ్దాల తరబడి నైతిక సిద్ధాంతం, విలువలకు అర్థాన్నీ, ఔచిత్యాన్నీ ఇచ్చింది. సత్యం, అందం, మంచితనం, అనే విలువలను ఆమోదించాలన్నా, నిరాకరించాలన్నా ముందుగా రెండు ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానాలు చెప్పాలి. ఈ మాటలకు అర్థం ఏమిటి? ఒకానొక సన్నివేశంలో ఈ పదాలకు ఎలాంటి అవగాహన ఉంటుంది? ఒక యువతి తాను కోరుకున్న యువకుడిని పెళ్ళి చేసుకోడానికి ఆమె తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటప్పుడు మంచితనం చూపటమంటే ఏమిటి? తన సహచరుడుని ఎన్నుకొనే హక్కును సమర్థించుకోవడమా? లేదా తన తల్లిదండ్రుల పక్షాన నిలబడి మంచి బిడ్డ అనిపించుకోవడమా? విప్లవాన్ని దృష్టిలో పెట్టుకొని అబద్ధాలాడమని నాయకుడు ప్రభోదిస్తే, చిత్తశుద్ధి గల రాజకీయ కార్యకర్త ఏం చేయాలి? ఇలాంటి సన్నివేశాలలో సత్యం మంచితనం అనే విలువల వల్ల లాభం లేదు. ఆ మాటలు ఆచరణలో పెట్టడాన్ని బట్టి, ప్రాపంచిక అనుభవం దృష్ట్యా వ్యక్తి నిర్ణయాన్ని బట్టి వాటికి అర్థం ఉంటుంది.
మాటలకు అర్థాలు మాత్రమే కాక, రెండింటిలో దేన్ని ఎంపిక చేసుకోవాలనే గాక, విలువల వాస్తవికత కూడా తెలియాలి. అప్పుడే ఎంపిక చేసుకోగలరు. ఒక సన్నివేశంలో ఏది మంచో తెలిసినప్పటికి, ఎందుకు మంచిని చూపాలీ, మంచి వల్ల నష్టం జరగబోతున్నదని తెలిసికూడా ఎందుకు నిజం చెప్పాలి. అనే ప్రశ్నలు ఎదురౌతాయి. ఇక్కడ అవకాశవాదానికి తావు లేదు. నైతిక ప్రమాణాలలో విధిగా అనుసరించవలసిన పద్ధతులు కొన్ని ఉన్నాయి. పోలీసు లేనప్పుడు కూడా అతడంటే భయపడే తీరుకూ, ఈ విలువలకూ తేడా ఉన్నది. మంచి ప్రవర్తన వల్ల ఒకానొక వ్యక్తికి ఉపయోగం లేకపోయినప్పటికీ మనం అతడి నుంచి మంచి నడవడినే కోరుకుంటాం.


అలౌకిక నీతిశాస్త్రం


పై ప్రశ్నలకు అందరూ ఆమోదించగల సమాధానాలంటూ ఇటీవల వరకూ లభించలేదు. తగినంత ప్రపంచజ్ఞానం లేకపోవడం, సంతృప్తికరమైన విచారణ పద్ధతులు లోపించటమే ఇందుకు కారణం. నైతిక సిద్ధాంతం చరిత్రను బట్టి చూస్తే, ఒక సమస్యను సరిగ్గా రూపొందించకపోతే సున్నితమైన అన్వేషణ సైతం ఎటూ సాగిపోలేక ఆగిపోయే స్థితి వస్తుంది. ఆధునిక కాలం వరకూ అనేక మంది ఆలోచనాపరులు నైతిక విలువలకు సిద్ధాంత ప్రాతిపదికగా శాశ్వతమయిన మార్గాన్ని అన్వేషించారు. అలౌకిక సత్యానికీ, నైతిక విలువలకూ ముడిబెట్టారు. ప్రపంచం అనేది ఆదర్శ ప్రపంచానికి నమూనా అని ప్లేటో చెప్పాడు. ఇటువంటి ప్రపంచ భావాలను అంతర దృష్టితో నమూనా ప్రపంచాన్ని చూడవచ్చు. ఇటువంటి సిద్ధాంతం ప్రకారం మనం నిత్య జీవితంలో చూసే ఎద్దులూ, సైకిళ్ళూ అన్నీ కూడా ఆదర్శ ప్రాయమయిన ఎద్దులూ సైకిళ్ళూ అనే భావాలను నకళ్ళేనన్న మాట. అసలు భావాలకు వివేచనాత్మక ఆలోచనతో స్పష్టంగా చూడవచ్చు. అంతేకాదు. దేన్ని మనం మంచి అంటున్నామో అది కూడా మంచి అనే భావానికి అనుకరణే. దీనిని కూడా హేతువు సహాయంతోనే కనుక్కోవాలి.



అలౌకిక నీతి శాస్త్రంలో పెత్తందారీ స్వభావం


ఇటువంటి ఆదర్శ ప్రపంచం ఉందని అంగీకరిస్తే నైతిక విలువలు విశ్వజనీనంగానూ, కేవలమయినవి గానూ, కాలానికీ, ప్రదేశానికీ సాంఘిక, సాంస్కృతిక పరిసరాలకూ సంబంధం లేకుండానూ ఉంటాయని ఒప్పుకోవాలి. ఈ విలువలను కొన్ని సూత్రాలద్వారా రూపొందించారు. ఆ సూత్రాలు వాస్తవిక ప్రపంచంతో సంబంధం లేనివి. మానవుడి స్వేచ్ఛనూ గౌరవాన్నీ గుర్తించని సూత్రాలే. అవి వ్యక్తి వికాసం, ఆనందంతో నిమిత్తం లేకుండా ఈ విలువలు ఉంటాయన్న మాట. పరోక్షంగానైనా, అనుభవానికి గురిచేయకుండా, ఈ సిద్ధాంతానికి సంబంధించిన మూల సూత్రాలున్నాయి. ఇందులో వాస్తవాలకు చోటు లేదు. ద్రష్ట మాటలే ప్రమాణాలు. ఈ పంథాకు తార్కిక ఫలితం ఏమిటంటే, మానవజీవితానికి సంబంధించిన అన్ని రంగాలలోనూ సిద్ధాంతపరమయిన నియంతృత్వం ఉంటుందన్నమాట. ప్లేటోకు ఈ విషయం తెలుసు. అయినా సరే అది అవాంఛనీయమని అతడు భావించలేదు.
అలౌకిక సూత్రాల నుంచి విలువలకు రూపెందిస్తే మారుతున్న మానవ పరిస్థితులకు సంబంధం లేకుండా ఈ విలువలు దిగజారిపోయే ప్రమాదం ఉంది. భారతదేశంలో ఇటువంటి నైతిక సిద్ధాంతం కొత్తకాదు. వివాహంతో నిమిత్తం లేకుండా ఒక స్త్రీ బిడ్డను కంటే, తల్లిగానూ, పౌరురాలుగానూ ఆమె ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ, చాలామంది భారతీయులు, అటువంటి స్త్రీని అవినీతి పరురాలుగానే ఇంకా భావిస్తున్నారు. ఒక బ్రాహ్మణుడు ఎంత పెడితుడైనప్పటికీ, తోటివారికి నిస్వార్థంగా ఎంత సేవచేసినప్పటికీ, అతడు గనక మాంసాన్ని తింటూ, మద్యపానం సేవిస్తే సనాతనుల దృష్టిలో అతడి గుణాలెందుకూ పనికి రాకుండా పోతాయి. తనను తాను బలిచేసుకోవటమే ధర్మంగానూ, సమాజంలో ఆధిపత్యం వహిస్తున్న ప్రమాణాలను పాటించటమే మంచి ప్రవర్తనగానూ భావిస్తున్నారు. సత్యం, సుందరం, మంచితనం అనేవాటికి అధిభౌతిక అర్థాలు సమకూర్చారు. మానవులందరికీ మార్గదర్శకులమంటూ కొందరు బయలుదేరి చెబుతున్నారు. నైతిక విలువలను వివేచనాత్మక విశ్లేషణకు, ప్రాపంచిక అనుభవానికి గురిచేయకుండా, పురోహితుడి బోధనలాగ మార్చి వేశారు. మానవుడి ఆశలు, కోర్కెలతో నిమిత్తం లేకుండా గుడ్డిగా బయటివారి పెత్తనానికి లోబడి, విలువలను అంగీకరించాలంటున్నారు.
నైతిక అన్వేషణ ఇలా వక్రమార్గాన పడటానికి, సమస్యను రూపొందించటం లోనే కీలకం ఉంది. వ్యక్తుల మధ్య సంబంధంగా నీతిని గ్రహించే బదులు, మానవుడి మనుగడ ప్రయోజనానికి ఇదొక పునాది అన్నట్లు భావించారు. మానవుడి జీవితానికి లక్ష్యం అనేది, జీవితంలో గాక వెలుపల ఎక్కడో ఉన్నదని, ముందే ఏర్పరచుకున్న ఒక భావన వల్ల, ప్రారంభదశలోనే వక్రమార్గం పట్టించారు. ప్లేటో దృష్ట్యా శాశ్వతమైన ప్రపంచభావానికి చేరువగా రావడమే సమాజ వ్యవస్థ అనిపించుకుంటుంది. హిందువుల ననుసరించి ఈ లోకంలో వ్యక్తి మనుగడ చాలించి మోక్షాన్ని పొందటమే లక్ష్యం. ఆ రెండు సందర్భాలలోనూ వ్యక్తికి స్వతహాగా ఏమీ విలువలేనట్లు పరిగణించారు. ఫలితంగా నీతి శాస్త్రమనేది అలౌకిక అన్వేషణగా మారింది. సమాజంలో ఉన్న వ్యక్తి సమస్యలకూ, ఆ సక్తులకూ ఏమాత్రం శ్రద్ద వహించలేదు.
నైతిక అన్వేషణకై ఉద్దేశించిన విధానమే దాని పద్ధతిని కూడా నిర్ణయించింది. లక్ష్యం అలౌకికమైంది కాబట్టి విజ్ఞానంతో ఏమాత్రం సంబంధం లేకుండా పోయింది. వాస్తవాలనూ, అనుభవాన్నీ దృష్టిలో పెట్టుకొని నైతికపరమైన అన్వేషణచేస్తే ఆమోదయోగ్యం కాకుండా పోయింది. అనుసరించవలసిన పద్ధతిలో అంగీకారం లేనందున అన్వేషణా ఫలితాలను ఆమోదిస్తారనుకోటం ఒట్టి ఆశే.

Saturday, December 29, 2007

అంతర్వాణికి అవకాశం లేదు-scientific method contd

.
వాస్తవాలకు మొగ్గు - పెత్తందారీతనం చెల్లదు

విజ్ఞానంలో వాస్తవాలకు ఆస్కారం ఉన్నదిగానీ, పెత్తనానికి అవకాశం లేదు. ఒక సిద్ధాంత వాస్తవాన్ని తేల్చడానికి వాస్తవాలే తుది నిర్ణయాలు గనక వాటికి ఈ ప్రాధాన్యం లభించింది. రెండొందల సంవత్సరాల పాటు ప్రపంచంయావత్తు న్యూటన్ పదార్థ విజ్ఞానాన్ని ఆమోదించింది. కొన్ని కీలక పరిశోధనలతో సాపేక్షతా సిద్ధాంతం సరయిందని రుజువయ్యే సరికి, పదార్థ విజ్ఞానంలో న్యూటన్ తుదిపలుకు పలికాడనే విషయాన్ని తోసిపుచ్చడానికి విజ్ఞానవేత్తలెవరూ తటపటాయించలేదు. విజ్ఞానేతర రంగంలోని వారి ధోరణి ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఇటలీలోని పీసా విశ్వవిద్యాలయం ఆచార్యులను ఆహ్వానించి తన టెలిస్కోప్ ద్వారా జుపిటర్ కు చెందిన ఉపగ్రహాలను చూడమని గలీలియో కోరగా వారంతా నిరాకరించారు. వారు విద్యావిహీనులుకారు. చిత్తశుద్ధిలేని వారుకారు. ఇటలీ సమాజంలో ఎంతో సంస్కృతీపరులూ, బాగా చదువుకున్న వారు కూడా అలాంటివారు గలీలియో ఆహ్వానాన్ని ఎందుకు నిరాకరించినట్లు. వాస్తవాలకు భయపడా, లేక గలీలియో తలతిక్కవాడని భావించారా. ఇవాళ వింతగా కనిపించవచ్చుగానీ ఆనాడు గలీలియో తలతిక్కవాడనే వారు భావించారు. జుపిటర్ కు ఉపగ్రహాలున్నాయనీ, ఆరిస్టాటిల్ ఎక్కడా రాయలేదు కదా. కనక అలాంటి ఉపగ్రహాలు ఉండటానికి వీలులేదు. టెలిస్కోప్ ద్వారా స్వయంగా చూశామని ఎవరైనా అంటే అలాంటివారు భ్రాంతిలో ఉండి ఉండాలి. అటువంటి భ్రాంతిపరులపట్ల చూపవలసింది దయమాత్రమే, మెచ్చుకోలుకాదు.
శబ్ద ప్రమాణం అనేది నాటి ఫ్రొఫెసర్ల ధోరణి నిర్ధారించటానికి తోడ్పడింది. అదే ప్రమాణంతో గెలీలియో, చావుకు వెరచి, తన అభిప్రాయాలు మార్చుకోవలసి వచ్చింది. ఇటువంటి శబ్ద ప్రమాణంతోనే బ్రూనోను ఉరికంబం ఎక్కించారు. మనదేశంలో సీత సహగమనానికీ, అమానుషమైన అంటరాని తనానికీ, ఇంకా అనేక నమ్మకాలూ, ఆచారాలు జీవితంలో పెనవేసుకుపోవడానికీ, శ్రుతి, స్మృతి అనే ప్రమాణాలే కారణం.
భారత కమ్యూనిస్టులూ, వారి సహచరులూ అనుసరించే ధోరణిని బట్టి శబ్ద ప్రమాణాన్ని వారెలా పూజిస్తారో సాదాహరణగా చూపవచ్చు. భారతదేశంపై చైనా దురాక్రమణను చాలా సంవత్సరాల పాటు వాళ్ళు గ్రహించలేక పోయారు. ఐక్యరాజ్య సమితిలో దురాక్రమణ అంటే ఏమిటో నిర్వచించలేదన్నారు. ఒకవేళ నిర్వచించగలిగినా, కమ్యూనిస్టుదేశం దురాక్రమణ వంటి దోషానికి గురి కాదని, కమ్యూనిజం మానవ సోదరత్వాన్ని ప్రబోధిస్తున్నదని అన్నారు. లామాల ప్యూడల్ పరిపాలన నుంచి విమోచనగావించే నెపంతో నిస్సహాయంగా ఉన్న టిబెట్ ను కమ్యూనిస్టు చైనా కబళించి వేసింది. 12వేల చదరపు మైళ్ళ భారతభూభాగాన్ని చైనా వశం చేసుకుంది. ఇదంతా వారి దృష్టిలో ప్రధానం కాదు. చైనా ప్రభుత్వం బాండుంగ్ ప్రకటనలో భాగస్వామి అనీ, పంచశీల సూత్రాలకు కట్టుబడి ఉన్నదనీ వాదించారు. గలీలియో టెలిస్కోప్ నుంచి జుపిటర్ ఉపగ్రహాలు చూడటానికి నిరాకరించిన ప్రొఫెసర్లు అరిస్టాటిల్ ఆ విషయం చెప్పలేదంటూ, శబ్ద ప్రమాణాన్ని అడ్డం పెట్టుకున్నారు. కమ్యూనిస్టు నిరంకుశత్వాన్ని, దురాక్రమణను సాధ్యమని మార్క్స్ చెప్పలేదు. గనక కమ్యూనిస్టులు వాస్తవాన్ని చూడలేక పోయారు.
సిద్ధాంతాల నిర్ణయానికి వాస్తవాలే తుది ప్రమాణమైనప్పుడు వైజ్ఞానిక ధోరణిని అనుసరించి సాంఘిక విధానాన్ని, అందులో నివసించే వారి అనుభవాన్ని బట్టే నిర్ణయించాలి. తన పక్షాన శాసనం చేయటానికీ, విధానాలు నిర్ణయించటానికీ, ప్రాతినిథ్యం వహించటానికీ ఎవరు ఉండాలనేది నిర్ణయించే హక్కు పౌరులదే మిగిలిన సాంఘిక వ్యవస్థలతో పోల్చిచూసినప్పుడు ప్రజాస్వామ్యానికి తనను తాను సరిదిద్దుకునే స్వభావం ఉంది. ఇది వైజ్ఞానిక దృక్పథం నుంచి వచ్చిందే.
అంతర్వాణికి అవకాశం లేదు

వైజ్ఞానిక పద్ధతిలో వాస్తవాలపై ఆధారపడే విధానంవల్ల జ్ఞానం అందరికీ చెందడం, ప్రపంచానుభవంతో కూడింది గావడం విశేషంగా పేర్కొనాలి. అన్వేషణలో అలౌకికత్వానికి చోటులేదు. నమ్మకానికి బదులు జ్ఞానం అనేది ఆధారంతో కూడిన వాస్తవాలపై నిలబడుతుంది. అనుభవంతో పరీక్షించటానికి వీలులేని వాటిని సత్యాలుగా అలౌకిక వాదం పేర్కొంటుంది. ఈ కారణాల వల్లనే, వైజ్ఞానిక పద్ధతికి మార్మిక వాదం కూడా పొసగదనే చెప్పాలి. మార్మికుని అనుభవం వైజ్ఞానిక పరిశోధనకు, ఆసక్తికీ వస్తువు కావచ్చు. మానవుడి మనస్సు కొన్ని పరిస్థితులలో ఎలా పనిచేస్తుందో తెలుసుకోటానికి ఈ అన్వేషణ ఉపయోగపడు తుంది. మార్మికుడు తన అనుభవానికి భాష్యం చెపుతూ దైవంతో లీనమైనట్లు పేర్కొంటాడు. అందులో వైజ్ఞానికంగా నిలబడేదేమీ లేదు. సరైన జ్ఞానం లభించక ముందు, లోగడకూడా మూర్ఛలకూ అంటువ్యాధులకూ గ్రహణాలకూ తోకచుక్కలకూ వక్రభాష్యాలు చెప్పారు. సూర్యగ్రహణానికి సనాతనులు చెప్పే వ్యాఖ్యానంలో ఎంత నిజం ఉన్నదో, మార్మికుడు తాను అనుభూతి పొందాననే సత్యంలోనూ అంతే నిజం ఉన్నది.

మార్మికవాదం, అలౌకికవాదం జ్ఞానానికి సంబంధించినంతవరకూ నిస్సారమైనవి అలాగే మహాత్ముని అంతర్వాణిని కూడా ఇతరులకు ఎలాంటి మార్గాన్ని చూపలేని సారంలేని విషయంగానే భావించాలి, ఒక విషయాన్ని గురించి వివేచనాత్మకంగా ఆలోచిస్తున్నప్పుడు అందులో తుదిఘట్టంగా ఉపచేతనావస్థలో, మెరుపు మెరసినట్లు అంతర్ దృష్టి పడవచ్చు. అయితే ఉత్తరోత్తరా దానిని వాస్తవ సంఘటనలు సమర్థించేవిగా ఉంటాయి. కాని అంతర్వాణి ప్రతిపాదనలను నిశిత పరిశీలనకు గురిచేసి పరీక్షించి వాస్తవాన్ని చూడవలసి ఉన్నది. ఒక వ్యక్తి అంతర్వాణి ఏమేరకు నమ్మదగింది అని తేల్చి చెప్పటానికి ఒక పద్ధతి ఉన్నది, అంధవిశ్వాసం, వీరారాధన లేకుండా ఇతరులకు వినిపించి అవగాహన అయ్యేటట్లు చేయాలి. అలా చేయకపోతే రెండు ప్రమాదాలున్నాయి. అంతర్వాణి ఆధారంగా తప్పు తోవలుపట్టి హిమాలయాలంత పెద్దదోషం చేయవచ్చు. ఇకాం ఘోరం ఏమంటే అంతర్వాణిని విశ్లేషించక పోవడం, అంతర్వాణి చెప్పినవి దోషాలని సంఘటనలు రుజువు చేస్తున్నా గుణపాఠం నేర్చుకోకపోవటం సంభవమే.
మానవ వ్యవహారాలలో ఉద్రేకాలు

ఉద్రేకాల పాత్ర ఏమిటో వైజ్ఞానిక పద్ధతి స్పష్టపరుస్తుంది. విశ్లేషణకు సాధనగా ఉపకరించేది వివేచనేకాని ఉద్రేకం కాదు. కనక ఒక సన్నివేశంలో సమస్యలను పరిష్కరించటానికి ఉద్రేకాలను వివేచనకు లొంగి ఉండేటట్లు చేయాలి. మానవ జీవితంలో ఉద్రేకానికి చోటు లేదని కాదు. పైగా, చూస్తూ ఊరుకోటం గాక గాఢమైన ఉద్రేకాలను కనబరచటం, అందాన్ని మెచ్చుకోడం మానవ జీవితంలో ముఖ్యమైన విషయం. మానవద్వేషితప్ప మరెవరూ మానవుడిని కేవలం లెక్కలు వేసే యంత్రంగా పరిగణించరు. ఉద్రేకాలన్నీ ఆనందానుభూతులుకావు. రామణీయకత భిన్న కోణాలలో మానవుడు చూడగలడనే విషయాన్ని నిరూపిస్తుంది. గాంధీ తన జీవితంలోని చివరి దశలో ఎదురైన ఒంటరితనాన్ని, ఓటమిని గ్రహించిన వ్యక్తిగా పరిణితి చెందిన వ్యక్తిగా భావించవచ్చు. గాంది హత్య, ఏటా వర్థంతి రోజున ఉపవాసం అనే వాటికే ప్రాధాన్యం ఇచ్చే వారు ఇంకా అపరిపక్వదశలోనే ఉన్నారన్నమాట. అవగాహన అనేది ఉద్రేకాలు పరిపక్వదశకు వచ్చినప్పుడు పనిచేసే తీరన్నమాట. జ్ఞానాభివృద్ధి వల్ల అవగాహన వస్తుంది. ఉద్రేకాన్ని వివేచనకు లోబరచాలంటున్నామంటే మానవుడి అంతరంగిక జీవితాన్ని తగ్గించడం కాదు. పైగా ఉద్రేకాల మూలాధారాన్ని వికసింపజేసి, దీని ఫలితంగా వచ్చే శక్తిమంతమైన ఉద్వేగాలకు సరిగా అవగాహన చేసుకొని, ఆచరణకు దిగటానికి తోడ్పడటమై ఇందలి ఉద్దేశం. ఉద్రేకం బలంగా ఉన్నప్పుడు పైకి వ్యక్తం కావాలనుకొంటుంది. ఇవి తరచు ఏదో ఒక లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని బయటపడటం. ఒక్కోసారి గురిలే కుండా బయటపడటం జరుగుతుంది. ఆగ్రహావేశంతో ఉన్న గుంపు బస్సుపై రాళ్ళు వేయటమనేది విధ్వంసక చర్య. దీని వల్ల సాధించే ప్రయోజనం ఏమీ లేదు. మిగిలేది గందరగోళం, దిగజారుడు విధానం మాత్రమే. ఒకవేళ ఆచరణ అనేది ఫలప్రదమైనప్పటికీ, దీనిని తెలివిగా ఒక పథకం ప్రకారం పట్టుదలతో నిర్వహించటం అవసరం. ఈ విధంగా వివేచన ఆధారంగా ఉద్రేకం ఉంటే జీవిత పోరాటంలో ఇంకా ఉత్తమంగానూ, వదిలేస్తే ఎండు గడ్డిపై నిప్పుపడినట్లే ఉంటుంది. తీవ్రమైన సంవేదన సమస్థనీయంకాదు.

Friday, December 28, 2007

good and bad aspects-SCIENTIFIC METHOD contd

విజ్ఞానం - మానవ సంబంధాలు

వైజ్ఞానిక పద్ధతిలో సర్వ సాధారణత్వం

ఆధునిక విజ్ఞానం పెంపొందడానికి వైజ్ఞానిక పద్ధతే ముఖ్యకారణం. ఆర్థిక పరిసరాలు మొదలైన ఇతరేతర కారణాలు అంతగా ప్రాముఖ్యం వహించలేదు. వైజ్ఞానిక అన్వేషణ మూడు అంచెలలో సాగుతుంది. విశ్లేషణదశ, సహజచారిత్రక దశ, సాధారణ సూత్రాల నుంచి రాబట్టే సిద్ధాంతం అనేవి పేర్కొనదగినవి. వైజ్ఞానిక సిద్ధాంతానికి తుది ప్రమాణం వాస్తవాలు మాత్రమే. సిద్ధాంతం మారవచ్చు. నిరాకరణకు గురికావచ్చు. కొత్తగా వెలుగులోకి వచ్చిన సాక్ష్యాధారాలను బట్టి సమగ్ర సిద్ధాంతంలో ఇమడవచ్చు. ఈ విధానంగా వైజ్ఞానిక సత్యమనేది తాత్కాలిక మైంది. వైజ్ఞానిక పద్ధతి తనను తాను చక్కదిద్దుకుంటూ పోయే స్వభావం ఉన్నది.

ఇందులో విజ్ఞానానికి మాత్రం పరిమితమైన విలువ అంటూ ఏమీ లేదు. ప్రకృతి పనిచేసే తీరు, మానవ సంస్థలు కృషి చేసే విధానం అర్థం చేసుకోవాలన్నప్పటికీ వాటిలోని భాగాలు తెలుసుకోటమేగాక, పరస్పర సంబంధాలు కూడా గ్రహించవలసి ఉంటుంది. అంటే సమస్యను విశ్లేషించిన, మూలాధారమేదో కనుక్కోవాలన్న మాట. అందుకు సంబంధించిన వాస్తవాలన్నీ సేకరించాలి. వాస్తవాలను వివరించే సిద్ధాంతాన్ని రూపొందించాలి. సమస్య పరిష్కార మార్గాన్ని సూచించాలి. సారాంశమేమంటే వైజ్ఞానిక పద్ధతులతోనే అన్వేషణ జరపాలన్న మాట. ప్రకృతి శాస్త్రాలకు వైజ్ఞానిక పద్ధతి తప్పనిసరి అయినట్లే మానవ సంబంధాల విషయంలోనూ ఈ పద్ధతి కావాలన్నమాట.
ఈ నిర్ణయం వల్ల చాలా పరిణామాలకు దారితీసే అవకాశముంది. వాటిల్లో కొన్నిటిని పరిశీలిద్దాం.

వైజ్ఞానిక పద్ధతిలో సహనం

సిద్ధాంతాలన్నీ వాస్తవాలవల్ల విలువను సమకూర్చు కుంటాయి. కనక సూత్రప్రాయంగా జ్ఞానం అంతా అస్థిరమైందే. అంటే కార్యాచరణకు ఆధారపడదగిన ఏ మార్గదర్శకత్వం లేదని భావించరాదు. కావలసినంత ఆధారంఉంది. తొలకరి ఏ తేదీనవస్తుందో ముందుగా నిర్ధారణగా చెప్పలేము. కొంకణ తీరంలో ఈ సంవత్సరం ఫలానా తేదీన తొలకరి ఆరంభమవుతుందని చెప్పలేము. మార్పు చెందే విషయాలు అనేకం ఉన్నందున వాతావరణం నిక్కచ్చిగా అంచనా వేయటం సాధ్యపడదు. అంత మాత్రాన వేసవి నిరవధికంగా కొనసాగుతుందని గానీ, లేదా తొలకరి జూన్లో గాక ఏప్రిల్ లోనే మెదలవుతుందని గానీ భావించరాదు. కొన్ని పరిమితులకు మనకు లభిస్తున్న జ్ఞానం ఆధారంగా వ్యవసాయ పనులకు సన్నద్ధమవుతాం. స్వల్ప మార్పులకు ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటాం. వాతావరణ సిద్ధాంతానికి సంబంధించిన అనుభవ ఆధారాలను ఇంకా విస్తృతం చేసుకోవటం ద్వారా ఆ స్థిరత్వాన్ని తగ్గించుకుంటూ పోవచ్చు. అయితే పూర్తిగా ఆస్థిరత్వం తొలగించటం సాధ్యం కాకపోవచ్చు కూడా.
ఇంకే మాత్రం అస్థిరత్వాన్ని తగ్గించలేమనుకున్న తరవాత, అందులో భిన్నాభిప్రాయాలకు, వివిధ పంథాలకు అవకాశముండవచ్చు. కాని మూల సిద్ధాంతాలనికి విరుద్ధంగా మాత్రం ఇవేవీ ఉండరాదు. వైజ్ఞానిక సిద్ధాంతం ప్రాపంచికానునభవంతో ఉండటం వల్ల అది తాత్కాలికమైనదిగా భావించాలి. న్యూటన్ పదార్థ విజ్ఞానం ఎంతో సుస్థిరతను చేకూర్చుకున్నప్పటికీ, ఆ తరవాత అదే సిద్ధాంతం మరొక సమగ్ర సిద్ధాంతంలో ఇమిడిపోయింది. ఈ సమగ్ర సిద్ధాంతం సమస్యలను భిన్న కోణాలనుంచి పరిశీలించింది.

అస్థిరత, తాత్కాలిక స్వభావం అనే రెండు లక్షణాల వల్ల విజ్ఞానంలో పిడివాదానికి, మేథస్సుతో కూడిన తలబిరుసుతనానికి చోటు లేదు. వైజ్ఞానిక పద్ధతిలో భిన్నాభిప్రాయానికి, భేదాభిప్రాయానికి సహనం ఉంటుంది. అన్వేషణ నిరంతరం సాగకపోతే విజ్ఞానం స్తంభించిపోతుంది. కనక భేదాభిప్రాయాన్ని సహనంతో చూడటం గాక అందులో సత్యం ఉండవచ్చుననే గౌరవంకూడా చూపటం విజ్ఞానానికి శ్రేయస్కరం. సహనం అంటే ఉదాసీనతగా భావించరాదు. అంగీకరించని దానితో సహజీవనం చేస్తున్నట్లుగా తలచరాదు. ఇతరుల అభిప్రాయాలు మన అభిప్రాయాల లాగే గౌరవించదగినవని గుర్తించే లక్షణంగా భావించాలి. అయితే ఇవన్నీ వైజ్ఞానిక పద్ధతికి కట్టుబడి ఉండాలి.

మానవ సంబంధాలలో వీటి ఫలితాలుస్పష్టమే. బ్రిటన్లో ప్రతిపక్షాన్ని గౌరవంగా చూడటం కేవలం నామమాత్రమే కాదు. కాగా ప్రజాస్వామిక నడవడికి కట్టుబడి ప్రతిపక్షం వ్యవహరించాలి. అభివృద్ధి, మార్పు కోరేవారు నచ్చజెప్పే పద్ధతిని అనుసరించాలేగాని, ఒత్తిడితోనూ, జిత్తులతోనూ ద్రోహచర్యకు పూనుకోరాదు.

సహకారంతో కూడిన పోటీ

సహకారంతో కూడిన పోటీధోరణిలో వైజ్ఞానిక కృషి సాగుతుంటుంది. అంతమాత్రాన శాస్త్రజ్ఞులు రుషులు అనుకోరాదు. ఇతర మానవులకున్న బలహీనతలన్నీ ఏదో ఒక మోతాదులో వీరు చూపుతారు. కాని ఇతర శాస్త్రజ్ఞులకంటే ముందుకు పోవాలని భావించినప్పుడు, తమ వైరి శాస్త్రజ్ఞులు చేసిన కృషిని సహితం మెచ్చుకోవటమేగాక, ప్రతిభను ఎక్కడ కనుగొన్నా సరే గుర్తిస్తారు. సహకారం సమైక్యత అనేవి శాస్త్రజ్ఞుని లక్షణాలు అనటానికి వైజ్ఞానిక పద్ధతే కారణం. భాష, జాతి, మతం, ఆదర్శాలు ఇత్యాది సుంకుచిత అవరోధాలు, స్వల్ప ఎత్తుగడల వల్ల విజ్ఞానార్జనకు అవరోధం ఏర్పడుతుంది.

అశాస్త్రీయ విజ్ఞానవేత్తలు

తరచు విజ్ఞానవేత్తలు తమపరిధికి సంబంధించని విషయాలలో అర్థం, పర్థం లేని మాటలు వల్లించడం గమనిస్తాం. ఇది కేవలం వారి దోషమే కాదు. ఒక నిపుణుడు తన పరిధికి చెందని రంగంలో కూడా తాను గొప్పవాడినని భావించడం కద్దు. బ్రిటన్లో ఒక ఖగోళ శాస్త్రజ్ఞుడు పదార్థ విజ్ఞానంలో తాను జరిపిన గొప్ప కృషివల్ల, దేవుడున్నాడా అనే విషయం మొదలు, చిత్తానికి స్వేచ్ఛ ఉన్నదా అనే సమస్యవరకూ మాట్లాడే అర్హత ఉందనుకొంటాడు. శస్త్ర చికిత్సలో నిపుణుడు అంతర్జాతీయ రాజకీయాలలో సునిశిత లోతుపాతులను అవగాహన చేసుకున్నట్లు భ్రమ చెందుతాడు. ఒక రుషి తనను తత్వవేత్తగా, విద్యావేత్తగా స్వీకరించాలనుకుంటాడు. మామూలు మనుషులలో కూడా దోషం లేకపోలేదు. ఆదిమ మానవుడు మంత్రగాడివైపు ఆశ్చర్యపోయి చూసినట్లు, అతడే సర్వశక్తి మంతుడని భావించినట్లు, నిపుణుడు తనకు సంబంధించిన పరిధిలో ఏది చెప్పినా అదే ప్రమాణవాక్యంగా స్వీకరించటానికి సిద్ధంగా ఉంటాడు. 1830 ప్రాంతాలలో సర్ జేమ్స్, సర్, ఆర్థర్ ఎడింగ్టన్లు ఇటువంటి ప్రతిష్ఠనే పొందారు. ఒక రంగంలో నిపుణుడైతే ఇక అన్ని విషయాలపై అతడు మాట్లాడగలడని సాధారణ మానవులంతా నమ్ముతారు. ఎంతో కాలం శిక్షణ, అధ్యయనం చేసిన తరవాత గానీ ఒకానొక రంగంలో నైపుణ్యం సాధ్యంకాదు. అప్పుడే ప్రత్యేకమైన మేధస్సుతో కూడిన క్రమశిక్షణకూడా అలవడుతుంది. ప్రకృతి విజ్ఞానంలో ఇది స్పష్టం. ఈ రంగంలో ఒక సమస్యను ప్రతిపాదిస్తే అది అవగాహన చేసుకోటానికి కూడా సాంకేతికంగానూ, భాషాపరంగానూ ఎంతో శ్రమపడవలసి ఉంటుంది. నిపుణుడు కాని వ్యక్తి ఇటువంటి శ్రమచేయడు. ప్రకృతి శాస్త్రాల సమస్యను మానవుడి ఉద్వేగాలపై ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపకపోవడమే ఇందుకు కారణం, తత్వంలోనూ, సామాజిక శాస్త్రాలలోనూ పరిస్థితి వేరేవిధంగా ఉన్నది. ఆత్మ, దేవుడు, సమానత్వం, సాంఘిక న్యాయం, మొదలైన వాటిని గురించి ప్రతివాడూ తనకు తెలుసుననుకుంటాడు. అలా కాకున్నప్పటికీ ఈ విషయాలలో ఇతరులు చేసే వాటి ప్రభావం మిగిలినవారిపై ఉంటున్నది. విజ్ఞానవేత్త తన వృత్తికి సంబంధించిన పని నుంచి కొంత ఉపశమనం పొందటానికి, తత్వంపైనో, రాజకీయాల గురించో రాస్తే అతడికి ఎక్కడో ఒకచోట అభిమానులు తయారవుతుంటారు. కనకనే విజ్ఞానం సాంస్కృతికంగా విమొచన కలిగించే పాత్రను నిర్వరిస్తుందని నొక్కి చెప్పటం అవసరం. ఇందుకుగాను మానవుడి సమస్యలకు వైజ్ఞానిక పద్ధతుల ప్రాధాన్యతను చూపడం అవసరం. జాన్ డ్యూయీ చెప్పినట్లు ఆధునిక ప్రపంచంలో మేధస్సును ఒక క్రమంలో పెట్టటానికి ఈ వైజ్ఞానిక పద్ధతి వినియోగపడుతుంది.

Thursday, December 27, 2007

How far Marxism stands for scientific test?

ప్రజాస్వామ్యం-మార్క్సిజం

సమాజ విజ్ఞానం నుంచి మనం చివరి ఉదాహరణ చర్చిద్దాం. సమాజ సిద్ధాంతానికి సంబంధించి మార్క్సిజాన్ని శాస్త్రీయమైందిగా భావిస్తున్నారు. గతి తార్కిక పదార్థవాదం అనే ప్రకృతి సిద్ధాంతం నుంచీ దీని రూపొందించారు. ఈ విధమైన ఆలోచనను తమకాలంలోని వైజ్ఞానిక సామాజిక వాస్తవాల దృష్ట్యా, మార్క్స్, ఏంగిల్స్ లు అనేక సంవత్సరాల కృషితో పెంపొందించారు. వీరిద్దరూ వాస్తవాల విషయంలో విజ్ఞాన ఖనులుగా భావించబడ్డారు. అయితే ఆ వాస్తవాలన్నీ అంత ఉపయోగకరమైనవి కాదు. మార్క్స్, ఏంగిల్స్ లు వైజ్ఞానిక పద్ధతిలో శిక్షణ పొందినవారు కారు. జర్మన్ తత్వవేత్త హెగెల్ ప్రభావం కింద మార్క్స్ ఉన్నారు. కేవల భావం అనే పేరిట గతితార్కికాభివృద్ధి దృష్ట్యా ప్రపంచంలోని భిన్న సంఘటనలను వ్యాఖ్యానించడానికి హెగెల్ పూనుకున్నాడు. హెగెల్ పద్ధతిని అనుసరించి మార్క్స్ కు, ఏంగిల్స్ కు ఉన్న మోజు వల్ల వారు, వారి కాలంలోని పదార్థ విజ్ఞానం, గణితశాస్త్రాన్ని కూడా వక్ర భాష్యంలో చిత్రీకరించారు. కాని గతితార్కిక పదార్థవాదం వంటి దోష పూరితమైన ప్రకృతి సిద్ధాంతం నుంచి సామాజిక సిద్ధాంతాన్ని రూపొందించవచ్చునా లేదా అనే విషయాన్ని అలా ఉంచుదాం. కాని గతి తార్కిక పదార్థవాదం వంటి దోష పూరితమైన ప్రకృతి సిద్ధాంతం నుంచి, రాబట్టిన సామాజిక సిద్ధాంతం ఏదీ కూడా సరైంది కావడానికి వీలులేదు. (సోవియట్ శాస్త్రజ్ఞులూ, విజ్ఞాన తత్వవేత్తలు కూడా గతితార్కిక భౌతిక వాదం పట్ల ప్రస్తుతం ఏదో మొక్కుబడిగానే గౌవరం చూపుతున్నారు. ఈ విషయం సరళమైన విమర్శకు సిడ్నీ హుక్ రాసిన డైలెక్టికల్ మెటీరియలిజం అండ్ సైంట్ ఫిక్ మెథడ్ చూడవచ్చు. ఈ విషయంలో ఐన్ స్టిన్ కూడా తనతో ఏకీభవిస్తున్నట్లు హుక్ పేర్కొన్నారు.) మార్క్సిజం అంచనా వేసిన అనేక ప్రధాన ప్రాతిపదికలు దారుణంగా, దోష పూరితాలని రుజువయ్యాయి. పారిశ్రామికీకరణ పెంపొందే కొద్దీ బూర్జువావర్గం తప్ప సమాజంలో మిగిలిన వారందరిలోనూ పేదరికం ధోరణి పెరిగిపోతుందని మార్క్స్ అంచనా వేశాడు. బూర్జువావర్గం మాత్రం కొద్దిమందే అయినా బాగా సంపన్నులుగా పెరిగి పోతారన్నారు. దీని ఫలితంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలలో కమ్యూనిస్టు విప్లవం వస్తుందని మార్క్స్ అంచనా వేశారు. విప్లవానికి సంరక్షకులుగా కార్మిక వర్గం ముందు నడుస్తుందన్నాడు. కార్మిక వర్గ నియంతృత్వం ద్వారా పెట్టుబడిదారీ వర్గాలకు భిన్నమైన వారికి అధికారం సంక్రమించటానికి విప్లవం తోడ్పడుతుంది. పెట్టుబడిదారులు తప్ప మిగిలిన వారందరూ రాజకీయ ఆర్థిక స్వేచ్ఛను అనుభవించేటట్లు కార్మిక వర్గం జాగ్రత్త వహిస్తుందన్నారు. సంధికాలం అనంతరం (ఇదెంతకాలం ఉంటుందో మార్క్స్ సూచించలేదు. పెట్టుబడిదారీ అవశేషాలు తొలగిపోవటానికి వీలుగా రెండు తరాలు ఉంటుందని అంచనా వేసుకోవచ్చు). రాజ్యం హరించిపోవడానికి నాంది పలుకుతుంది. ఆస్తి యాజమాన్యం ఉన్న వర్గాలంటూ ఏమీ లేవు గనక ఎవరికీ ఒత్తిడి చేయవలసిన పనిలేదు. ఎవరినీ దోపిడీచేసే అవకాశం లేదు.

ఈ అంచనాలన్నీ దోషపూరితమని రుజువయ్యింది. కమ్యూనిస్టులు తొలుత రష్యాలోనూ, తరవాత తూర్పు ఐరోపాలోనూ, పిమ్మట చైనాలోనూ విప్లవాన్ని తెచ్చారు. ఇవన్నీ పారిశ్రామికంగా వెనకబడిన దేశాలే. (చెకోస్లోవేకియా ఇందుకు మినహాయింపు) తూర్పు ఐరోపాలో విప్లవంలాగే ఎక్కడ కూడా కుట్రతో తప్ప మార్క్స్ కలలు గన్నట్లు ప్రజావిప్లవం రాలేదు. పశ్చిమ ఐరోపా, ఉత్తర అమెరికాలలాగ ఈ దేశాలు సంపన్నమైనవి కావు. కమ్యూనిస్టేతర దేశాలలో పారిశ్రామికీకరణాభివృద్ధి వల్ల ప్రజలలో పేదరికం పెరగలేదు. పైగా ఆర్థిక సమానత్వాలు తగ్గిపోయి, కార్మికుడు సమాజంలో ఆత్మ గౌరవం గల సభ్యుడుగా ఆదరం పొందాడు. కమ్యూనిస్టు దేశాలలోని కార్మిక నియంతృత్వం. ఇతర నియంతృత్వాలు తగ్గిపోయి, కార్మికుడు సమాజంలో ఆత్మ గౌరవం గల సభ్యుడుగా ఆదరం పొందాడు. ప్రజలపై అధికారం చెలాయించే నియంతృత్వంగా తయారయింది. ప్రజలపై అధికారం చెలాయించగల హక్కు లభించడం, దానిని వీరు ఇష్టం వచ్చినట్లు, అమానుషంగా వాడటం జరిగింది. సోవియటే రష్యాలో మూడు తరాల అనంతరం కూడా నియంతృత్వం పట్టుసడలే ధోరణిగానీ, రాజ్యం హరించుకుపోయే లక్షణాలుగాని కనిపించలేదు. అక్కడ పెట్టుబడిదారీ అవశేషాలు ఏమాత్రం లేవు కూడా. (సోవియట్ యూనియన్ తరవాత విచ్చిన్నమై, కమ్యూనిజం అధికారాన్ని కోల్పోయింది).
జ్యోతిష్యంలాగే మార్క్సిజం కూడా పరీక్షకు గురి అయ్యే ప్రమాణాన్ని అన్వయించనందున, వైఫల్యాలతో సర్దుకుపోతోంది. ప్రతివైఫల్యానికి ఏదో ఒక సాకు ఉంటుంది. సోషల్ డెమోక్రట్ల విద్రోహచర్య, కార్మిక వర్గ అపరిపక్వత, వామపక్ష సెక్టీరియనిజం మొదలైనవి పేర్కొంటారు. ఇవన్నీ, సంఘటనలు జరిగిపోయిన తరవాత అన్వేషించే సాకులే. సిద్ధాంతం మాత్రం లోగడవలె ఇప్పుడు కూడా నిస్సారమైందే. పదజాలాన్ని మాత్రం సంపన్నం చేశారు. విధేయులుగా ఉండేవారు సంతోషించారు. కృశ్చేవ్ దోషాలను బయటపెట్టినప్పుడూ, మావోదురాక్రమణ చేసినప్పుడూ మూఢ విశ్వాసులమత్తు వదిలిపోయింది. ప్రాపంచిక అనుభవానికీ, విజ్ఞానానికీ మార్క్సిజం పనికిరానిదన్నప్పుడు, పరీక్షించడానికి తగిన ప్రమాణాలు ఈ సిద్ధాంతానికి అన్వయించవనే అర్థం. ఆచరణలో మాత్రం మార్క్సిజం అమానుష, సామాజిక ఫలితాలకు దారితీసింది. చరిత్రలో ఎన్నడూలేనంతగా భారీ ఎత్తున ఈ అమానుష కృత్యాలు జరిగాయి. మానవజాతికి ఇది చాలా ప్రధానమైన విషయం. అయితే మార్క్సిజం యొక్క వైజ్ఞానిక స్థాయిని నిర్ణయించటానికి ఈ విషయాలు సందర్భ సహితాలు కావు.

మానవుడిని గురించి గాని, విశ్వం గురించి గాని ఇదే తుది సత్యమంటూ ప్రజాస్వామ్యం దేనినీ పేర్కొనదు. స్వేచ్ఛ, వ్యక్తి, గౌవరం, మనుషులలోని అంతర్యంలోనూ, పరిసరాల దృష్ట్యా ఎంతతేడా ఉన్నప్పటికీ మానవులందరినీ సమానంగా గుర్తించడం, ఇతరులతో సహకరిస్తూ సంపూర్ణ జీవితాన్ని గడపడం అనేవాటిని ప్రజాస్వామ్యం ప్రధానంగా స్వీకరిస్తుంది. ఇటువంటి విలువలను సాధించడానికి ఉత్తమోత్తమ సామాజిక వ్యవస్థను కనుక్కొనే పంథాను ప్రజాస్వామ్యం నమ్ముతుంది. అటువంటి మార్గం ప్రాపంచికానుభవంతో కూడిందేగాక, తాత్కాలికం కూడా. ప్రతివ్యక్తి కూడా ఈ విలువలను క్రమంగా సాధ్యమైనంత మేరకు సాధించ కుంటూ పోతాడు. అటువంటి సామాజిక క్రమాన్ని సాధించుకోడానికి ఏదీ ఉత్తమ పద్ధతి అని పరిశీలిస్తాడు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ అనేది కీలకమైన విలువ. సమాజంలోని వ్యక్తి మాత్రమే స్వేచ్ఛను సాధించగలడు. కనక ప్రజాస్వామ్యం అందరికీ ఓటు హక్కు కోరుతుంది. స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు కావాలంటున్నది. తమ ప్రతినిధులుగా ఉండదగనివారిని అధికారం నుంచి తొలగించే హక్కు వారికి ఉండాలంటుంది. ఆర్థికంగా అసమానత్వాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తే, రాజకీయ సమానత్వం అనేది కేవలం ఆటగామాత్రమే ఉంటుంది. అటువంటప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆర్ధికాధికారాన్ని వికేంద్రీకరించాలని ప్రజలు కోరారు. ఉత్పత్తి సాధనాలను జాతీయం చేయడం ద్వారా దీనిని సాధించవచ్చునని తొలుత భావించారు. ఆర్థిక స్వేచ్ఛను కోరిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గ్రేట్ బ్రిటన్ లో లేబర్ పార్టీని అధికారంలోకి ఎన్నుకోగా, వారు జాతీయీకరణతో ప్రయోగం చేశారు. కాని ప్రజాస్వామిక, కమ్యూనిస్టు దేశాలలో జాతీయీకరణ ప్రయోగం కనువిప్పుకలిగించింది.
జాతీయీకరణకంటే, ఆర్థిక రంగాన్ని అదుపులో పెట్టడం వల్ల అనుకున్నవి సాధించవచ్చునని తేలింది. జాతీయకరణ వృధా అనీ, చికాకుకలిగించే పద్ధతి అని రుజువైంది. కమ్యూనిస్టు దేశాలన్నిటిల్లోనూ రాజకీయాధికారానికి ఆర్థికాధికారం తోడు అయింది. జాతీయకరణ వల్ల కలిగిన ఫలితమే ఇదంతా, ఒక పక్కన ప్రభుత్వానికి విపరీతాధికారాలుండగా, మరొక పక్క పౌరడు బానిస స్థాయికి దిగజారాడు. ఈ అనుభవం నుంచి ప్రజాస్వామ్యం గుణపాఠం నేర్చుకుంది. కనుక పిడివాదం లేని పంథాను అనుసరించాలని ప్రజాస్వామ్యం చెబుతుంది. సోషలిజంపై తీవ్రచర్చ జరిగింది. ప్రాశ్చాత్య ప్రపంచంలో ఇది ఇంకా మారు మ్రోగుతూనే ఉంది. దీని ఫలితంగానే 20వ శతాబ్దపు సోషలిజం అనే సిద్ధాంతం వెలువడింది. (సోషలిస్ట్ యూనియన్ ప్రచురించిన ట్వంటియత్ సెంచరీ సోషలిజం చూడండి. పెంగ్విన్ బుక్స్) మార్క్సిజం ఇంకా జాతీయకరణనే పట్టుకువేలాడుతోంది. ముందుగా రూపొందించిన చట్రంలో వాస్తవాలను ఇమడ్చాలని ప్రయత్నిస్తున్నది. అనుభవాన్ని బట్టి సిద్ధాంతాన్ని స్వచ్ఛందంగా మార్చుకోవాలనుకోవడం లేదు.

వైజ్ఞానిక సిద్ధాంతాన్ని అన్వయించడానికి గాను కొన్ని ఉదాహరణలు పరిశీలించాం. ఇది ఇతర విషయాలకు వర్తింపజేయవచ్చు. కులం, ఏకపక్షంగా నిరాయుధీకరణ, సమిష్టివ్యవసాయక్షేత్రాలు, శాంతి ప్రయోజనాల సాధన, పారిశ్రామికీ కరణకు పథకాలు-ఇత్యాదులను పరిశీలించవచ్చు. ఇవన్నీ ఎక్కువ స్వేచ్ఛను, వ్యక్తి సంక్షేమాన్ని కోరేవే. ఇటువంటి ప్రతిపాదనలు చేసిన వారి స్వేచ్ఛను, వ్యక్తి సంక్షేమాన్ని కోరేవే. ఇటువంటి ప్రతిపాదనలు చేసిన వారి ఉద్దేశాలను ప్రశ్నించకుండానే, ఏ మేరకు ప్రయోజనాన్ని సాధించామో పరిశీలించవచ్చు. అలా చేయడానికి గాను అనువైన వాస్తవాలను ఎక్కడ, ఎలా కనుక్కోవడమో వ్యక్తికి తెలియాలి. ఇందుకు తగిన శ్రమ చేయాలి. ఎలాంటి అరమరికలు లేకుండా నిష్పాక్షికంగా అన్వేషణ చేసే ధోరణి అలవరచుకోవాలి. అనేకమంది వ్యక్తులు ఈ విధమైన కృషి చేస్తే తప్ప, ప్రజాస్వామ్యానికీ మానవ విలువలకూ భద్రతలేదు. సంపన్నమైన సుసంఘటిత సమాజాలలోనూ ఇదే పరిస్థితి ఉంది. మనసమాజం సంపన్నమూ కాదు, సుసంఘటితమూ కాదు.

Wednesday, December 26, 2007

ఎలక్ ట్రాన్ -దేవుడు- Scientific method contd-

ఎలక్ట్రాన్-దేవుడు
ఎలక్ర్టాన్ దేవుడు అనే భావాలు మరొక ఉదాహరణగా స్వీకరించవచ్చు. ఇవి రెండూ సూటిగా చూడడానికి వీలులేదు. ఎలక్ట్రాన్ చలనాన్ని పరిశీలిస్తున్నామని విజ్ఞానవేత్తలు చెప్పారంటే ఆటలో బంతిని గమనించినట్లు ఇది గూడా చూశారని భావించరాదు. గ్యాస్ లో రేణువులు ఒకానొక మార్గంలో ఉన్నప్పుడు, ఎలక్ర్టాన్ నుంచి శక్తిని పొంది, విజ్ఞానం పేర్కొనే నియమాలననుసరించి కాంతి కిరణాలను ప్రసరిస్తాయి. విజ్ఞానవేత్తలు గమనించేది ఈ కాంతి మార్గాన్నే. ఆ మార్గాన ఎలక్ట్రాన్ పయనించినట్లు విజ్ఞాన వేత్త గ్రహిస్తాడు. మనం చూడని ఎడ్లబండి రోడ్డు మీద వెళ్ళిపోయిన తరవాత ఆ దారిన పడిన గుర్తులనుబట్టి ఎడ్లబండిగాక, ఇంకేవీ వెళ్ళలేదని తెలుసుకుంటాం. పైగా ఎంతదూరం అలా వెళ్ళింది గమనించవచ్చు కూడా. ఇదంతా మనం చూడని ఎడ్లబండి వెళ్ళిపోయిన తరవాత చెబుతున్న మాటలే. పైన చెప్పిన ఆవిరిలో ఎలక్ర్టాన్ మార్గం కూడా ఇలాంటిదే. ఎలక్ర్టాన్ పరిమాణం మనం సూటిగా చూడటానికి వీలులేనంత చిన్నది. కాని దాని చలనాన్ని అంచనా వేయవచ్చు. వెలిగిన మార్గానికి మరొక కారణం లేదనికూడా చూపవచ్చు. కనకనే ఆ మార్గాన ఎలక్ట్రాన్ పయనించినట్లు నిర్ధారణగా చెప్పవచ్చు. బంతి పోవడానికీ, ఎడ్లబండి వెళ్ళిపో వడానికీ, తేడా ఉంది. ఎలక్ర్టాన్ వెళ్ళిన తరవాత కాంతి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. గాలిలో రేణువులు ఎలక్ట్రాన్ వల్ల ప్రకంపించి నందువల్ల మనకు వెలుగురావడం లేదు. ఎలక్ర్టాన్ తన శక్తిని వాటికి ఇవ్వడం వల్లనే వెలుగువస్తుంది.
అయినప్పటికీ ఎలక్ట్రాన్ వైజ్ఞానిక భావన అంటున్నాం. మేధస్సుతో అవగాహన చేసుకునే భావన ఇది. ప్రాపంచిక విధానాలకు చెందేతీరు ఇందులో ఉంది. దీనికి కొంత ద్రవ్యరాశి, పరిమాణం చేర్చవచ్చు. దీని ప్రవర్తనకు సంబంధించిన నియమాలను రూపొందించవచ్చు. ఈ కార్యకారణ విధానంలో సాక్షి వంటి పరిశీలకుడు ఎవరూ అవసరం లేదు. ఎలక్ర్టాన్ ప్రాపంచిక అనుభవరీత్యా వాస్తవమైనది. ఎలక్ర్టాన్ ప్రవర్తనను పరిశీలించేవాడు ఎప్పుడు ఎక్కడ ఉన్నాడనే దానితో నిమిత్తం లేకుండా, అది స్వతంత్రంగా కాల ప్రదేశాలలో ఉన్నది.
దైవ భావన విషయంలో ఇదే సూత్రం అన్వయించదు. దేవుడు తప్పనిసరిగా ఉంటాడనుకొంటే, దేవునికి నియమాలను ఏర్పరచడం సాధ్యపడదు. పరిశీలకునితో నిమిత్తం లేకుండా, కాల-ప్రదేశాలలో ప్రాపంచిక అనుభవ విషయంగా చూసేటందుకు వీలులేని విషయమిది. దైవభావన విజ్ఞాన పూరితంకాదు. ప్రాపంచిక వాస్తవానికి చెందని విషయమిది. మానవుడు, ప్రకృతి గురించి విజ్ఞానం చెపుతున్న దాన్నిబట్టి చూస్తే దైవానికి అంటగట్టే లక్షణాలు అనవసరమనీ లేదా, అశాస్త్రీయమని అనిపిస్తున్నది. దైవం విషయంలో లాగే, ఆత్మ భావనలో కూడా ఇటువంటి వాదమే చెల్లుతుంది.

Tuesday, December 25, 2007

Is Ayurveda scientific? Scientific Method contd...


ఆలోపతి-ఆయుర్వేదం


అలోపతి-ఆయుర్వేద వైద్యరంగాలలోనూ ఇటువంటి విచక్షణే చేయవలసి ఉంది. అనుభవం, పరిశీలన ఆధారంగా ఆయుర్వేదం అనేక ప్రాపంచిక విషయాలను చిలికించింది. జ్యోతిష్యం లాగ కాక ఆయుర్వేదంలో రోగ నిర్ణయానికీ, చికిత్సకూ సంబంధించి విజ్ఞాన సిద్ధాంతాన్ని ఏర్పరచడానికీ వీలుగా ఆధారం ఉంది. అయితే ఆయుర్వేదం ఇంకా విజ్ఞాన సిద్ధాంతంగా పెంపొందలేదు. వాత, పిత్త, కఫం అనే ప్రతిపాదనలుగానీ, రస, కామ, రక్త, మాంస, మేధ, అస్తి, మజ్జ, శుక్ర అనే ఏడు సారాంశాల విషయంగానీ, ఆధునిక శారీరక శాస్త్రం కనుక్కొన్న వాటితో సరిపోవడం లేదు. ఈ విధంగా ప్రత్యక్షంగా వ్యవస్థాపితమైన జ్ఞానంతో పొందికగా లేకపోవడం వల్ల ఆధునిక విజ్ఞానానికి ఆయుర్వేదం ఆమోద యోగ్యం కాదు.

ఆయుర్వేదానికి భిన్నంగా ఆలోపతి సిద్ధాంతం ప్రత్యక్షపరిశీలనపై ఆధారపడి ఉంది. మానవుని శరీరంలో ఏది ఎలా పనిచేస్తుందో గమనించారు. ఇది ఒకవేళ అసంపూర్తిగా ఉన్నప్పటికీ ప్రశ్నించటానికి వీలులేని వాస్తవాల నాధారం చేసుకొని గట్టి ప్రాతిపదికలు చేసింది. ఆధునిక వైద్య శాస్త్రంలో కొన్ని రోగాలకు మాత్రమే నిర్దిష్టంగా చికిత్సలు కనుక్కొన్నారు. కాని రోగ నిర్ణయం మాత్రం తిరుగులేనిది. కాన్సర్ (పుట్టుకురుపు) ఎలా పెంపొందుతుందో, దీనిని ఎలా నయం చేయాలో ఇంకా తెలియదు. తొలిదశలో కనుక్కొంటే మాత్రం నయం చేయగలుగుతున్నారు. మధుమేహం, చలిజ్వరం, ప్లేగు, సన్నిపాతజ్వరం, కలరా, రక్తపుష్ఠి లేకపోవటం, నంజువ్యాధి, ఎముకలు సరిగ్గా ఎదగకపోవటం ఇత్యాదుల విషయంలో వివరాలతో సహా రోగనిర్ణయం తెలుసు. వీటిలో కొన్నిటికి ఆయుర్వేదం చికిత్స చేసి ఫలితాలు సాధిస్తున్నది. అయితే ఈ రోగాలకు చెప్పే కారణాలు, ఎలా నయమవుతున్నాయో వివరించే విధానం కృత్రిమంగానూ, దోష పూరితంగానూ ఉన్నాయి.

Monday, December 24, 2007

కారల్ మార్క్సుకు కమ్యూనిస్టులు పట్టించిన గ్రహణం -ముగింపు



బైబిలు పై ప్రమాణం

ముగింపుకు ఒక ఆసక్తికర సంఘటన పేర్కొందాము. మార్క్సు అల్లుడు లాఫార్గ్ పారిన్ కమ్యూన్ ప్రవాసి లెమౌసూలు ఒక వ్యాపారం ప్రారంభించాడు. జార్జిమూర్ అనే అతడు కూడా వచ్చి చేరాడు. త్వరలోనే లాఫార్గ్ పేచీపడి వైదొలగాడు. ఆ స్థానంలో మార్క్సు చేరాడు. కావలసిన పెట్టుబడి ఎంగెల్సు అందజేశాడు 1874లో కథ ఇది.
లెమౌనూ ఒక కొత్త కాపీయింగ్ మెషీన్ కనిపెట్టాడు. దానిపై పేటెంట్ హక్కు విషయమై మార్క్సు, లెమౌనూ పేచీపడ్డారు. కోర్టుకు పోతే గొడవ అవుతుందని ఫ్రెడరిక్ హరిసన్ అనే మధ్యవర్తి వద్దకు వెళ్ళారు. అతను ఆనాటి ఆచారం ప్రకారం ముందుగా ఇరువురినీ బైబిలు పై ప్రమాణం చేయమన్నాడు. ఇరువురూ అవమానం అన్నారు. తరువాత ఒకరిఎదుట మరొకరు చెయ్యమన్నారు.
చివరకు సర్దుబాటు చేసుకొని, ఏమీ మాట్లాడకుండా బైబిలుపై ఇరువురు ఒకే పర్యాయం చేతులు పెట్టారు. ఇంతా చేస్తే మార్క్సు కేసులో ఓడిపోయాడు. (చూ. . F.Harrison Autobiographic Memoirs 1911 London)

మార్క్సుకు పట్టిన ఏంగెల్సు గ్రహణం
మార్క్సిజాన్ని మార్క్సు రచనల ద్వారా అవగాహన చేసుకోవాలి. కాని మార్క్సు రచనలలో మకుటాయమానమైనవి చాలా కాలం అందకపోవడంతో ఆ అవకాశం లేకుండా పోయింది. మార్క్సిజాన్ని ఇతరులు చెప్పినదాన్ని బట్టి అర్ధం చేసుకున్న తీరే ఎక్కువ.... అందులో ముఖ్యంగా ఎంగెల్సు వ్యాఖ్యానం వలన ప్రామాణీకరించబడింది. కాని ఎంగెల్సు చెప్పింది మార్క్సిజం కాదు. మార్క్సిజానికి ఎంగెలిజం అయింది. రెండింటికీ తాదాత్మ్యం ఎంత ఉన్నదో తేడా కూడా అంత ఉన్నది. కాబట్టి ఎంగెలిజాన్నివిడదీసి చూసుకుంటే కానీ మార్క్సిజం బయట పడదు.
ఎంగెల్సు సిసలైన రచనలన్నీ మార్క్సులో సత్తా అయిపోయిన అంత్య దశలోనూ, ఆ తరువాత బయటపడినవి. ఎంగెల్సు రచన (ఏంటీ డ్యూరింగ్) మార్క్సు మరో నాలుగేళ్ళకు మరణిస్తాడనగా వచ్చింది. (1878) మార్క్సు చనిపోయిన సంవత్సరంలో సోషలిజం, సైంటిఫిక్ అండ్ ఉటోపియన్ వెలువడింది. అసలు సిద్ధాంత గ్రంథం ది డయలెక్టిక్ ఆఫ్ నేచర్ లోకానికి 1927లో గాని తెలియలేదు. లడ్ విగ్ - ఫ్యూయర్ బాహ్ అండ్ ది ఎండ్ ఆఫ్ క్లాసికల్ జర్మన్ ఫిలాసఫీ 1888లో వెలువడింది. ది ఆరిజన్ ఆఫ్ ఫ్యామిలీ ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ స్టేట్ 1884లో బయట పడింది.
వీటన్నిటిల్లోనూ అసలైన ఎంగెల్సు, మార్క్సు ప్రభావం లేని ఎంగెల్సు మనకు కనిపిస్తాడు. అందువలన ఈ రచనలన్నీ జాగ్రత్తగా పరిశీలించాలి. అంతే కాదు ఇవి ఎంగెల్సు సొంత భావాలే గాని మార్క్సుకు సంబంధం లేనివని కూడా గమనించకపోతే, మార్క్సిజాన్ని, ఎంగెల్సిజాన్ని కలగాపులగం చేసే ప్రమాదం ఉన్నది.
1883 నుండి 1895 వరకు ఎంగెల్సు నిజస్వరూపం, వ్యక్తిత్వం రూపం దాల్చినవి. అంతకు పూర్వం అనగా మార్క్సు సజీవుడుగా, ఉన్నంతకాలం ఎంగెల్సు తన అభిప్రాయాలకు స్వతంత్ర రూపాన్నివ్వలేదు. మార్క్సుతో తనకుగల ఏకాభి ప్రాయాలనేగాని, భేదాభిప్రాయాలను వెల్లడించలేదు. మార్క్సు నాయకత్వాన్ని అంగీకరించి, జీవితాంతం అతని సహచరుడుగా, ఆర్ధిక సహాయం అందించిన ఎంగెల్సు తన వ్యక్తిత్వాన్ని దాచుకున్నాడు. సైనిక వ్యవహారాలు, వైజ్ఞానిక విషయాలకే పరిమితమైన రచనలు చేశాడు. ఈ విషయాలలో అవసరమైనప్పుడు మార్క్సుకు వ్యాసాలు, రచనలు చేశాడు. మార్క్సు ఇష్టం వచ్చినట్లు దిద్దితే అభ్యంతర పెట్టలేదు. కాని మార్క్సు రచనలను దిద్దే సాహసం ఎంగెల్సు ఎన్నడూ చేయలేదు.
మార్క్సు, ఎంగెల్సు కలసి వ్రాసిన గ్రంథాలు మూడున్నవి. కమ్యూనిస్ట్ మానిఫెస్టో, ది జర్మన్ ఐడియాలజీ, గ్రేట్ మెన్ ఆఫ్ ది ఎక్సైల్, వీటిలో కూడా మార్క్సు అనుచరుడిగా, సహాయకుడిగానే ఎంగెల్సు పాత్ర ఉన్నది గానీ అంతకు మించి కాదు.
విషయ సేకరణకు, వాస్తవాలను వ్యాఖ్యానించటానికీ ఎంగెల్సు ఎప్పుడూ మార్క్సుకు తోడ్పడుతూ వచ్చాడు. సిద్ధాంతపరమైన గ్రంథాలలో ముఖ్యంగా కేపిటల్ విషయంలో ఎంగెల్సు అనేక చోట్ల తన అవగాహనకు మించినట్లు భావించాడు.
బేరీజు వేసి చూస్తే, మార్క్సు మానవుడు, సమాజపరంగా దిట్ట. వైమనస్యత పూర్తిగా అవగాహన చేసుకున్నవాడు మార్క్సు. శ్రమకు తగిన కూలంకష విషయం మార్క్సుకు కరతలామలకం. మానవ శ్రేయస్సుకు ఉత్పత్తి కావాలనేది మార్క్సు తత్వం.
ఎంగెల్సు దృష్టి వేరు. ఆర్ధక విషయాలలో ఆసక్తి ఉన్నా, సాంకేతిక, వైజ్ఞానిక రంగాల విలువలు ఎంగెల్సు లోతుగా అధ్యయనం చేశాడు. సైనిక కార్యకలాపాలంటే అతనికి కొట్టిన పిండి. వాస్తవాలకు మించి పోనివాడు ఎంగెల్సు. తత్వచింతన, వైమనస్యత ఎంగెల్సుకు వంటబట్టని ఆలోచనలు. ప్రకృతిని సైన్స్ ను యాంత్రికంగా చూసినవాడు. మార్క్సు తన సిద్ధాంతాలలో ఆద్యంతాలు అంతర్లీనంగానూ, స్పష్టంగానూ నొక్కి చెప్పిన వై మనస్యత, బాహ్యాకరణ, మానవ జీవి అనేవి ఎంగెల్సుకు అంతుబట్టని అవాస్తవికాలు. ఈ విషయమై ఫ్యూయర్ బాహ్, హెగెల్ తత్వాన్ని మార్క్సు పరిశీలించినట్లు ఎంగెల్సు ఎన్నడూ చూడలేకపోయాడు. ఎంగెల్సుకు నేలబారు దృష్టి. వాస్తవాలు అతని ఆయుధాలు. యాంత్రిక విధానాలు అతని సాధనాలు.
ఎంగెల్సు తల్లితండ్రులు వ్యాపారస్ధులు. కుమారుడు కూడా వ్యాపారంలో పైకి రావాలని వారి ఆకాంక్ష. కాని ఎంగెల్సు ఎదురు తిరిగాడు. కార్మికుల స్థితిగతులు స్వయంగా చూసిన ఎంగెల్సు వ్యాపారం చేయదలచలేదు. అందువలన కుటుంబంతో తాత్కాలికంగా తెగతెంపులు చేసుకుని పత్రికా వ్యాసంగం ఆరంభించాడు. సైన్యంలో చేరి ఒక్క ఏడాది పని చేశాడు. కవితలు, నాటకాలు వ్రాశాడు. యూనివర్సిటీలో చదవని ఎంగెల్సు, తాత్విక విషయాలను తొలుత పట్టించుకొనక కవితావేశంలో తేలాడు. జాతీయవాదిగా జర్మనీ ఐక్యత కాంక్షించాడు. సాంఘిక ఉద్యమాల్లోకి దూకాడు. హెగెల్ తత్వంపట్ల ఆకర్షితుడైనాడు. అందులోనుండి క్రమంగా బయటపడి హేతువాదిగా, పిమ్మట కమ్యూనిస్టుగా మారాడు. యువకుడుగా ఎంగెల్సు మతం నుండి హేతువుకు రావడానికి కొంత కాలం పట్టినా, త్వరితంగానే ఉరకలు తీశాడు.
అయితే మార్క్సుతో 1842లో పరిచయమైన తరువాత ఎంగెల్సుకు పెద్ద దిక్కు లభించినట్లు, జీవితంలో మేథావి అండదొరికినట్లయింది. మానసికంగా కుదుటబడిన ఎంగెల్సుకు బ్రతుకు తెరువు సమస్య ఎదురయింది. తన కంటె అధ్వాన్న స్థితి మార్క్సుది. ఈ పరిస్థితులన్నీ తిరిగి తండ్రితో రాజీపడి, మాంఛెస్టర్ లోని ప్రత్తి, నూలు వ్యాపారంలోకి దిగేటట్లు చేశాయి ఎంగెల్సును. ఆ తరువాత అక్కడ కార్మికుల స్థితిగతుల గొడవ ఎంగెల్సు పట్టించుకోలేదు. అందరు వ్యాపారస్థులవలే, దోపిడీ విధానంలో ఎంగెల్సు పయనించక తప్పలేదు. తాను సాధారణంగా జీవించటమే గాక తన పెద్ద దిక్కు మార్క్సును అతని కుటుంబాన్ని తరచు ఆర్ధికంగా ఆదుకోవలసిన బాధ్యత ఎంగెల్సుపై పడింది. కనుక పెట్టుబడిదారీ విధానం అనుసరించటం ఎంగెల్సుకు అవసరమైంది.
ఎంగెల్సు మానసికంగా, వైజ్ఞానికంగా మార్క్సు మేథస్సును గుర్తించాడు. మార్క్సు చెప్పినట్లు అనుసరించాడు. తన పేరిట మార్క్సు న్యూయార్క్ ట్రిబ్యూన్ కు వ్యాసాలు వ్రాయమంటే వ్రాసి పెట్టాడు ఎంగెల్సు. వాటికి వచ్చిన డబ్బు మార్క్సుకే అందించాడు. తన వ్యాపారంలో మార్క్సు ఎట్లా మార్పులు, చేర్పులు చేసినా ఎంగెల్సు వ్యాఖ్యానించలేదు. ఇద్దరూ కలిసి పుస్తకాలు వ్రాసినా మార్క్సుదే పై చేయిగా ఉండేది. తాత్విక విషయాలలో తన శక్తి యుక్తులు పరిమితమని ఎంగెల్సు గ్రహించి మార్క్సు ఆధిపత్యాన్ని అంగీకరించాడు. అయితే ఎంగెల్సుకు సొంత భావాలు లేకపోలేదు. మార్క్సు మరుగున పడుతున్న అంత్యదశలో కాని ఎంగెల్సు బయట పడలేదు. ఇక మార్క్సు అనంతరం ఎంగెల్సుకు ఎదురు లేకపోయింది. తన భావాలే మార్కిజంగా, కమ్యూనిజంగా ఎంగెల్సు చలామణి చేశాడు. జీవిత కాలం ఇంచుమించు ఇరువురు తాదాత్మ్యం చెందినట్లు లోకానికి కనిపించిన కారణంగా, ఎంగెల్సు చెప్పేదంతా మార్క్సిజమేనని భ్రమ కలిగింది. ఈ భ్రమ చాలా కాలం కొనసాగింది. మార్క్సు రచనలు అనేకం బయటపడకపోవడంవలన, ఎంగెల్సు అధికార వ్యాఖ్యానాలవలన ఇలా జరిగింది.
నిజానికి ఎంగెల్సు చెప్పింది ఏంగెల్సిజం మాత్రమే. ఇట్లా విడమరచి చూడడం అవసరం. ఇది మార్క్సుకూ, ఎంగెల్సుకూ న్యాయం చేసినట్లవుతుంది కూడా.
మార్క్సు పరిధిలోకి రాక పూర్వం ఎంగెల్సును ప్రభావితం చేసిన వారు మోసెస్ హెన్, సెంట్ సైమన్, ఇంగ్లండులో ఛార్జిస్టు ఉద్యమం.
ఎంగెల్సు ప్రకృతిని కేంద్రంగా తన తత్వాన్ని పెంపొందించగా, మార్క్సు మానవుణ్ణి కీలక స్థానంలో ఉంచాడు. సాంకేతిక విజ్ఞానం సమాజాలలో మార్పులన్నిటికీ కారణమని, ఆ విజ్ఞానం అభివృద్ధి చెందుతుంటే, ఆస్తి సంబంధాలలో, వర్గ సంబంధాలలో సామాజిక మార్పులు వస్తాయని ఎంగెల్సు స్పష్టం చేశాడు. బ్రిటిష్ ఆర్ధిక శాస్త్రాల ప్రభావంగల ఎంగెల్సు, వైమనస్యతను ఆర్ధిక రంగానికీ అన్వయించలేదు. బ్రిటిష్ ఆర్థిక శాస్త్రాలను దుయ్యబట్టి, తిరస్కరించిన మార్క్సుకు మానవుడు, అతని వైమనస్యత చాలా ప్రాధాన్యత వహించాయి.
అదనపు విలువ, శక్తి అనే భావంతో మార్క్సు ఆర్ధిక సిద్ధాంతాలు ఉంటాయి. ఎంగెల్సులో ఇవి కనిపించవు. ఆస్థి అంటే శ్రమ స్థితి అని మార్క్సు ఉద్దేశం. భూమి, వస్తువులు ఇత్యాదులపై మానవుడు శ్రమించే దాన్నిబట్టి ఆస్థి ఉంటుంది. ఆ వస్తువులు మానవుడికి అందాబాటులో లేకుండా కొందరు భుక్తం చేసుకోవటమే మార్క్సు చెప్పే వ్యక్తిపరమైన ఆస్తికి దారితీసింది.
ఎంగెల్సు దృష్టిలో, ఆస్తి అంటే హక్కు భుక్తమై ఉండటం మాత్రమే. అట్లాగే వర్గమంటే సంపదను బట్టి, ఆస్తినిబట్టి విభజించబడిందే వర్గమంటాడు ఎంగెల్సు.
ఎంగెల్సు ఆర్ధిక రచనలన్నీ, పోటీ, మార్పిడి, కౌలు ఇత్యాదుల దృష్ట్యా అభివృద్ధిగావించిన భావనలతో ఉంటుంది. అందుకే విలువ, అదనపు విలువ, ఉత్పత్తి మొదలైన వాటిని మానవుడి చర్యలుగా ఎంగెల్సు చర్చించడు. మానవుడికి ప్రాధాన్యత లేని రచనలు ఎంగెల్సువి.
తత్వంలో ఎంగెల్సు మూడు భావనల్ని ప్రధానంగా చర్చిస్తాడు. గుణం రాశిగా మారే నియమం -- పదార్థం లేక చలనం జరిగే చేర్పు కూర్పుల ఫలితంగా రాశి గుణం మారుతుంటుంది. నిర్జీవ పదార్ధాన్ని విభజించుకుంటూ పోతే అణువు పరమాణువులు వస్తాయి. ఒక స్థాయి కంటే మరొక స్ధాయి గుణంలో తేడాలు చూపుతుంది. అంటే పదార్ధానికి కొంత చేర్చటం వలన లేదా కొంత తగ్గించడం వలన ఈ గుణంలో మార్పు వస్తుందని ఎంగెల్సు సాధారణంగా పేర్కొన్నాడు.
విరుద్దాల పరస్పర సమ్మిళిత నియమం మరొకటి.
ప్రకృతిలో పదార్ధం, చలనంపై ప్రతిదీ ఆధారపడి ఉన్నది. పదార్ధాలన్నీ నిత్యమూ స్థానాన్ని మార్చుతూ పరస్పరం చర్యలో నిమగ్నమై ఉంటున్నవి. వీటి మారు రూపాలే వేడి, విద్యుత్తు, అయస్కాంతం మొదలైనవి. పదార్థం చలనం శాశ్వతాలు, సృష్టి రహితాలు, నాశరహితాలు. యాంత్రిక మార్పులలో రాశి గుణంగా మారటంతో గతి తార్కిక రీతి ఉన్నది. వీటన్నిటి వెనుక ముఖ్యమైనది చలనం అంటాడు ఎంగెల్సు. అన్ని నియమాలకు మూలం వ్యతిరేకతకు వ్యతిరేక నియమం, సమాజపరంగా ఉన్న అస్థి వ్యక్తిపర ఆస్థిగా మారటంతో ఈ నియమాల్ని గమనించవచ్చునంటాడు ఎంగెల్సు. ప్రతిదీ పదార్ధానికీ, చలనానికీ తీసుకెళ్ళే ఎంగెల్సు, మానవుడ్ని, జీవితాన్ని, ఆలోచనను, ఉనికిని కూడా అట్లాగే వ్యాఖ్యానిస్తాడు. సమకాలీన విజ్ఞాన శాస్త్రాల ఆధారంగా ఎంగెల్సు తన తత్వాన్ని రాబట్టాడు. మానవుడి జీవితంలో భాగంగా ఆలోచన జనించింది. ఆలోచనకు రాకపూర్వం మెదడు ఉన్నది. మెదడు ఉంటే మానవుడి ఆలోచనకు అవకాశం లేదు. మెదడు కూడా చలనంలో భాగమే. ఇది కూడా శక్తి రూపమే. మనం చూపే బాహ్య ప్రపంచానికీ వాస్తవంగా బాహ్య ప్రపంచానికీ తేడా లేదనీ, యథాతధంగా చూస్తున్నామనీ ఎంగెల్సు చెప్పాడు.
ప్రకృతి గతితార్కికంగా ఉంది. మానవుడిలో అదే ప్రతిబింబిస్తున్నది. కనుక ఆలోచన అంతా తార్కిక బద్ధమే అంటాడు ఎంగెల్సు.
ఎంగెల్సు తత్వంలో మానవుడు నిమిత్తమాత్రుడు. అతనికి ఏమీ స్థానం లేదు. ప్రాధాన్యత లేదు. కేవలం ప్రకృతిలోని గతితార్కిక నియమాల్ని ప్రతిబింబించే జీవి మాత్రమే.
మార్క్సు తాత్విక భావాలు ఇందుకు పూర్తిగా భిన్నం. ఆచరణాత్మక మానవుడు మార్క్సుకు ముఖ్యం.
హెగెల్ తాత్వాన్ని మార్క్సు, ఎంగెల్సులు ఇంత విభిన్నంగా అర్ధం చేసుకుని, ఎవరి ధోరణిలో వారు వ్యాఖ్యానించుకుంటూ పోయారు.
ప్రకృతి సమాజం ఉన్నవి. వాటిలో మానవుడి అచరణ ఏమిటి అనేవి మార్క్సు ఆలోచనా సారాంశం.
ప్రకృతి చలనంతో కూడిన నిర్ధారణ. అందులో మానవుడి ఆలోచన సైతం నిర్ధారించబడిందే. కనుక మానవుడి సొంతం ఏమీ లేదనేది ఎంగెల్సు సారాంశం.
మార్క్సు, ఎంగెల్సు తాత్త్విక, శాస్త్రీయ, ఆర్థిక, చారిత్రక భావాలలో హస్తిమశకాంతరాలున్నాయి. వారి వ్యక్తిగత సాన్నిహిత్యం ఈ తేడాలను కప్పివేసింది. ఎంగెల్సు చెప్పేదే మార్క్సిజం అని భ్రమింపజేసింది.
లెనిన్ రచనలు చూస్తే మార్క్సు, ఎంగెల్సు రచనల ప్రభావం బాగా ఉన్నట్లు కనబడుతుంది. తేడాలు చూసే కాలవ్యవధి గాని, అవకాశం గాని ఆయనకు లేదు. స్టాలిన్ విషయం వ్యాఖ్యానించదలచలేదు.

Reference Books
1. LEVINE, NORMAN : The Tragic Deception
Marx Contra Engels Oxford 1975
2. Engels : 1. Anti-Duhring
2. The origin of the family, Private property and the State
3. The Role of force in History
4. The Principles of Communism
5. Dialectics of Nature
3. Marx : 1. Grundrisse
2. The German Ideology
3. The Holy Family
4. Das Capital
4. Bottomore (tr) : Karl Marx : Early Writings
5. Mc Lellan, David : Karl Marx
Macmillan 1973

Sunday, December 23, 2007

Is astrology scientific? -scietific method continued

ఏది విజ్ఞానం? ఏది కాదు?
తన పరిధిలో పరిశీలనకు వచ్చిన వాస్తవాలను సంతృప్తికరంగా వివరించకపోతే వైజ్ఞానిక సిద్ధాంతం ఏదీ కూడా అట్టేకాలం నిలబడదు. కాని విజ్ఞాన చరిత్ర నిండా ఉత్తరోత్తరా దోషాలని రుజువైన సిద్ధాంతాలు లేకపోలేదు. న్యూటన్ పేర్కొన్న వెలుగుకణ సిద్ధాంతం ఇందులో ఒకటి. ఇంత మాత్రానే విజ్ఞాన స్థాయికి భంగం వాటిల్లదు. మనో విశ్లేషణవంటి అన్వేషణారంగాలనేకం ఉన్నాయి. వాటిలో సర్వసాధారణంగా ఆమోదించే వైజ్ఞానిక సిద్ధాంతం ఇంకా రావలసి ఉంది. అంటే మనో విశ్లేషణ ఉబుసుపోక అనుకోరాదు. చాలా ఆసక్తికరమైన, ఉపయోకరమైనకృషి ఈ రంగంలో జరిగింది. అనేక సందర్భాలలో ఈ పద్ధతి ప్రయోగించే చికిత్సా విధానాలను చూస్తుంటే దీనిని తేలికగా కొట్టిపారేయడానికి వీల్లేదు. అయినప్పటికీ ఆ సిద్ధాంతంగా పేర్కొన్న దానిలో అద్భుతమైన అంతర్ దృష్టి కనిపిస్తున్నదేగాని, కీలకమైన పరీక్షకు గురికాలేదు. విజ్ఞాన సిద్ధాంతంగా ఆవిర్భవించడానికి మనో విశ్లేషణ అన్వయించే పద్ధతులు, ఉద్దేశాలు ఉన్నాయికూడా. దీనికి వ్యతిరేకంగా వ్యవస్థాపితమైఉన్న సిద్ధాంతం ఏదీ లేదు. అందు వల్లనే, మనో విశ్లేషణ రానురాను విజ్ఞాన సిద్ధాంతంగా పెంపొందవచ్చు. ఆ లక్ష్యం చేరుకోడానికి ఎంతో దూరం పయనించవలసి రావచ్చు.
మరో విధమైన సిద్ధాంతాలు కూడా ఇక్కడ చర్చించబోతున్నాం. వాటిలో పరిమితంగా ప్రాపంచికానుభవ సత్యం కొంతమేరకు ఉన్న సందర్భాలు లేకపోలేదు. అయినా అవి విజ్ఞానపరంగా లేవు. ఈ సిద్ధాంతాలు ప్రతిపాదించే వాటిననుసరించి, అందులో ఇమిడి ఉన్నవాటిని పరోక్షంగానైనా రుజువుపరచవీల్లేదు. అదే రంగంలో విజయవంతంగా పనిచేస్తున్న వైజ్ఞానిక సిద్ధాంతాలలో పెసగకుండా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. పైగా అటువంటి విజ్ఞాన-విజ్ఞానేతర సిద్ధాంతాలను (ఒకే రంగంలో) కొన్నింటిని చూద్దాం.

ఖగోళం-జ్యోతిష్యం
ఈ రెండూ మానవుడు చిరకాలంగా పరిశీలిస్తున్న ఆకాశానికి చెందినవే. ఆకాశంలో ఒకే తీరుగా చలిస్తున్నవాటిని, అందుకు సంబంధించిన భౌతిక సంఘటనలను మానవుడు పరిశీలిస్తున్నాడు. ఆధునిక విజ్ఞానం ఆవిర్భవించేటంత వరకూ జ్యోతిష్యం-ఖగోళ శాస్త్రం భిన్నమైనవని భావించనేలేదు. మానవ వ్యవహారాలకు ఖగోళ విషయాలను అన్వయిస్తే జ్యోతిష్యం అవుతుంది. మానవుడి వ్యవహారాలకు ఖగోళ విషయాలను అన్వయిస్తే జ్యోతిష్యం అవుతుంది. ప్రతి నక్షత్రం, ప్రతి గ్రహానికి కూడా ఒక దేవత ఉంటుందనీ, ఆ దేవత మానవుడి వ్యవహారాలలో ఆసక్తి చూపడమేగాక, ప్రభావితం చేస్తుందని భావించారు. గ్రహాల చలన నియమాలను కనుక్కొన్న కెప్లర్ సైతం జ్యోతిష్యంలో నమ్మకం గలవాడే. అతడి సమకాలీనులకు ఈ ధోరణిలో దోషం కనిపించలేదు. ఆకాశంలోని ఈ నక్షత్రాలు, గ్రహాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకున్న తరవాత, సామాజిక సంస్థలు పనిచేసే తీరు, మానవుడి శారీరక మానసిక రీతుల గురించి తగినంతగా తెలిసిన అనంతరం, గడ్డినుంచి గింజలు వేరు చేయడానికి వీలుచిక్కింది. ఖగోళశాస్త్రం విజ్ఞాన సిద్ధాంతంగా పెంపొందింది. మానవుడిపై గ్రహాల, నక్షత్రాల ప్రభావం ఉంటుందనే జ్యోతిష్యం విజ్ఞానపరంగా అపఖ్యాతి పాలైంది. ఇది అవగాహన చేసుకోవడం సులభమే. ప్రతిపాదన చేసిరాబట్టే నిర్మాణం ఖగోళంలో ఉంది. అనేక పరిశీలనాంశాలకు స్పష్టమైన వివరణలను ఖగోళ శాస్త్రం ఇస్తోంది. పరీక్షకు తట్టుకొనే ప్రమాణానికి నిలబడకలుగుతోంది. ఇందుకు భిన్నంగా, జ్యోతిష్యంలోని మూల సూత్రం దోషపూరితమైంది. నక్షత్రాలకు, గ్రహాలకు అంటి పెట్టుకొని దేవతలు అనేవారెవరూ లేరు. ఆకాశంలోగాని భూమిపైన గాని ఎక్కడా అలాంటి వారు లేరు కనక వారు మానవుడి వ్యవహారంలో ఆసక్తి చూపే ప్రశ్నేరాదు. జ్యోతిష్యం అశాస్త్రీయం. మనకు గల ప్రత్యక్షజ్ఞానానికి, వ్యవస్థాపిత సిద్ధాంతాలకు పొసగకుండా జ్యోతిషం ఉంది. జ్యోతిష్యం అశాస్త్రీయమే కాదు. విజ్ఞాన వ్యతిరేకం కూడా, జ్యోతిష్యంలో లాగే, యోగసిద్ధాంతం వంటి వాటిల్లోనూ ఇలాంటి విజ్ఞాన వ్యతిరేక ధోరణి ఉంది. విజ్ఞానం రుజువు పరచిన నియమాలను పాటించకుండా, గతం, వర్తమానం, భవిష్యత్తుకు సంబంధించి జ్ఞానాన్ని మానవుడు యోగం ద్వారా సిద్ధింపజేసుకోవచ్చుననటం వాస్తవ వ్యతిరేకమే.

Next-Is ayurveda scientific?

Friday, December 21, 2007

Scientific method- turning points

విజ్ఞానంలో రాశి విధానాలు
అంచనావేసే శక్తి ఉంటేగాని పరీక్షకు నిలబడటం సాధ్యం కాదు. అంచనా అనేది తుదిఘట్టం. కీలకమైన పరీక్షలో విఫలమైతే ప్రతిపాదనతో పొందికగా ఉన్న ఇతర విషయాలను చూసి సరిపెట్టుకోడానికి వీల్లేదు. పరీక్షకు అర్థాన్ని గమనిస్తే ఇటువంటి సందర్భాలలో రాశివిధానాలు (Quantitative Methods) చాలా ఫలవంతంగా ఉన్నట్లు గమనించవచ్చు. అయితే పరీక్ష నిమిత్తం, వైజ్ఞానిక స్థాయి కోసం, రాశి విధానాలనేవి తార్కిక విశ్లేషణకు, నిగమన పద్ధతులకు పనికి వచ్చే మేరకే స్వీకరిస్తాయి. ఉదాహరణకు, మేఘాలు ఏర్పడే విషయమై ప్రతిపాదనలు, అలోపతి వైద్యం ప్రకారం రోగకారణాలు, నయం చేసే రీతులలో రాశివిధానాల ప్రయోజనం అట్టేలేదు. అయినప్పటికీ వైజ్ఞానిక ప్రమాణాన్ని, పరీక్షకు నిలబడటాన్ని సంతృప్తి పరచడం వల్ల అవి కూడా వైజ్ఞానికాలే.
అంచనా వేయడంలో నిర్ధిష్టంగా ఉండడానికి, ప్రతిపాదనలో ఇమిడి ఉన్న విషయాలను ఇంకా సునిశితంగా పరిశీలించడానికి రాశిపద్ధతులు ఉపయోగపడే మాట నిజమే. కాని ఒకానొక సిద్ధాంతం విజ్ఞానయుతంగావడానికి దాని తార్కిక నిర్మాణం, దానికే ప్రపంచానుభవంతో కూడిన వాస్తవాలకూ గల సంబంధం ముఖ్యం. ఇదంతా గణితపద్ధతులలో ఉన్నా లేకున్నా ఫరవాలేదు. అంతవరకూ వస్తున్న నమూనారీతులన్నీ ఇదే విధంగా ఉన్నాయి. ఒక ప్రతిపాదన చేయడం అందులో ఇమిడి ఉన్న విషయాలను నిగమన తర్కంలో ఉన్నాయోలేదో చూడడం, తరవాత పరిశీలిస్తూ పరీక్షకు గురికావించడం జరగాలి. దీనిలో ఇమిడి ఉన్నవన్నీ సరిపోతే, సిద్ధాంతానికి (తార్కికంగా) అందరూ ఆమోదిస్తారు.
(ఇది కచ్చితంగా సరైందనలేం. కొన్ని సందర్భాలలో అంచనాలు విఫలమైనప్పటికీ, వ్యవస్థాపిత సిద్ధాంతాన్ని అట్టిపెడతారు. కలవరపెడుతున్న విషయాన్ని భవిష్యత్తు కనుక్కోవచ్చుననే ఆశతో ఇలా చేస్తారు. యురేనస్ గ్రహం విషయంలో ఇంతే జరిగింది. సిద్ధాంతం ఏ మేరకు సఫలమైందనే దాన్ని బట్టి, అంచనా విఫలమై సిద్ధాంతం కూడా విఫలమైనట్లు పరిగణించే పరిస్థితి వస్తుంది).
వైజ్ఞానిక నిర్మాణ నమూనాను ప్రతిపాదన-నిగమన నమూనా అంటారు. విషయం ఏదైనా అన్ని విజ్ఞాన సిద్ధాంతాలకు ఈ నమూనా సర్వసాధారణంగా ఉంటుంది. ఆర్థిక, నైతిక, రాజకీయ విషయాలలో ఈ పద్ధతి అంతగా అన్వయించలేకపోడానికి సాంఘిక శాస్త్రాలలో మార్పులే కారణం. మానవేచ్చ పనిచేయడంతో నిర్దిష్టంగా అంచనావేయడం సాధ్యపడటం లేదు. పరిమితంగా తప్ప, గణిత విధానాలు అన్వయించడం కూడా కుదరడం లేదు. మానవ ప్రవర్తన అధ్యయనానికి సైతం అన్వయించగల స్థాయికి గణితం ఇప్పుడే చేరుకుంటున్నది. సాంఘిక శాస్త్రాలలో అగ్రగణ్యం ఉన్న ఆర్థిక శాస్త్రం వంటివాటికి వైజ్ఞానిక పద్ధతులు అన్వయిద్దామనుకున్నప్పటి ఆగమన పద్ధతి ప్రాధాన్యం ఒక శతాబ్దం నుంచే గుర్తించడం జరిగింది. సామాజిక రాజకీయ శాస్త్రాలలో ఈ పద్ధతి ఇప్పుడిప్పుడే వస్తున్నది. నైతికశాస్త్రంలో ఇది మొదలు కాలేదు. కనక సాంఘిక శాస్త్రాలు ప్రతిపాదన-నిగమన నమూనాను చెప్పుకోదగినంతగా అన్వయించలేదు. సాంఘిక శాస్త్రాలలో ఆగమన ప్రాతిపదికలు సరిగా ఉన్నచోట, సిద్ధాంత ప్రతిపాదనలు, వైజ్ఞానిక సిద్ధాంతంగా ఉంటాయి. అంటే రూపొందించిన సిద్ధాంతాలు నిజమా, అబద్దమా అంటే, పరీక్షా ప్రమాణాన్ని బట్టి ఉంటుంది. అయితే సిద్ధాంత నిర్మాణం మాత్రం దెబ్బతినదు.
విజ్ఞాన సత్యం సంభావ్యమే
విజ్ఞాన సిద్ధాంతాన్ని గురించి ఇంతవరకు జరిపిన చర్చవల్ల లోగడ చెప్పని విజ్ఞానసత్యం ఒకటి తెలుస్తోంది. విజ్ఞానం నిర్మాణంలో వివేచనాత్మకమనీ, విషయంలో ప్రపంచానుభవం గలదనీ, మతరహిత స్వభావంతో కూడినదనీ పరిశీలించాం. విషయపరంగా ప్రపంచానుభవంతో కూడినదంటే, ఇందలి సత్యం సంభావ్యమనీ, కచ్చితంకాదనీ అర్థం, కేవల వివేచనా లేదా, అంతర్భుద్ధి వల్ల వెల్లడించే సత్యాల వంటిది కాదన్నమాట. మార్మికవాదిగాని కేవలం వివేచనాత్మకుడుగాని పెర్కొనే సత్యంకంటే, విజ్ఞానపరమైన సత్యం తక్కువ అని అనుకోరాదు. ఈ రెండు సందర్భాలలోనూ సత్యం అనే పదాన్ని వివరణ లేకుండా వాడితే తప్పుదారిన పట్టించినట్లవుతుంది. మార్మికుని సత్యం ప్రకారం ప్రపంచానుభవంతో సరిపోయినా, లేకున్నా ఫరవాలేదు. కేవల హేతువాది చెప్పే సత్యం ప్రాయికంగా ఒకప్రతిపాదన స్వభావం గలది మాత్రమే. కనక ఇందులో నిర్ధారణ భిన్న రంగానికి చెందినది.
సత్యం అనే పదాన్ని రెండు భిన్నమైన అర్ధాలలో వాడుతున్నారు. ఒకానొక ప్రకటన సత్యమైనదంటే, అర్థం ఏదైనా కావచ్చు.
1. లోగడ పేర్కొన్న ప్రతిపాదన తాత్కాలికంగా సత్యమైనదిగా భావిస్తుంటే అందులోంచి సత్యాన్ని సరిగ్గా రాబట్టడం జరగవచ్చు.
2. ప్రపంచరీతిని సరిగా చిత్రించవచ్చు.
మొదటి ప్రకటన తార్కికంగా సత్యమైంది. కనక తార్కికంగా సరైందనవచ్చు. సత్యం అంటే ఇక్కడ తార్కికంగా సరిపడినదన్న మాట. రెండోది ప్రాపంచికాను భవం దృష్ట్యా వాస్తవం. ఒకో పర్యాయం ఒక ప్రకటన తార్కికంగా సరైంది కావచ్చు. ప్రాపంచికానుభవంలోనూ సరైందికావచ్చు. లేదా రెండింటిలో ఏదో ఒకదానికే చెందవచ్చు. ఈ విషయం సాధ్యమవడానికి ఉదాహరణలు చూద్దాం.
ఎ బి
1. మనిషి నాలుగు కాళ్ళతో ఉంటాడు. 1. కనక నాకు నాలుగు కాళ్ళున్నాయి.
2. నీరు రాయికంటే భారమైంది. 2. కనక రాయి నీటిలో మునగుతుంది.
3. రోమ్ కు ఉత్తరదిశగా లండన్ ఉంది. 3. కనక రోమ్ కంటే లండన్ చల్లగా
ఉంటుంది.
4. నీరు గాలికంటే తేలిక. 4. కనక రాయి నీటిలో తేలుతుంది.
పై ప్రకటనలన్నింటిల్లోనూ, మొదటి భాగం ప్రతిపాదనకాగా, రెండో భాగం దాని నుంచి వచ్చిన నిర్ణయం. ఈ నిర్ణయాలను పరిశీలిద్దాం.
1 బి) తార్కికంగా సరైందే, ప్రపంచ అనుభవంలో తప్పు.
2 బి) తార్కికంగా చెల్లదు. ప్రపంచంలో వాస్తవమే.
3 బి) తార్కికంగా సరైంది. ప్రపంచంలోనూ వాస్తవమే.
4 బి) తార్కికంగా చెల్లదు. అనుభవంలో దోషపూరితం.
ఈ ఉదాహరణ వల్ల, తార్కికంగా సరిగా ఉండడం, ప్రపంచ సత్యం అనేవి స్వతంత్ర ప్రతిపాదనలని గ్రహించవచ్చు.
పూర్వాపర సంబంధాలను బట్టి తర్కం నిర్ధారణ అవుతుంది. ప్రపంచాను భవం అనేది వాస్తవాన్ని బట్టి ఉంటుంది. తర్కంలో ఒక ప్రకటన చెల్లడమో, చెల్లకపోవడమో తప్ప, మధ్యే మార్గంలేదు. తార్కికంగా సరైన ప్రతిపాదనలోని సత్యం ఎంత నిర్ధారితమైనదో, తార్కికంగా చెల్లని ప్రతిపాదనకూడా అంతే నిర్ధారణతో కూడింది. ప్రపంచానుభవంతో కూడిన సత్యంలో వాస్తవాలు రెండు విషయాలపై ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు వర్షం కురుస్తున్నది అనే ప్రతిపాదనలో వాస్తవమో, అసత్యమోతప్ప, సందేహానికి చోటు లేదు. కాని, హంసలు తెల్లనివి అంటూ ఒక సర్వ సాధారణ ప్రతిపాదన చేసినప్పుడు, ఇందలి సత్యం కచ్చితమని చెప్పజాలం. అన్ని హంసలనూ పరిశీలించే వీలులేదు. గనక ఇలా చెప్పజాలం. భవిష్యత్తులో రానున్న హంసల విషయం పరిశీలించడం అసలే సాధ్యపడదు. కనక అటువంటి ప్రతిపాదన కొన్నిటికే పరిమితం. ఆ మేరకు ఈ ప్రతిపాదనలోని సత్యం నిర్ధారితం కాదు. ఇదంతా కేవలం కోడి గుడ్డుపై వెంట్రుకలు లెక్కించడం వంటిదేమీ కాదు. ఇటీవలే ఆస్ట్రేలియాలో ఒక నల్లని హంసను చూశారు కూడా.
సర్వ సాధారణమైన ఇలాంటి ప్రతిపాదనల మాట అలా ఉంచి, విజ్ఞాన సిద్ధాంతంలో ఒకే ఒక ప్రతిపాదన సైతం సంభావ్యంగానే భావించాలి. అలాంటి ప్రతిపాదనలు సైతం సాధారణ సత్యాలుగా భావించే వాటి నుంచి రాబట్టినవేగదా. ప్రతిపాదనలలో భావనలు, సంబంధాలుకూడా ఇమిడి ఉంటే, పరిశీలించదగిన ప్రాపంచిక విషయాలు ఉంటే, పరిమిత సంఖ్యకు మాత్రమే ఇది వర్తిస్తుంది. వాటికి సంబంధించిన సత్యం అసంపూర్తి సాక్ష్యాధారాలపైనే ఉంటుంది. అటువంటి వాటి నుంచి రాబట్టిన ఏ ప్రతిపాదన అయినా నిర్ధారితంగా ఉండదు. నిగమనం అంటే సర్వసాధారణత్వం నుంచి ఒకానొక ప్రతిపాదనకు దారితీసే పద్దతే గదా.
మేదస్సు అవగాహనతో కూడిన భావనలపై ఆధారపడి ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ఈ పరిస్థితిలో మెరుగు ఉండదు. ఇమిడి ఉన్న వాటన్నిటినీ పూర్తిగా పరిశీలించినప్పటికీ అది ప్రాపంచికానుభవం సత్యంగా గాక, ప్రతిపాదనల సంభావ్యతనే సూచిస్తుంది. కొన్ని ప్రతిపాదనలు ఒక గణిత సిద్ధాంతాన్ని నిర్ధారించ వచ్చు. అయితే సిద్ధాంతం మాత్రం ప్రతిపాదనలను రుజువు చేయలేక పోవచ్చు. భిన్న ప్రతిపాదనల నుంచి తార్కికంగా సిద్ధాంతాలను నిర్దిష్టంగా రాబట్టవచ్చు. ప్రతి పాదనలలోని సత్యాన్ని సిద్ధాంతాలలో ఇమిడి ఉన్న వాటికి అన్వయించవచ్చు. ఇమిడి ఉన్నవాటి సత్యం ఆధారంగా ప్రతిపాదనలు నిర్ధారితాలని చెప్పజాలం. దీనిని బట్టి తేలేదేమంటే మేధస్సు భావనల ఆధారంగా ఏర్పడిన వైజ్ఞానిక సిద్ధాంతం, అందుకు సంబంధించిన ప్రాపంచికానుభవ సత్యం కూడా సంభావ్యంగానే నిలుస్తాయి. నైరూప్యతకూ వీటికీ తేడా ఉంది. మేథోభావనలకు సరిపడే ప్రాపంచిక పరిశీలక విషయాలు లేవు. ఇక్కడే చిక్కులో ప్రవేశిస్తున్నాం. విజ్ఞానం అభివృద్ధిచెందే కోద్దీ తార్కికంగా కచ్చితమయిన సిద్ధాంతంలో సత్యం తగ్గిపోతున్నదన్నమాట. కేవలం వివేచనాత్మక పద్దతిలో ఇటువంటి చిక్కులేదు. అటువంటి పద్ధతిలో ఆద్యంతాలు తర్కం పైన ఆధారపడడాన్ని చూడొచ్చు.
ఈ స్థితిలో వైజ్ఞానిక సత్యాన్ని గురించి పరిశీలించదగిన అంశం మరొకటి ఉంది. ఒక సిద్ధాంతం స్థానంలో మరొకటి చోటు చేసుకున్నప్పుడు, తొలుత ఉన్న సిద్ధాంతాన్ని ఉత్తరోత్తరా వచ్చిన సిద్ధాంతం స్వీకరించినట్లే. ఐన్ స్టీన్ సిద్ధాంతం సంప్రదాయ పదార్థ విజ్ఞానాన్ని స్వీకరించింది. అయితే సంప్రదాయ పదార్థ విజ్ఞానం పేర్కొన్న ప్రపంచ దృక్పథం దోషపూరితమని, ఆధునిక పదార్థ విజ్ఞానం చూపింది. అయితే వీటిలో ఏది సరైంది. అని ప్రశ్నించడం సబబే, ఉజ్జాయింపుగా వాస్తవం అనడానికీ, దోషపూరితం అనడానికీ చాలా తేడా ఉంది. కానీ రెండూ విభిన్న విషయాలకు సంబంధించినవని తెలిస్తే చిక్కువిడిపోతుంది. న్యూటన్ సిద్ధాంతం ఐన్ స్టిన్ సిద్ధాంతానికి సన్నిహితమైనదంటే సంప్రదాయ పదార్థ విజ్ఞానం నుంచి రాబట్టిన గణితాన్నే దృష్టిలో పెట్టుకున్నారు. గ్రహచలనానికి చెందిన కెప్లర్ నియమాలు ఒక ఉదాహరణగా చూపవచ్చు. సాపేక్షతా, సిద్ధాంతంలోని గణితసూత్రాలలో కెప్లర్ నియమాలు ఉన్నాయి. పరిశీలించే వస్తువుకు సంబంధించి, పరిశీలకుడి గమనవేగాన్ని గ్రహించకపోవడంలోనే ఈ సన్నిహితత్వం ఉంది. ఏ సిద్ధాంతమైనా కొంత కాలం నిలబడాలంటే, దాని అంచనాలు సరిగా ఉండాలి. చాలా సందర్భాలలో ఇలానే జరుగుతుంది.
ఒకానొక గణిత సిద్ధాంతాన్ని రాబట్టడానికి అనేక ప్రతిపాదనలు ఉపకరించ వచ్చు. పూర్వ ప్రతిపాదన వల్లనే ఉత్తరోత్తరావచ్చే ఫలితం ఉండకపోవచ్చు. ఒక సిద్ధాంతం మరొక సాధారణ సిద్ధాంతంలో కలిసినప్పుడే అది పెంపొందే అవకాశం లభించవచ్చు. లోగడ సిద్ధాంతంతో పోల్చి చూస్తే, సాధారణ సిద్ధాంత ప్రతిపాదనలు భిన్నమైనవికావచ్చు. తొలి సిద్ధాంతానికి చెందిన గణిత అంచనాలు కొత్త ప్రతిపాదనలో వాస్తవాలుగా కొనసాగవచ్చు. అప్పుడు తొలుతఉన్న ప్రపంచ దృక్పథం తనవిలువను కోల్పోతుంది. కొత్త సిద్ధాంతం సమర్పించే దృక్పథంలో పాత అంతా కలిసిపోతుంది. సంప్రదాయస్థితి నుంచి ఆధునిక స్థాయికి పెంపొందిన పదార్థ విధానంలో ఇదే జరిగింది. అందుకే నేటికీ న్యూటన్ పదార్థ విజ్ఞానాన్ని రోడ్లు, వంతెనల నిర్మాణంలో, విద్యుత్తును ఉత్పత్తి చేసి, పంపిణీ చేయడంలో, మోటార్లు తయారు చేయడంలో ఇంకా అనేక విషయాలలో వాడుతున్నాం. వాటిని ఆధునిక విజ్ఞానానికి సమీపంలో ఉన్న సూత్రాలుగా భావించడమే. ఇందుకు దోహదం చేసింది. ఇవన్నీ ప్రాపంచికరీతులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇందులో దోషాలు ఏమంత పట్టించుకోదగినవి కావు. అయితే న్యూటన్ పదార్థ విధానం భౌతిక విశ్వాసానికి సంబంధించిన మౌలిక విషయాలగురించి సరిగ్గా చెప్పిందని మాత్రం ఒప్పుకోవడం లేదు. విశ్వంలో ప్రతి సంఘటనకూడా మరో సంఘటనతో కార్యకారణ సంబంధంతో ఉందని ఇప్పుడు ఒప్పుకోలేం. దూరాన్ని కొలవాలంటే కాలవ్యవధితో నిమిత్తం లేదనేది కూడా ఇప్పుడు అంగీకరించం. ఈ విధంగా న్యూటన్ రోజులలోని పదార్థ విధానం కాస్తా ఆధునిక పదార్థవిధానంలో ఐక్యమైపోయింది. ఆ విధంగా సజీవంగా ఉందనవచ్చు. న్యూటన్ పదార్థ విధానపు ప్రపంచ దృక్పథం మాత్రం మౌలికంగా దోషపూరితమైంది గనక తోసిపుచ్చడం.

Wednesday, December 19, 2007

కారల్ మార్క్సుకు కమ్యూనిస్టులు పట్టించిన గ్రహణం -6

మార్క్సు జీవితంలో కమ్యూనిస్టులు దాచిన కొన్ని ఘట్టాలు

మార్క్సు మానవ మాత్రుడు కనుక కోపతాపాలు ఇత్యాదులన్నీ సహజం. అందులోనూ జీవితమంతా కష్టాలు, అపనిందలు, ప్రవాసాలు ఇత్యాదులన్నీ ఎదుర్కోవవలసి వచ్చింది. జీవితంలో ఎన్ని ఒడుదుడుకులున్నా నమ్మిన సిద్ధాంతాలకు నిలబడిన వ్యక్తి మార్క్సు. ఆధునిక పరిశోధనలు విశ్లేషణలననుసరించి ఏ వ్యక్తి గురించి అయినా పూర్తిగా అర్థం చేసుకోవడానికి చిన్నతనం నుంచి జరిగిన విషయాలన్నీ సాకల్యంగా తెలుసుకోవాలని మనో విజ్ఞాన శాస్త్రం చెబుతున్నది. ప్రపంచ ప్రముఖులను గురించి ఈ విధమైన అధ్యయనాలెన్నో ఇటీవల వెలువడినాయి.
మార్క్సు సమగ్ర జీవిత చరిత్ర 1973లో తొలిసారిగా ప్రకటించిన ప్రోగ్రస్ పబ్లిషర్స్, మాస్కోవారు ఇంకా అనేక విషయాలను దాచి పెట్టడానికి ప్రయత్నించడం అవివేకమే అనిపించుకుంటుంది. ఐరోపాలో జరిగిన పరిశోధనల ఫలితంగా 1973లోనే డేవిడ్ మెక్లన్ వ్రాసిన మార్క్సు సమగ్ర జీవిత చరిత్రను మాక్మిలను వారు ప్రచురించారు. ఇవి కాక మార్క్సు జీవిత విశేషాలు తెలిపే అనేక రచనలు వెలువడ్డాయి. వీటిలో అప్రియమైనవి ఉన్నవి. అంతమాత్రాన మార్క్సుకు ఆయన సిద్ధాంతాలకు పోయేదేమీ లేదు. కాని వ్యక్తిని సరిగా అర్ధం చేసుకోవడానికి ఇవి ఉపకరించవచ్చు.
లండన్ లో ఉండగా మూర్ కు (మార్క్సును ఇంట్లో ఆప్యాయంగా పిలిచే పేరది.) భార్య పక్షంగా ఇద్దరు సహాయకురాళ్ళు వచ్చారు. ఒకామె హెలెన్ దెముత్, తరువాత ఆమె చెల్లెలు వచ్చింది. కాని అచిరకాలంలోనే చనిపోయింది. మార్క్సు ఇంట్లో హెలెన్ కీలక పాత్ర వహిస్తూ ఇంటి బాగోగులు చూస్తూ క్లిష్ట సమయాలలో చాకచక్యంతో ఆదుకుంటూ అప్పుల వారి బారి నుండి మార్క్సును కాపాడుతుండేది. ఆమె మాటంటే మార్క్సుకు సైతం సుగ్రీవాజ్ఞగా ఉండేది. పెద్ద అందగత్తె కాకున్నా 27 ఏళ్ళ ప్రాయంలో యవ్వనంతో తొణికిసలాడుతుండేది. ఆమెకు పెళ్ళి కాలేదు.
1851 జూన్ లో ఒకనాడు హెలెన్ డెముత్ పుత్రుని కన్నది. లండన్ లో 28 డీన్ స్ట్రీట్ లో మార్క్సు ఇంట్లోనే ప్రసవించింది. అతని పేరు ఫ్రెడరిక్. అసలే కష్టాలలో ఉన్న మార్క్సు కుటుంబానికి ఇది పెద్ద ఆశనిపాతమైంది. ముఖ్యంగా మార్క్సు భార్య జెన్నీ తల్లడిల్లిపోయింది.
ఫ్రెడరిక్ తండ్రి ఎవరు. ఎవరో అయితే జెన్నీకి అంత బాధ ఉండేది కాదు. సాక్షాత్తు మార్క్సు అని తెలిసినందువలననే ఈ గొడవ వచ్చింది. మార్క్సు పై రాళ్ళు రువ్వడానికి జర్మన్ ప్రవాసులలో చాలామంది ప్రత్యర్ధులు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయం తెలిస్తే వారందరూ పరువు తీస్తారు.
ఫ్రెడరిక్ పుట్టిన ఐదు వారాలకు లండన్ లో పేరు రిజిష్టర్ చేశారు. తండ్రి పేరు దగ్గర ఏమీ రాయకుండా వదిలేశారు. పిల్లవాడిని లూయీ అనే ఆమెకు పెంపకానికి ఇచ్చారు. హెలెన్ మాత్రం మార్క్సుతోనే ఉన్నది. ఈ విషయాన్ని రహస్యంగా అట్టి పెట్టడానికి మార్క్సు కుటుంబం చాలా ప్రయత్నించింది. ఫ్రెడరిక్ పుట్టిన తరువాత ముందు రెండు వారాలపాటు మార్క్సు - ఎంగెల్స్ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ జాగ్రత్తగా తొలగించారు.
తండ్రి ఎవరని చెప్పవలసి వస్తే చివరకు ఎంగెల్స్ తానే అని భారం వహించాడు. ఫ్రెడరిక్ ను ఎవరైనా సరిగా చూడకపోతే రహస్యంగా చెప్పమని కార్ల్ కాట్ స్కీ తొలి భార్య లూయీ ఫెబర్గర్ కు చెప్పాడు.
మార్క్సు బతికుండగా ఫ్రెడరిక్ తన ఇంటికి రావడం ఇష్టపడ లేదు. అందువల్ల అతను దొడ్డి త్రోవన రహస్యంగా తల్లిని చూసిపోతుండేవాడు.
ఫ్రెడరిక్ పుట్టినప్పుడు జెన్నీ మానసికంగా క్షోభపడడానికి మార్క్సు ఆ తరువాత పైడిమేయర్ కు రాసిన లేఖలో ప్రస్తావించాడు. జెన్నీ కూడా తన స్వీయ గాథలలో స్థాలీ పులాక న్యాయంగా ఈ విషయాన్ని ప్రస్తావించక పోలేదు.
విల్లిక్ - మార్క్సు విబేధాలు
కమ్యూనిస్టులీగ్ చీలడానికి విల్లిక్ - మార్క్సు అభిప్రాయభేదాలు సిద్ధాంత రాద్ధాంతాలే కాక వ్యక్తిగత విషయాలు కూడా దోహదం చేశాయి.
ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన విల్లిక్ 12వ ఏట నుంచి సైనిక శిక్షణ పొందాడు. ప్రష్యన్ ప్రభుత్వ సేననుంచి వైదొలగి ఎంగెల్స్ తోపాటు 1849లో బేడెన్స్ తిరుగుబాటులో పోరాడాడు. పెళ్ళి చేసుకోలేదు.
లండనులో ప్రవాసుల మధ్య నివసిస్తూ వారి కష్ట సుఖాలు తీరుస్తూ వారి మన్ననలకు పాత్రుడయ్యాడు. మంచి దుస్తులు వేసుకుని తెల్లవారకముందే మార్క్సు ఇంటికి వస్తుండేవాడు. అతని దృష్టి అంతా మార్క్సు భార్య జెన్నీ పైన ఉండేది. ఈ విషయం కూడా జెన్నీ గ్రహించి మార్క్సుకు తెలియజేసింది. సహజంగానే మార్క్సు అతడిని ద్వేషించేవాడు. అతడి రాక సహించేవాడు కాదు. ఈ వ్యక్తిగత ద్వేషాలు కమ్యూనిస్టు లీగ్ లో ప్రవేశించాయి. ప్రపంచమంతా ఒకటి తానొక్కడినే ఒక పార్టీ అనుకుంటాడని విల్లిక్ మార్క్సుపై విసురు విసిరాడు. మొత్తం మీద వీరిరువురి కక్షలు 1850లో కమ్యూనిస్టు లీగ్ ను చీలదీశాయి.
ఆ తరువాత 1863లో విల్లిక్ అమెరికా వెళ్ళి మార్క్సు పుస్తకాలకు అనుకూలంగా సమీక్షలు రాశాడు. మార్క్సు కూడా విల్లిక్ పై తన పాత భావాలు మార్చుకున్నాడు. సిద్ధాంతాల వెనుక వ్యక్తిగత విషయాలుంటాయి.
మార్క్సు - ఎంగెల్సు
1842లో మార్క్సు - ఎంగెల్సు తొలిసారిగా రైన్ లాండ్సలో కలుసుకున్నప్పుడు ముభావంగా ఉదాసీనంగా ఉన్నాడు. ఫ్రెయిన్ స్నేహితుడుగా ఎంగెల్సు భావించిన మార్క్సుకు రాగ ద్వేషాలు ఎక్కువ. అయితే మార్క్సు పత్రిక రైనిషె సైటుంగుకు ఎంగెల్సు వ్యాసాలు వ్రాశాడు.
అందులో ‘Outlines of Critique of Political Economy’ అనే వ్యాసంతో ఎంగెల్స్ పై తన అభిప్రాయాన్ని మార్చకుని ఉత్తరప్రత్యుత్తరాలు ఆరంభించాడు మార్క్సు. మార్క్సు దృష్టిని ఆర్ధిక విషయాలపైకి మళ్ళించింది ఎంగెల్సే. అంతకు ముందు తాత్విక రాజకీయ విషయాలే మార్క్సు దృష్టిలో ఉండేవి.
1814 ఆగస్టులో మార్క్సు, ఎంగెల్సు కలిసి చర్చలు జరిపి ఇరువురి భావాలు సన్నిహితం అని గ్రహించి ఆప్త మిత్రులై జీవితాంతం ఒకరికొకరు అండగా నిలిచారు. బ్రస్సెల్స ప్రవాస జీవితంలో జెన్నీ కూడా ఎంగెల్సును చూసింది.
మార్క్సు కుటుంబ జీవితానికి అంకితమయ్యాడు. ఎంగెల్సు పెళ్లి చేసుకోలేదు. స్త్రీల సాంగత్యం అంటే ఇష్టపడేవాడు. మేరీ బర్న్సతో కలిసి ఉండేవాడు. ఇంచుమించు ఆమె భార్యగా ఉన్నది కానీ ఆమెతో పరిచయానికీ, సన్నిహితత్వానికీ మార్క్సు భార్య జెన్నీ విముఖత చూపింది.
స్విట్జర్లాండ్ లో ప్రవాస జీవితం గడుపుతున్న ఎంగెల్సుకు మార్క్సు ఒకసారి డబ్బు పంపించాడు. ఆ తరువాత జీవితమంతా ఎంగెల్సు చాలా డబ్బు పంపి మార్క్సును ఆదుకుంటూ వచ్చాడు. అప్పుల వాళ్ళ బాధపడలేక తలదాచు కోవడానికి మాంఛెస్టర్ వెళ్ళి ఎంగెల్సు శరణు పొందడం మార్క్సుకు పరిపాటి అయింది.
అమెరికాలో ట్రిబ్యూన్ కు సైకోసీడియాకు పత్రికా ప్రతినిధిగా మార్క్సు వ్యాసాలు రాయడానికి ఒప్పుకున్నప్పుడు కూడా ఎంగెల్సు ఆదుకున్నాడు. ఆంగ్లంలో వ్రాయడం మార్క్సుకు రానందున ఎంగెల్సు వ్రాసి మార్క్సు పేర పంపిస్తుండేవాడు. ఆ తరువాత కొన్నాళ్ళకు కానీ మార్క్సు ఇంగ్లీషులో వ్రాయడం నేర్చుకోలేదు. ఈలోపు ఎప్పుడైనా ఎంగెల్సు జబ్బుపడితే మార్క్సు తాను పంపానని, పోస్టులో పోయి ఉంటాయని అబద్ధం చెప్పవలసి వచ్చేది. ఎంగెల్సు - మార్క్సు ఇంచుమించు రోజూ ఉత్తరాలు వ్రాసుకునేవారు. ఇతర స్నేహితులపై ఎంగెల్సు దృష్టి పెట్టి సన్నిహితంగా ఉండడం కూడా మార్క్సు సహించలేనంత ఆప్తులయ్యారు.
అలాంటి స్నేహితుల మధ్య ఒక్కసారే అనుకోని వైమనస్యత ఏర్పడింది. ఎంగెల్సు ఆప్తురాలు మేరీ బర్న్ చనిపోగా మార్క్సు ఉత్తరం వ్రాస్తూ సంతాపం వెలిబుచ్చాడు. సంతాపానికి ఒక ఉత్తరం వ్రాసి తరువాత తన కష్టాలు ఏకరువు పెట్టుకున్నాడు. ఎంగెల్సుకు ఇది బాధ అనిపించింది. కాని ఉత్తరం పోస్టుచేసిన మరుక్షణంలోనే మార్క్సు తన పొరపాటును గ్రహించి పశ్చాత్తాపపడుతూ ఉత్తరం వ్రాశాడు. మళ్ళీ స్నేహితులిరువురూ కలిసిపోయారు.
కష్టాలు భరించలేక ఏదైనా వ్యాపారం చేయాలని మార్క్సు తన అభిప్రాయాన్ని ఎంగెల్సుకు చెప్పాడు. కాని పెట్టుబడి లేక ఊరుకోవలసి వచ్చింది. అమెరికా స్టాక్ మార్కెట్ లాటరీలో మార్క్సుకు 400 పౌండ్లు లభించాయి. ఈ లాటరీ ఆట ఎలా ఆడాలో ఎంగెల్సుకు కూడా మార్క్సు నేర్పాడు.
కాపిటల్ వ్రాస్తూండగా మార్క్సు వంటినిండా రాచకురుపులు వచ్చి విపరీతంగా బాధపడ్డాడు. చివరకు మర్మావయవము పై కూడా ఈ పుండు వచ్చినప్పుడు ఆ బాధ మర్చి పోవడానికి తాను చదివిన ఫ్రెంచి అశ్లీల కవిత్వమంతా వ్రాసి ఎంగెల్సుకు పంపాడు.
ఇలాంటి ఘట్టాలు వెలుగు నీడలు ఎన్నో మార్క్సు జీవితంలో ఉన్నవి. మార్క్సు మార్క్సిజం గురించి ఇంకా వివరాలకు సమగ్ర అధ్యనం అవసరం. (చూడండి మార్క్సు మార్క్సిజం, రచన ఎన్.ఇన్నయ్య, తెలుగు విద్యార్ధి ప్రచురణలు మచిలీ పట్నం 1976)

(More..)

scientific method-CRUCIAL TEST

అసలు పరీక్ష
విజ్ఞాన సిద్ధాంతానికి మరొక ప్రమాణం ఉంది. తెలిసిన వాస్తవాలన్నిటినీ వివరించడం, లోగడ ఆమోదించిన సిద్ధాంతాలతో సరిపోవడమే చాలదు. విజ్ఞానంగా భావించడానికి అసలైన పరీక్షకు నిలబడగలగాలి. అసలు పరీక్ష అంటే, దానితో సిద్ధాంతగతి నిర్ధారణ అవుతుందన్నమాట. ప్రతిపాదన అలా ఉంచి, పరిశోధన జరిగినప్పుడు వచ్చే ఫలితాలు ప్రతిపాదనలో సరిపడకపో వచ్చు. అటువంటప్పుడు ప్రతిపాదన సరికాదని రుజువు అవుతుంది. అంటే ప్రతిపాదన నిలవాలంటే ఇటువంటి కీలక పరీక్షకు గురికావలన్నమాట.
కాంతి ప్రసారాన్ని గురించి న్యూటన్, హ్యూజిన్ లు ప్రతిపాదించిన వివాదాలను పరిశీలిద్దాం. కాంతి కిరణాలను ఫోటాన్లు అంటారని, అవి సూటిగా పయనిస్తాయనీ పెర్కొన్నాడు న్యూటన్. అయితే కాంతి అండాకార తరంగాలుగా ఈథర్ లో ప్రసారమవుతుందని హ్యూజిన్స్ అన్నాడు. తరంగంలో ప్రతి బిందు కేంద్రం కూడా కాంతి ద్వితీయ మూలంగా ఉంటుంది. ఈ రెండు ప్రతిపాదనలు ప్రతిబింబం, వక్రీభవనం ఆశక్తి తెలిసిన విషయాలను వివర్తిస్తున్నాయి. దృష్టికి సంబంధించిన శాస్త్రంలోని ఈ అంశాలకు సంతృప్తికర సమాధానం లభిస్తుంది. ఆమోదించిన సిద్ధాంతాలకు విభిన్నంగా లేవు. విజ్ఞాన దృష్య్టా ఏదో ఒక సిద్ధాంతాన్నే సమర్ధించాల నేదేమి లేదు. పదార్థ విజ్ఞాన శాస్ర్తజ్ఞులు తమ తమ మనో ప్రవృత్తిని బట్టి ఏదో ఒక సిద్ధాంతాన్ని సమర్ధించారు. రెండు సిద్ధాంతాల మధ్య స్పర్థకూడా ఒక కీలక పరీక్షకు గురయ్యే వరకూ అసలు విషయం తేలలేదు. చివరకు పెట్టిన పరీక్ష చాలా సాధారణమైనది. సాంకేతిక పదజాలంతో నిమిత్తం లేకుండా ఈ పరీక్షను వివరించవచ్చు.
ప్రశాంతంగా ఉన్న నీళ్ళల్లో రాయి వేశామనుకోండి. రాయిబడిన చోట నుంచి తరంగాలు గుండ్రంగా అన్ని దిక్కులలో వ్యాపించడాన్ని గమనిస్తాం. దీనిని కేంద్రంగా స్వీకరించి గమనిస్తే ఈ తరంగాలతో నీరు పైకీ కిందకూ అన్ని దిక్కులలో కదలడాన్ని పరిశీలిస్తాం. మొదట వేసిన చోటే మరొక రాయి వేశామనుకోండి. మరొక తరంగ ప్రవాహం మొదలై వ్యాపిస్తుంది. అప్పుడు మొదటి తరంగం రెండో తరంగం ఉబ్బెత్తుగా లేచి తారసిల్లిన చోట నీటికణాలు పరిశీలించవచ్చు. అని తొలుత ఉన్న దూరంకంటె రెట్టింపుగా అటూ ఇటూ ఊగుతాయి. అలాగే రెండ కెరటాల మధ్య ఉన్న పల్లపు ప్రాంతపు పరిస్థితి కూడా ఉంటుంది. కాని ఒక కెరటం లేచినచోట మరొ కెరటపు పల్లపు ప్రాంతం ఉంటే గందరగోళం ఏమీ ఉండదు. నీటి కణాలు ప్రశాంతంగా ఉంటాయి.
కాంతి గనుక తరంగ స్వరూపంతో ఉండేటట్లయితే కొన్ని అనుకూల పరిస్థితులలో రెండు తరంగాలు కలిసినప్పుడు జోక్యం గమనించవచ్చు. ఇలాంటి జోక్యమే ఉంటే రెండు తరంగాలవల్ల ఏర్పడిన గందరగోళం లేకుండా పోవాలి. ఈథర్ కణాల గందరగోళం ఉండరాదు. అంటే అలాంటిచోట్ల కాంతి ఉండరాదు. ఒకదానికి బదులు రెండు కాంతి తరంగాలు ఉన్నప్పటికీ ఇలా జరగాల్సి ఉంటుంది. న్యూటన్ కణ సిద్ధాంతం సరైనదైతే వెలుగు ఫొటాన్లరూపంలో కణ ప్రవాహంగా ప్రసరిస్తే, రెండు ఫొటాన్లు పరస్పరం తారసిల్లినచోట, కాంతి తీవ్రత ఉండాలి. అలా కలసిన చోట వెలుగు అసలే కనిపించకుండా పోరాదు. చీకటి దృశ్యాలు ఉంటే, న్యూటన్ ప్రతిపాదన తప్పని, హ్యూజిన్ ప్రతిపాదన సరైనదని తేలిపోతుందన్నమాట.
పరిశోధనల వల్ల తేలిందేమంటే వెలుగుచీకట్లు రెండూ హ్యూజన్ అంచనా వేసిన రీతిలో కనిపించాయి. న్యూటన్ ప్రతిపాదనను తృణీకరించారు.
సాపేక్షతా సిద్ధాంతం కూడా ఇలాంటి పరీక్షకు గురికావలసి వచ్చింది. ఈ ప్రతిపాదన ప్రకారం ద్రవ్యరాశి, శక్తి- ఒకదాని నుంచి మరొకదానికి మార్చడానికి, వీలున్నది, కనక శక్తితో కూడిన కాంతి కిరణాలు గురత్వాకర్షణ క్షేత్రానికి ఆకర్షితం కావడం జరుగుతుంది. సూర్యుడికి సమీపంగా పయనించే నక్షత్ర కాంతి కిరణాలు, సూర్యుని బలమైన ద్రవ్యరాశి ఆకర్షణ మూలంగా, సూర్యునివైపుకు కొంత మేరకు వంగుతాయి. సూర్యుని తీవ్రవెలుగు ప్రసారం వల్ల మామూలుగా నక్షత్ర కిరణాలు ఇలా వంగడాన్ని గమనించలేం. కాని సంపూర్ణ సూర్యగ్రహణ సందర్భంగా సూర్యుడి కిరణాలు భూమి మీద సూటిగా పడవు. అప్పుడు ఏర్పడిన అంధకారం మూలంగా దూరాన ఉన్న నక్షత్రాల నుంచి వచ్చే కాంతి మార్గాన్ని గమనించవచ్చు. అంచనా వేసినట్లు ఈ కాంతి కిరణాలు గనక సూర్యుడి వద్ద వంగకపోతే, ఐన్ స్టీన్ ప్రతిపాదించిన సాపేక్షతా సిద్ధాంతం రుజువయ్యేదికాదు. 1919లో వచ్చిన గ్రహణం ఆధారంగా పరిశోధనలు జరిపి, తారల నుంచి వచ్చే కాంతి కిరణఆలు సూర్యునివద్ద వంపుగా ఉండడాన్ని గమనించారు.
సారాంశం ఏమంటే, విజ్ఞాన సిద్ధాంతం కొన్ని కీలక పరీక్షలకు నిలబడాలి. అక్కడ విఫలమైతే ప్రతిపాదించిన సిద్ధాంతం సరైనదికాదన్న మాట. దీనికే అసలు పరీక్ష అంటారు. ఏ ప్రతిపాదనకైనా ఇది అన్వయించక తప్పదు. ఇటువంటి పరీక్షకు నిలబడని సిద్ధాంతం నిజం కాకపోవచ్చు. సత్యం అంటే ఏమిటో ఆయా వ్యక్తులు భావించే దానిని బట్టి నిజం ఉంటుంది. కాని విజ్ఞాన దృష్టిలో మాత్రం, అటువంటి ప్రతిపాదన నిజమూ కాదూ, అబద్ధమూ కాదు. అది విజ్ఞాన పరిధికి చెందదు, అది భౌతిక, రమణీయక సిద్ధాంతాలు ఎంత సునిశితమైనా, హేతుబద్ధంగా ఉన్నప్పటికీ, అవి మేధస్సు అవగాహనతో చేసిన భావనలైనప్పటికీ, వాటికి విజ్ఞాన స్థాయి మాత్రం చేకూరదు. మేధస్సుకు అవగాహన అయ్యే భావనలలో దేవుడు ఆత్మ ఎలక్ర్టాన్ ఉన్నాయి. ఇందులో ఎలక్ర్టాన్ ఒక్కటే విజ్ఞాన భావన. దీనికి చెందిన సిద్ధాంతం విజ్ఞాన పరమైనది. ఇది పరీక్షకు నిలబడుతుంది. దేవుడు, ఆత్మ భావనలు విజ్ఢానేతరాలు, వీటికి పరీక్షకు నిలబడే సత్తా లేదు. ఇతర సిద్ధాంతాలతో పొందికగా ఉండాలనే ప్రమాణం కూడా చేర్చి చూస్తే, ఈ భావనలు అశాస్త్రీయాలే.

Quantitative methods in Science--Next

Tuesday, December 18, 2007

scientific method continued

ఇతర సిద్ధాంతాలతో సఖ్యత

ఇతర సిద్ధాంతాలలో సఖ్యతగా ఉండటమనేది విజ్ఞాన సిద్ధాంతం సంతృప్తిపరచవలసిన లక్షణాలలో ఒకటి. భూమి, చంద్రుడు కూడా సూర్యునితో బాటే ఒకే కక్షలో ఉన్నప్పుడు గ్రహణం వస్తుందని గ్రహచలన సిద్ధాంతం పేర్కొంటున్నది. కనక రాహువు, కేతువుల దుష్టపథకం వల్ల గ్రహణం ఏర్పడుతుందని అంగీకరించ వీల్లేదు. విజ్ఞానం, వైద్యం చెబుతున్న రీతిగా కలరా, స్పోటకం అనే వ్యాధులకు కారణాలు, చికిత్స అంగీకరిస్తే, క్షుద్రదేవతల ఆగ్రహం వల్ల ఆ వ్యాధులు వస్తాయని ఒప్పుకోరాదు ఇలా ఎన్నైనా చెప్పవచ్చు. తాత్కాలిక ప్రతిపాదనలు విజ్ఞాన సిద్ధాంతంలో ఉండవు. కొత్తగా కనుక్కొన్న వాటిని వివరించడానికి గాను ఒకదాని తరవాత మరొక ప్రతిపాదన చేస్తూ పోరాదు. ఇలా చేస్తే మౌలిక ప్రాతిపదనపై నమ్మకం సడలుతుంది.
ఒక పర్యాయం ప్రతిపాదన సంతృప్తికరంగా ఉందంటే, అందులో ఇంకే మార్పులూ చేయరాదని అర్థం కాదు. పాతవాటిని బలిపెట్టకుండా, కొత్త వాస్తవాలను వివరిస్తూ, సమర్థనీయమైన మార్పులు ఉంటే ఆహ్వానించవచ్చు. సాక్ష్యాధారాలు లభిస్తుంటే, సాధారణీకం గావిస్తుంటాం. అది వాంఛనీయం. కాని ప్రతిపాదనకు ఉప ప్రతిపాదనలు చేస్తుంటే, మౌలిక సిద్ధాంతంలో దోషం ఉన్నట్లే. కొత్త వాస్తవాలను సహజమైన సాధారణీకరణ ద్వారా గనక సిద్ధాంతం వివరించలేకపోతే, తొలి పదాలు, ప్రతిపాదనలు సమూలంగా మార్చాలన్నమాటే.
పదార్థ విజ్ఞానంలో ఇదే జరిగింది. సంప్రదాయ పదార్థ విజ్ఞానం అనేక ప్రతిపాదనలపై ఆధారపడింది. అందులో కొన్ని పేర్కొందాం.
1. పరిశీలకుని వేగంతో నిమిత్తం లేకుండా కాలం, దూరం ఉంటాయి. ఇవి మారవు.
2. యూక్లిడ్ చెప్పిన తీరులో ప్రదేశం ఉన్నది. దూరాన్ని కొలవాలంటే కాలంతో నిమిత్తం లేదు.
3. ప్రదేశం యావత్తు ఈథర్ ఆవరించి ఉంది. పదార్థ రేణువుల మధ్య విద్యుదయస్కాంత తరంగాలు ప్రసారమయ్యేచోట సైతం ఈధర్ ఉంది.
4. శక్తిని అనంతంగా విభజిస్తూ పోవచ్చు.
5. ద్రవ్యరాశి ఎప్పుడూ పదార్థాన్ని అంటి పెట్టుకొని మారకుండా ఉంటుంది. శక్తితో దీనికి సంబంధం లేదు. ఎంత వేగంగా ఏ వైపుకు వెడుతున్నప్పటికీ ద్రవ్యరాశి అలానే ఉంటుంది.
6. పదార్థ విశ్వంలో కార్యకారణ నియమం కచ్చితంగా ఉంది. సూత్రప్రాయంగా ప్రతి సంఘటననూ అవసరమైనదిగా, తిరుగలేనిదిగా దానికారణాలను బట్టి వివరించవచ్చు.
మైకల్ సన్-మోర్లే పరిశోధనల ఫలితంగా వచ్చిన పరోక్ష ఫలితాలు, ఇంకా అనేకానేక పరిశోధనలు 19వ శతాబ్దం చివరి వరకూ జరిగినవాటిని గమనిస్తే పైన పేర్కొన్న వాటి ఆధారంగా ఉన్న పదార్థ విజ్ఞానం సమూలంగా మార్చాలని తేలింది. ప్రతిపాదనల జోలికి పోకుండా సిద్ధాంతాన్ని మార్చాలని చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోగా, పరస్పర విరుద్ధ విషయాలకు దారితీసింది.
ఐన్ స్టీన్, ప్లాంక్ లు తుదకు ఈ సన్నివేశంలో వచ్చిన సమస్యను పరిష్కరించారు. వారి సాపేక్షతా, క్వాంటం (తేజఃకణ) సిద్ధాంతాలు సంప్రదాయ పదార్థ విజ్ఞాన ప్రాతిపదికలకు పూర్తిగా భిన్నమైంది.



పోటీపడుతున్న సిద్ధాంతాల మధ్య ఎంపిక

ఒకోసారి అనేక సిద్ధాంతాలు పోటీపడుతూ రంగంలో ఉండవచ్చు. ప్రతిదీ కూడా పైన పేర్కొన్న స్థితిని సంతృప్తి పరచవచ్చు. అటువంటప్పుడు ఈ కింద పేర్కొన్నవాటిలో ఏదొకటి సాధ్యమౌతుంది. ప్రత్యామ్నాయ సిద్ధాంతాలనేవి మౌలికంగా ఒకే సిద్ధాంతానికి ప్రాతినిధ్యం వహించవచ్చు. ఇందుకు ఒక ఉదాహరణ స్వీకరిద్దాం. మరాఠీ, గుజరాతీ, తమిళం, హిందీ, ఇంగ్లీషు, ఫ్రెంచి భాషలలోని అనేక వాక్యాలు ఒకే అర్థాన్ని ఇవ్వవచ్చు. భిన్న మాటలలో వ్యక్తపరుస్తున్నా, విభిన్న వాక్యాలన్నీ సమానమేనని అనవచ్చు. అలాగే ఒకే సిద్ధాంతానికి సరిపడే ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు సమానంగా ఉన్నాయంటే వాటి తొలిపదాలు, ప్రతిపాదనలు సరిపడేవి కావడమైనన్న మాట. ప్రతిపాదకులకు తొలుత ఈ విషయం అవగాహనకాకున్నా ఇది సాధ్యమే. ఇలాంటి ప్రతిపాదనలు పరస్పరం మౌలిక భేదం ఉన్నా, ఒకే రూపం గలవిగా పేర్కొనవచ్చు. ఒక సమస్యను పరిష్కరించడానికి అనేక ప్రతిపాదనలు ఉన్నప్పుడు, అవి మౌలికభేదం గల ఒకే రూపంగలవికాకుంటే, సాధారణత్వం ఒక్కటే ప్రమాణంగా స్వీకరించాలి. సాధారణత్వం మాత్రమే. అంటే తొలిపదాలు, ప్రతిపాదనలు బహు స్వల్పంగానూ, సాధారణ స్వభావంతోనూ ఉంటాయని అర్థం. సాపేక్షతా సిద్ధాంతంలో చాలా చిక్కుతోకూడిన గణితం ఉన్నప్పటికీ, తార్కికంగా న్యూటన్ పదార్థ చలనంకంటే ఇది సాధారణంగా ఉంటుంది. ఈ రెండు సిద్ధాంతాలలో మిగతా విషయాలు సమానంగా ఉన్నాసరే, సాపేక్షతా సిద్ధాంతాన్ని స్వీకరించాలి.
కొన్ని సందర్భాలలో సాధారణీకరణ అనే ప్రమాణం కూడా విఫలంగా వచ్చు. న్యూటన్, హ్యుగిన్స్లు ప్రతిపాదించిన వెలుగునకు సంబంధించి ప్రత్యామ్నాయ సిద్ధాంతాలు ఇందుకు ఉదాహరణగా స్వీకరించవచ్చు. అటువంటప్పుడు పరిశోధనా సాక్ష్యాధారులు లభించేవరకూ వేచి ఉండడం మినహా చేయగలిగింది లేదు. అప్పుడు ఒక సిద్ధాంతానికి అనుకూలంగా మిగిలిన సిద్ధాంతాలను తోసిపుచ్చడానికి వీలౌతుంది.

Next- Crucial test

Monday, December 17, 2007

Scientific Method 13

The Structure of Scientific Theory

విజ్ఞాన సిద్ధాంత నిర్మాణం

వివరణ-అంచనా

ఒక సిద్ధాంతం వైజ్ఞానికంగా ఉండాలంటే, పరిశీలించదగిన వాస్తవాలను, వాటి తార్కిక అవసరాల దృష్ట్యా వచ్చే ఫలితాలను వివరించగలిగి ఉండాలి. ప్రకృతి విజ్ఞానంలో ఎటువంటి వివరణకైనా ఇది కనీస అవసరం. మానవుడికి సంబంధించిన విజ్ఞానంలో తార్కిక ఆవశ్యకతలే గాక, మానసిక విషయాలను కూడా పరిగణనకు స్వీకరించాలి. మానవుడి కార్యకలాపాలలో తార్కిక ఆవశ్యకత అంటే, మానవుడి పిపాసలు, ఉద్దేశాలు ఇమిడే ఉంటాయి. ఈ విధంగా చూస్తే, ప్రకృతి విజ్ఞానంకంటే మానవ సామాజిక విజ్ఞానాల తర్కం ఉన్నతమయినది. (వీటి విస్తృత చర్చకు ఎఫ్.ఎన్.సి. నార్త్ రప్ రచన, ఎర్నెస్ట్ కాజైనర్ రాసిన లాజిక్ ఆఫ్ హ్యూమానిటీస్ చూడండి) ప్రస్తుతం ప్రకృతి విజ్ఞానానికే మనం పరిమితమౌతున్నాం.

నైరూప్యత ఆధారంగా ఉన్న సిద్ధాంతాలలో, ప్రతిపాదనలోకి తెలిసిన వాస్తవాలను వినడం మినహా అదనంగా చేసేదేమి లేదు. కాని సిద్ధాంతంలో నమ్మకం కుదరాలంటే గతాన్ని భవిష్యత్తును గురించి చెప్పగలిగిన సత్తా ఉండాలి. ఈ విషయాలు మామూలుగా అయితే అంత అవసరం లేనివిగా భావిస్తారు. ప్రకృతి సామాజిక శాస్త్రాలకంటే, పదార్థ విజ్ఞానం ఆధిక్యతలో ఉండగలగడానికి కారణం, గతాన్ని భవిష్యత్తును గురించి చాలావరకు చెప్పగలగడమే. ఉదాహరణకు న్యూటన్ పేర్కొన్న గురుత్వాకర్షణ సిద్ధాంతం, చలన సిద్ధాంతం విభిన్న రంగాలలోని సంఘటనలను ఏకం చేశాయి. కొన్నిటిని అంచనా వేయగలగడం కూడా జరిగింది. లేకుంటే వాటి జోలికే ఎవరూ పోలేరు. గ్రహాల చలనం, గ్రహణాలు, తోక చుక్కలు కనిపించడం, అలల ఆటుపోటులు, తుపాకి గుండు దూసుకుపోవడం, ఎత్తుతోబాటు బరువులో మార్పు, సూర్యుని వంటి నక్షత్రాలు స్థిరంగా, అండాకారంలో ఉండడం వంటి వాటిని ఉదాహరణగాను చెప్పవచ్చు. న్యూటన్ సిద్ధాంతం ప్రకారం అద్భుతమయిన అంచనాలుగా 1845లో కనుక్కొన్న నెప్ట్యూన్ గ్రహం, 1930లో కనుక్కొన్న ప్లూటో గ్రహం పేర్కొనదగినవి. యాడమ్స్, లెవిరియర్లు ఎవరికివారే వరుణ (నెప్ట్యూన్) గ్రహాన్ని కనుక్కొన్నారు. యురేనస్ గ్రహ చలనంలో, న్యూటన్ సిద్ధాంతాన్ననుసరించి, ఏదో ఇంకొక గ్రహం ఉండాలని భావించారు. ఇలాంటి పరిశోధన ఫలితంగానే ప్లూటో గ్రహాన్ని కూడా కనుక్కొన్నారు.

అయితే, న్యూటన్ కు పూర్వం శతాబ్దాల తరబడి, గ్రహణాలు, ఆటుపోటుల గురించి సరిగానే అంచనా వేయగలిగారు గనక న్యూటన్ సిద్ధాంతం విజ్ఞాన రంగంలో ముందుకు వెళ్ళినట్లు చెప్పలేకపోవచ్చు. ఇక్కడ కేవలం అంచనా వేయడం మాత్రమే ప్రధానం కాదు. ఏ ప్రాతిపదికపై అంచనా వేశారనేది ముఖ్యం. పరిశీలించదగిన వాస్తవాల నుంచి ఒక నమూనాను కనుక్కోవడం ఒక ఎత్తు. ఆ నమూనాకు మూలం కనుక్కొని ఇందుకుగాను అవసరమయిన గర్భత విషయాలు గ్రహించడం మరొక ఎత్తు. ప్రతి రోజూ సూర్యోదయం తూర్పున ఇంచుమించు ఒకే సమయాన జరుగుతుందనీ, రుతువులు ఒకదాని తరవాత మరొకటి వస్తాయని ఆటవికులకు కూడా తెలుసు, వీటికి వెనక ఎవరో దేవతలున్నారు. అనుకున్నంతవరకూ అతడి జ్ఞానం అస్తవ్యస్తంగానే ఉంటుంది. చలికాలంలో పగలుతక్కువగా ఉండడం, ఒకోసారి దేవతలున్నారు. అనుకున్నంతవరకూ అతడి జ్ఞానం అస్తవ్యస్తంగానే ఉంటుంది. చలికాలంలో పగలుతక్కువగా ఉండడం, ఒకోసారి ఆలశ్యంగా వర్షాకాలం ప్రారంభం కావడం వంటివన్నీ ఆయా దేవతల మనస్సులోని మార్పుననుసరించి జరుగుతాయనుకున్నాడు. కనక ప్రకృతి గురించిన అతడి అవగాహనలో భద్రతా రాహిత్యమే కనిపిస్తుంది. భూమి సంవత్సరానికో పర్యాయం స్యూరునిచుట్టూ పరిభ్రమించడం, భూమి తన అక్షంపై తాను తిరగడం అనేవి ఖగోళ శాస్త్రజ్ఞుడు అవగాహన చేసుకున్నాడు. క్రమంగా ఉండడం, అందులో కొంత దారి తప్పడం అనేవి వస్తు తరహాలని, వీటిని వివేచనాత్మకంగా సంతృప్తికరంగా అవగాహన చేసుకోవచ్చని మానవుడు తెలుసుకున్నాడు. న్యూటన్ సిద్ధాంతంలో జరిగింది ఇదే, ఏదొక విధంగా అనిగాక, ఆవశ్యకత అనేదానికీ, మితమయిన స్థాయి నుంచి విశ్వజనీనతకు న్యూటన్ సిద్ధాంతం దారితీసింది.
Compatibility with other theories---Next

Sunday, December 16, 2007

SCIENTIFIC MATHOD 12

. ప్రాతిపదికలు-తొలిపదాలు

ఒక సిద్ధాంతానికి ప్రాతిపదికగా ఉన్నదే మరొక సిద్ధాంతానికి నిర్ణయం కావచ్చు. వంశపారంపర్యత, జన్యుశాస్త్ర సిద్ధాంతాలలోని నిర్ణయాలు పశువుల కృత్రిమ సంపర్క సిద్ధాంతానికి ప్రాతిపదికలయ్యాయి. ఇలా ఒక సిద్ధాంతం నుంచి మరొక సిద్ధాంతానికి తార్కికంగా కారణాలు అన్వేషిస్తూ అనంతంగా వెనక్కు పోజాలం. ఎక్కడో చోట ప్రతిపాదన ఆరంభం కావాలి. దానిని సమర్థించడం ప్రాపంచిక అనుభవరీత్యానే తప్ప, తార్కికంగా కాదని గ్రహించాలి. అవి నిజమైనవని అంగీకరిసే. వాటిని మరొక ప్రాతిపదిక నుంచి రాబట్టవచ్చు. అంతమాత్రాన నిజమైనవనడంలేదు. అవి ఫలప్రదమైనవి. వాటి నుంచి నిజమైన నిర్ధారణలను రాబట్టడానికి వీలౌతున్నది.
ఒక సిద్ధాంతంలో తార్కికంగా వెనక్కు వెళ్ళడానికి వీల్లేని వాటిని ప్రాతిపదికలు అంటున్నాం. ఒకానొక సిద్ధాంతంలోని ప్రాయికమైన భావనల మధ్య కొన్ని సంబంధాలను ప్రాతిపదిక నిర్ధారిస్తుంది. ప్రాతిపదికలలాగే, ఈ భావనలు కూడా అప్పటి వరకు ఉన్న ప్రాతిపదికల ఆధారంగా రూపొందించినవే. వీటిని వాటితో నిర్వచించే పరిస్థితి ఉండదు. కనక అలాంటి వాటిని అనిర్వచనీయ పదాలనీ, తొలి పదాలు అనీ అంటాం. ప్రతి సిద్ధాంతం కూడా ఇలాంటి తొలి పదాలతోనూ, ప్రాతిపదికలతోనూ ప్రారంభిస్తుంది. లేకుంటే అనంతంగా వెనక్కు పోతూనే ఉండవలసి వస్తుంది. అప్పుడు ఏ సిద్ధాంతమూ సాధ్యం కాదు.
తొలి పదాలు, ప్రాతిపదికలు అనేవి ఆధునిక విజ్ఞానానికే ప్రత్యేక లక్షణాలని భావించరాదు. ప్రాచీన, ఆధునిక వివేచనాత్మక సిద్ధాంతాలన్నింటికీ ఇవి ప్రారంభదశలే. సంప్రదాయ పదార్థ విజ్ఞానంలో రేణువు (పార్టికల్)ను నిర్వచించలేదు. న్యూటన్ చలన సూత్రాలు, గురుత్వాకర్షణ నియమాలు కూడా ప్రాతిపదికలే. స్థిర పదార్థం (రిజిడ్ బాడీ) అనేది రాబట్టిన పదమే. కెప్లర్ గ్రహచలన సిద్ధాంతాలు పైన పేర్కొన్న ప్రాతిపదికల నుంచి రాబట్టినవే.



నైరూప్యాలు-మేధోభావనలు
ప్రతి సిద్ధాంతానికి తొలి పదాలు, ప్రాతిపదికలు ఉండడం తప్పనిసరి అయినప్పటికీ, అవి అవగాహనకు అందనట్టివవనిగాని, అయోమయమైన వనీ అనుకోరాదు. వాటికి అర్థం లేదని, భావించరాదు. ఇతరపదాల సహాయంతో వీటిని వివరించడం, నిర్వచించడం కుదరనప్పటికీ, ఒకటి రెండు పద్ధతులతో తెలిసేటట్లు చేయవచ్చు. కొన్ని వస్తువులకు ఎరుపు సాధారణ వర్ణమైనట్లు మనం పేర్కొంటాం. అలాగే మరికొన్ని సందర్భాలలో సాధారణ లక్షణాన్ని చూపవచ్చు. ఇటువంటి పద్ధతిని నైరూప్యం అంటారు. (ప్రోఫెసర్ నార్త్ రఫ్ గ్రంధంలో ఈ విషయాన్ని వివరించాడు). కలగాపులగంగా ఉన్న అనేక వస్తువుల సముదాయం నుంచి ఒక సాధారణ లక్షణాన్ని రాబట్టి, దానికి ఒక స్వతంత్రభావ ప్రతిపత్తిని, తార్కిక స్థాయిని సమకూర్పు తున్నామన్నమాట. మనం సాధారణంగా వాడే పదాలు మంచితనం, చతురస్రం, ఒక దానికంటె ఎక్కువ, నీలం అనేవి ఇలాంటి భావనలే. నైరూప్యతలో ప్రధానలక్షణం ఏమంటే ప్రపంచంలోని వస్తువుల విధానాలు ఆధారంగా పూర్తి అర్థాన్ని చిత్రీకరించవచ్చు.
తొలిపదం అర్థం కావాలంటే ఆ పదం వచ్చే ప్రాతిపదికలను ప్రస్తావించాలి. ఇతర భావాలతో దీనికిగల సంబంధాన్ని ప్రత్యేకించి పేర్కొనవచ్చు. అంటే గర్భితంగా నిర్వచించడమేనన్నమాట. అణుపదార్థ విజ్ఞానంలోని ఎలక్ట్రాన్, వేవ్ పాకెట్ గాని, సంప్రదాయ పదార్థ విజ్ఞానంలోని పార్టికల్ గాని తత్వంలోని ఆత్మ గాని వివరించాలంటే, ఇదొక్కటే పద్ధతి. వేవ్ పాకట్ అనే పదాలు నిర్దిష్టంగా ఒకానొక వస్తువుకు చెందుతాయని చూపడం సాధ్యంకాదు. కనక ఇలాంటి భావనలు ఎరువు వంటి నైరూప్యాలు కాదు.
ప్రాతిపదికల ఆధారంగా పూర్తి అర్థాన్ని వివరించగల భావనలను మేధోభావనలంటాం. ఇందుకు ఉదాహరణలు ఎలక్ర్టాన్, ఎనర్జి, ఎంట్రోఫి, ఎలక్ట్రొ మేగ్నటివ్ వేవ్స్, గ్రావిటేషనల్ వేవ్స్, కెమికల్ బాండ్, ఆత్మ ఇత్యాదులు.
నైరూప్యతతో పోల్చిచూస్తే మేధో భావనలో వాస్తవికత తక్కువ అని ఊహించరాదు. నైరూప్యతలో సైతం ప్రపంచానుభవంతో పోల్చినప్పుడు కొంత మేరకు అఖాతం ఉంటుంది. ఎర్రదనం, జీవితం అనే వాటికి వస్తుగతంగా చూడడానికి విడిగా ఏవీలేవు. దానికంటే ఎక్కువ, ఎడమపక్కకు, అతని యొక్క సోదరుడు ఇత్యాదుల సంబంధాలలోని నైరూప్యతలలో ఈ విషయం స్పష్టమే. మేదో భావనలలో, ప్రపంచవస్తువులకూ భావనలకూ అఖాతం ఇంకా ఎక్కువ. ఒక వస్తువును లేదా వస్తువులను చూసి, ఫలానా భావనకు అవి మారురూపాలని మేధస్సులో అవగాహన చేసుకునే వాటిలో చూపలేం. మనం చేయగలిగిందల్లా, ఒకానొక సన్నివేశాన్ని చూసి, వివేచనాత్మక వివరణ, అవగాహన కావాలంటే మేధోభావన, వాటిని గర్భితంగా నిర్వచించే ప్రాతిపదికలు అవసరం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటున్నది. ఈ ప్రాతిపదికల నుంచి తార్కికంగా మనం కొన్ని వాస్తవ ప్రకటనలు రాబట్టవచ్చు. నైరూప్యతలలాగే వీటిని కూడా ప్రాపంచకానుభవంతో పరిశీలించి రుజువు పరచవచ్చు. ఒక విధంగా ఇది ప్రాయోజికతావాదంగా అనిపించవచ్చు. అయితే ఆలోచనారంగంలో ఈ మాత్రం ప్రాయోజికతావాదం ఉంటుంది. మానవుడి మేధస్సుకు, అది అవగాహన చేసుకోదలచిన ప్రపంచానికి ఈ విధానం ఒక్కటే వారధి.
మేధాభావనలు ఆధునిక విజ్ఞానానికి, తత్వానికి మాత్రమే పరిమితంకాదు. సహజచారిత్రక దశస్థాయి నుంచి విజ్ఞానం ముందుకు సాగిపోయినప్పుడు, కేవలం వర్ణనగాక, వివరణ అవసరమైనప్పుడు, మేధాభావనలతో కూడిన ప్రాతిపదికలు వస్తాయి. సహజ చారిత్రక దశ పూర్తిగాక పూర్వమే కొన్ని సందర్భాలలో తాత్వికులు, శాస్త్రజ్ఞులు మేధాభావనలు చేసిన ఉదాహరణలు లేకపోలేదు. ప్లేట్లో భావాలు కణాదుడు, ఎసిక్యూరస్ లు పేర్కొన్న అణువు హెగెల్ (భావం) ఇందుకు మచ్చు తునకలు. విజ్ఞానాభివృద్ధిలోని ఒక స్థాయిలో భావనలు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, ఉత్తరోత్తరా ఇంకా సునిశితమైన వాటిని ఇముడ్చుకోవలసి ఉంటుంది. అయితే మాటలు పాతవే ఉండవచ్చు. 19వ శతాబ్దిలో రసాయనిక శాస్త్రం పేర్కొన్న అణువుకూ ఆధునిక రసాయనిక విజ్ఞానం చెప్పే అణువుకూ అర్థం పూర్తిగా మారిపోయింది. మేధాభావన దశపై ఆధారపడనిదే ఏ విజ్ఞానం కూడా పరిపక్వస్థాయికి చేరదు.
నైరూప్యతపై ఆధారపడిన సిద్ధాంతాలలో అంచనావేసే శక్తి బహుస్వల్పం పరిశీలించిన సమాచారం ఆధారంగా తొలిపదాలు, ప్రాతిపదికలు రాబట్టిన దృష్ట్యా అంతకు మించి ముందుకు పోజాలని స్థితిలో నైరూప్యదశ ఉంటుంది. ప్రతిపాదన నుంచి వాస్తవాలను రాబట్టినప్పటికీ, వర్ణన చేయడం తప్ప, సిద్ధాంతం ఏమంతగా ముందుకు సాగలేదు. మేధాభావనపై ఆధారపడిన సిద్ధాంతం, అవధులు దాటిపోయి. కొత్త పరిశోధనలకు, నూతన విషయాలు కనుక్కోవడానికి దారితీయగలదు. నిత్యానుభవం నుంచి భావన ఎంతదూరమైతే అంత ఫలవంత మౌతుందని చెప్పవచ్చు. అందుకే గణితభావనలు, పద్ధతులు అన్వయించిన చోటల్లా, సాధారణ అనుభవంకంటే ఎంతో ఫలప్రదమైనట్లు రుజువైంది.
సాధారణంగా నైరూప్యతతో సాగిపోతుంటాం. మన దృష్టి, శక్తి సామర్ధ్యాలు స్పర్శేంద్రియాధార ఊహలు కొన్ని హద్దులకు పరిమితమై ఉంటాయి. విజ్ఞానరంగంలో ప్రతి విభాగం కూడా తన సిద్ధాంతానికి గణిత రూపాన్నివ్వాలని కలలు కంటుంది. పదార్థ విజ్ఞానం ఈ విషయంలో గణనీయదశకు చేరింది. ఏ విజ్ఞాన విభాగమైనా ఇలా చేయగలదా అనేది ఆయా విషయాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు రాజకీయ విజ్ఞానం ఈ స్థాయికి చేరుకోగలగడం చాలా సందేహాస్పదమైన విషయం.
అంత మాత్రాన గమన రూపంలో సిద్ధాంతంగా రాజకీయ శాస్త్రం ముందుకు పోలేదని భావించరాదు. సహజ విజ్ఞఆనంలోగల నిర్దిష్టత కచ్చితంగా పేర్కొన్నడం అనే స్థాయికి చేరుకోలేదనే ఇక్కడ ఉద్దేశ్యం. అయితే రాజకీయాలలో వాస్తవాలను వివరించవచ్చు. ఒకే తీరును సాధించవచ్చు. అంచనావేయవచ్చు. లోగడ ఇలా చేయలేదంటే, ఆగమన కృషి జరగలేదు. రాజకీయ సిద్ధాంతాన్ని రూపొందించడానికి ఇటువంటిపని జరగాలి. ఏ మేరకు ప్రతిపాదనలు రూపొందించవచ్చునో ఆ మేరకు మార్క్స్ ప్రయత్నించి ఇంచుమించు సఫలీకృతుడైనాడు. అతడు నిర్మాణ క్రమం కోరినవాడు. బైబిల్ లోని పాత నిబంధనల ప్రవక్తవంటివాడు. కనక తన ఆలోచనలకు పదును పెట్టే తీరులో తనలోని సామాజిక శాస్త్రాల ధోరణికి స్వేచ్ఛను ఇవ్వలేదు
Next : The Structure of Scientific Theory

Saturday, December 15, 2007

Scientific Method 11


విజ్ఞాన సిద్ధాంత స్వభావం

విజ్ఞాన సిద్ధాంతం మూసబోసింది కాదు
వైజ్ఞానిక సిద్ధాంతాలలో, ఒక్కొక్క ప్రత్యేక సిద్ధాంతం ఏదో ఒక మేరకు కొన్ని ప్రమాణాలను సంతృప్తిపరుస్తుంది. ఈ సిద్ధాంతాలన్నీ, అన్ని సందర్భాలలోనూ పరస్పరం సంబంధం కలవికావు. అంటే ఇవన్నీ కలిసి ఒకే సిద్ధాంతంగా రూపొందవు. విజ్ఞానాభివృద్ధిలో ఏ దశ తీసుకున్నా వివిధ స్థాయిలలో అనేక సిద్ధాంత నిర్మాణాలు గమనించవచ్చు. ప్రతి నిర్మాణం కూడా మరి కొన్ని నిర్మాణాల ప్రభావంతో ఏర్పడినట్టిదే. అలాగే అనేక సిద్ధాంతాలకు సంబంధ లేకుండా కూడా ఒకానొక వైజ్ఞానిక నిర్మాణం ఉండొచ్చు. జీవోత్పత్తి మూలానికీ, పర్వతాలు ఏర్పడటానికీ, పరమాణు పదార్ధ శాస్త్రానికీ ఏమి సంబంధం లేకపోవచ్చు. ఈ విషయం అవగాహన చేసుకోటం ఏమంత కష్టం కాదు ప్రపంచంలో సంఘటనలన్నీ ఒకదానితో మరోకటి తప్పిసరిగా సంబంధం కలిగి ఉండాలని ఏమీ లేదు. కొంకణ తీరంలో వర్షపాతానికీ, హిమాలయాలలో మంచు పడడానికీ సంబంధం ఉన్నట్లు చెప్పే అవకాశం లేదు ఇటలీలో అగ్నిపరత్వం బద్ధలు కావడ వల్ల నీలగిరిలో కాఫీపంట బాగా పండిందనడానికీ అవకాశం లేదు. సహజ సంఘటనలను విడివిడిగా పరిశీలించే అవకాశం ఉంది. స్వతంత్ర ప్రతిపత్తిగల సంఘటనలను ఇలా అధ్యయనం చేయవచ్చు. విజ్ఞాన సిద్ధాంతాలు పనిచేసే తీరు వివేచనాత్మకంగా రూపొందించే అవకాశం ఉంది. అంతమాత్రాన ఈ సిద్ధాంతాలన్నీ ఒకే మొత్తంగా మూసపోసినట్లు ఉండవు. సిద్ధాంతాలలోని భాగాలన్నీ తప్పనిసరిగా, విడదీయటానికి వీలులేనివిగా, కలిసి ఉండవలసిన పని లేదు.
జ్ఞానమంతా ఒకే విధానంగా ఉంటుందనే భావనకు రెండు ఆధారాలు కనిపిస్తున్నాయి. మానవుడికి క్రమత్వం అంటే ఇష్టం ఉంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని అన్వేషిస్తుంటాడు. ఇటువంటి అన్వేషణ వల్ల విజ్ఞానరంగంలో కూడా ఒకే క్రమాన్ని నిర్మించాలని ప్రయత్నిస్తాడు. కాని ఇటువంటి ప్రయత్నానికి కేవలం రామణీయక విలువ మాత్రమే ఉంది. అన్ని సందర్భాలలోనూ ఇది సఫలం కానక్కరలేదు.
ఆలోచనా రంగంలో విశ్వజనీనమైన పద్ధతులు వ్యాపించి ఉండగా, అటువంటి వాతావరణంలో విజ్ఞానం పెంపొందింది. ఉదాహరణకు హెగెల్ పద్ధతిని చూస్తే ప్రపంచంలో పరిశీలించదగిన ప్రతిదాన్నీ ఒకటి రెండు మూల సూత్రాల ఆధారంగా వచ్చినట్లు వివరించే ప్రయత్నం చేసినట్లు గమనించవచ్చు. అటువంటి పద్ధతులకు వ్యతిరేకంగా పోరాడటంలో, ఎవరికి వారు విశ్వజనీనమైన పద్ధతులను, ప్రత్యామ్నాయాలను చూపాలని ఆశించారు. ఆ విధంగా మార్క్సిజాన్ని, పరిశీలించవచ్చు. విశ్వజనీనత కావాలనే విధానాలలో ఇది ఆఖరి పద్ధతిగా భావించవచ్చు. సోషలిజానికి ఇదే విజ్ఞాన సిద్ధాంతంగా పెర్కొంటున్నారు. గతి తార్కిక నియమాలనుంచి సామాజిక సూత్రాలను, ప్రకృతి సంఘటనలను రాబట్టడం జరిగింది.
20వ శతాబ్దం ప్రారంభదశవరకూ ఈ స్థితే కొనసాగింది. తాత్విక మద్దతుతో నిమిత్త లేకుడా, విజ్ఞానం తన కాళ్ళపై తానే నిలవగలిగిన స్థితికి చేరుకున్నది. సిద్ధాంత కర్తలను తేజఃకరణ సిద్ధాంతం (క్వాంటం సిద్ధాంతం) చెదురుమదురుగా నిలిచింది. వారు దీన్నుంచి కోలుకునే అవకాశం ఇంకా కనుచూపు మేరలోలేదు. ఇక ముందు కూడా అటువంటి అవకాశం లభిచేటట్లు లేదు. ఒకే విధమైన విజ్ఞానపద్ధతి ఆవశ్యకత ఇంకేమాత్రం ఉన్నట్లు లేదు. విజ్ఞానం ప్రభావం వల్ల విశ్వజనీనమైన తాత్విక పద్ధతులు చాలావరకూ మారాయి.


విజ్ఞాన సమైక్యత-పద్ధతులు, నిర్మాణం


విజ్ఞానం అంటే అనేక సిద్ధాంతాలతోనూ, వాటికి ఆధారంగా నిలిచిన వాస్తవిక సమాచారంతోనూ ఉన్నట్టిదే అయితే విజ్ఞానంలో ఐక్యతను కనబరచడానికి తోడ్పడేది ఏమిటి. అన్ని విభాగాలకు సర్వసాధారణంగా ప్రతి విజ్ఞాన సిద్ధాంతం కూడా చేబట్టిన విషయ పరిశోధన ప్రకారం, చేరుకున్న దశను ప్రమాణంగా స్వీకరిస్తుంది. విజ్ఞాన సిద్ధాంతాలకు గల ఈ ప్రమాణాలే ఒక నిర్మాణ సమైక్యతను సమకూర్చి పెడుతున్నాయి. విజ్ఞానేతర సిద్ధాంతాలు ఇలాంటి ప్రమాణాన్ని స్వీకరించవు. మనం సాగిపోయే కొద్దీ ఐక్యత ఏమిటో స్పష్టపడు తుంది.
భౌతిక, రసాయనిక, భూగర్భ, జీవశాస్త్రాలకు, ఆరంభం ఉందిగాని అంతం లేదు. ప్రారంభ ప్రాతిపదికలన్నీ రుజువు అవసరం లేనివిగా భావించబడు తున్నాయి. అవి రుజువు పరచనక్కరలేదంటే, వాటిని ఇంకో సూత్రం నుంచి రాబట్టే అవసరం లేదన్నమాట. మరో సూత్రం నుంచి గనక రాబట్టగలిగితే, అదే ఆరంభదశ అవుతుందన్న మాట. ఇలా అనంతంగా వెనక్కు పోకుండా ఉండాలంటే, ఎక్కడోచోట ఆరంభించడం తప్పనిసరి అవుతుంది. ఈ ఆరంభదశనే విజ్ఞానంలో ప్రతిపాదన అంటాం.
తార్కిక పద్ధతులననుసరించి ఈ ప్రతిపాదనల మూలంగా అనేక నిర్ణాయాలను రాబట్టడం జరుగుతుంది. అవి ప్రాపంచిక అనుభవంతో రుజువుపరచదగినవే. వాస్తవాల ఆధారంగా రుజువైన నిర్ణయాలను శాస్త్రీయ సిద్ధాంతం వివరించినట్లే భావిస్తారు. మరికొన్ని నిర్ణాయాలు ఇంతకు ముందు తెలియని ప్రతిపాదనలను సూచిస్తాయి. అటువంటి నిర్ణాయాలను అంచనాలనీ, గతాన్ని తెలియపర్చేవనీ అంటాం. వీటిని నిర్ణీత పరిశీలన ప్రకారం వాస్తవాలను కనుక్కోవడానికి ఉపయోగిస్తాం. అవి కనుక్కొన్న వాస్తవాలను ఆధారం చేసుకొని అంచనావేసిన వాటిని రుజువు పరచగలిగితే ప్రతిపాదనలకు వాస్తవ ప్రమాణం లభిస్తుంది. అంటే సిద్ధాంతం రుజువైనట్లే.
ప్రతిపాదనల నుంచి రాబట్టిన నిర్ణయాలన్నీ సిద్ధాంతంలో మధ్యస్థ స్థాయికి చేరుకున్నట్లే విజ్ఞాన సిద్ధాంతానికి అంతం లేదంటే, ఇక ముందు ఎలాంటి పరిణామాలు పెంపొందుతాయో ముందు చెప్పజాలం అని అర్థం. కొత్తగా అనేక విషయాలు రాబట్టవచ్చు. లేదా కొత్త వాస్తవాలు వెలుగులోకి రావచ్చు. విజ్ఞాన సిద్ధాంతం ఆకాశహర్మ్యం వంటిది. ఎన్ని అంతస్తులైనా ఆకాశంలో కట్టుకుంటు పోవచ్చునన్నమాట.
ఈ విషయం రుజువు పరచడానికి న్యూటన్ పదార్ధ చలన సిద్ధాంతమే ఆధారం. మూడు చలన సూత్రాలు ఆరంభదశలో ఉన్నాయి. ఆ తరవాత గురుత్వాకర్షణ సిద్ధాంతం వచ్చింది. తదనంతరం అనేక ఫలితాలకు దారితీసిన సంఘటనలనేకం వచ్చాయి. కెప్లర్ సూచించిన గ్రహచలన సూత్రాలు, సముద్ర తరంగాల సూత్రాలు, గైరోస్కోప్ చలనం, పదార్థచలన సిద్ధాంతం-తుపాకి గుండు చలన సిద్ధాంతం-ఇవన్నీ పరిశీలనతో రుజువు పరచదగినవే అయినప్పటికీ, ఐన్ స్టీన్ సాపేక్షతా సిద్ధాంతంలో న్యూటన్ సిద్ధాంతాన్ని పొందుపరచేటంత వరకూ, న్యూటన్ సిద్ధాంతం. ఆగిపోయిందనడానికి వీల్లేదు.
ఈ పరిశీలనను విపులీకరించి చూద్దాం.



విజ్ఞాన సిద్ధాంత లక్షణాలు


విజ్ఞాన సిద్ధాంతంలోని ప్రతిపాదన, ఒక రకమైన వాస్తవాలకు మరొక విధమైన వాస్తవాలతో సంబంధం ఏర్పరుస్తుంది. దీనినే కార్యకారణ సంబంధం అంటారు. ప్రతిపాదనలో రెండు విషయాలు సంతృప్తికరంగా ఉండాలి.
1. పరిశీలించిన వాస్తవాలన్నిటికీ సంబంధించిన ప్రకటనలు, ప్రతిపాదన యొక్క తార్కిక ఫలితాలుగా రాబట్టే వీలుండాలి.
2. ఇంతకు ముందు తెలియని, పరిశీలించదగిన సంఘటనలను ముందుగా ఊహించడం లేదా, లోగడ జరిగిన వాటిని చెప్పగలగడం.
న్యూటన్ విశ్వవ్యాపిత గురుత్వాకర్షణ సిద్ధాంతం, మాక్స్ వెల్ విద్యుదయస్కాంత క్షేత్ర సిద్ధాంతం కూడా పైన పేర్కొన్న రెండు నిబంధనలను సంతృప్తి పరచినవి. విజ్ఞానస్థాయి కోల్పోకుండానే, పై రెండింటిలోనూ ఒక నిబంధనను మాత్రమే సంతృప్తి పరచడం జరిగింది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఇటువంటి మినహాయింపుకు కారణాలు లేకపోలేదు.
అనేక సిద్ధాంతాలను కలిపి స్వీకరిస్తే రెండు నిబంధనలూ సరిపోవచ్చు. ఒకే సిద్ధాంతంలో రెండు పరిస్థితులను సంతృప్తి పరచలేకపోవచ్చు. సంప్రదాయ బద్ధంగా వస్తున్న ఉష్ణ సిద్ధాంతం పదార్థ చలన ప్రతిపాదనపై ఆధారపడింది. ఈ క్షేత్రపరిధికి చెందినవాటితో నిమిత్తం లేకుండానే, చాలా మట్టుకు జరిగే సంఘటనలను ఉష్ణ సిద్ధాంతం వివరించగలదు. కాని ఉష్ణ సిద్ధాంతం ఆధారంగా, రెండు చోట్ల కలిసిన భిన్న లోహపు తీగెల అతుకుల ఉష్ణ తాభేదం వల్ల కలిగే విద్యుత్ ప్రవాహం గురించే వివరించడం గాని, ముందుగా ఊహించడం గాని వీలుపడలేదు. దీనికి గాను నేటి విద్యుత్ కు సంబంధించిన సిద్ధాంతం అవసరమయింది.
ఈ చర్యల వల్ల విజ్ఞాన సిద్ధాంతంలోని భిన్నస్థాయీ భేదాలు గమనించవలసిన ఆవశ్యకత గుర్తించాలి. పదార్ధ చలనం, వేడి, ధ్వని, విద్యుత్తు, అయస్కాంతం ఇత్యాది పదార్థ సంఘటనలకు వేర్వేరుగా సిద్ధాంతాలున్న మాట నిజమే. వీటన్నిటినీ కలిపి సంప్రదాయ పదార్థ విజ్ఞాన సిద్ధాంతం అంటున్నాం. విభాగాలను పక్క పక్కనే అట్టిపెట్టిన ఫలితాలనూ, అన్నిటినీ కలిపిచూస్తే లభించే సిద్ధాంతానికి చాలా తేడా ఉంది. విడిగా ఉన్న సిద్ధాంతాలన్నీ పరస్పర సంబంధం గలవి. కనక సమైక్యతలో పొందిక ఉంది. ఒక ప్రతిపాదనల రాశి నుంచి తార్కికంగా వీటన్నిటినీ రాబట్టే వీలున్నది. అంటే విడి శాఖలకంటే, సంప్రదాయ పదార్థ విజ్ఞానం యావత్తు భిన్న స్థాయిలో ఉన్న సిద్ధాంతమన్న మాట. మొత్తంగా ఉన్న సిద్ధాంతం సంతృప్తి పరచినట్లు, విడిగా ఏ ఒక్క శాఖకూడా సంతృప్తి నివ్వలేకపోవచ్చు. ఈ వాస్తవం దృష్ట్యా, విజ్ఞాన సిద్ధాంత స్వభావాన్ని చర్చించేటప్పుడు, ఇమిడి ఉన్న స్థాయి భేదాలను ప్రస్తావించకతప్పదు. అయితే అవిపైకి చెప్పేటట్లు లేకపోవచ్చు.
ఒకనొక విజ్ఞాన సిద్దాంతం పరీక్షశ్రకు నిలవకపోవడానికి తగిన కారణాలు ఉన్నాయి. సిద్ధాంతపరమైన స్థాయిబేధం దీనితో ముడిపడిఉంది. అంటే ఉష్ణ సిద్ధాంతానికి, సంప్రదాయ పదార్థ సిద్ధాంతానికీ గల సంబంధంకాదు. సహజంగా స్వాభావిక దశలో ఉన్న సిద్ధాంతాలకు అంచనావేసే శక్తి స్వల్పంగా ఉంటుంది. నిగమనంతో రూపొందించే స్థాయికి చేరుకున్న సిద్ధాంతానికి అంచనావేసే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ తేడాను పరిశీలిద్ధాం.
విజ్ఞానాన్వేషణ ఒకానొక సమస్యతో కూడిన సన్నివేశంలో ఆరంభమై ఈ కింది దశలలో సాగిపోతుంది.
1. సమస్యను విడగొట్టి చూడడం.
2. పరిశీలన, పరిశోధనతో అవసరమైన వాస్తవాలను సేకరించడం, వాటి మధ్యగల సర్వసాధారణ లక్షణాలను బట్టి వర్గీకరించడం.
3. పరిశీలించిన వాస్తవాలన్నిటినీ వివరించి సమస్యను పరిష్కరించగల ప్రతిపాదన చేయడం.
4. ఆ ప్రతిపాదన ప్రకారం వీలైతే, అందులో ఇమిడి ఉన్న తార్కిక విషయాల ఆధారంగా అంతవరకూ తెలియని సంఘటన గురించి అంచనా వేయడం.
5. అలావేసిన అంచనాలను పరిశీలించి పరీక్షకు పెట్టడం.
గలీలియో తుపాకి గుండు చలనానికి సంబంధించిన సమస్యను పరిష్కరించిన తీరు గమనిస్తే ఈ దశలన్నీ తేటతెల్లమౌతాయి. అప్పటివరకూ అరిస్టాటిల్ పేర్కొన్న పదార్థ విజ్ఞాన ప్రభావంలోనే శాస్త్రవేత్తలు ఉండిపోయారు. కదలే వస్తువువేగం, ఆ వస్తువుపై పనిచేస్తున్న ఒత్తిడిని బట్టి ఉంటుంది. ఒత్తిడి ఆగినప్పుడు పదార్థ చలనం కూడా ఆగిపోతుంది. ఇది సాధారణ ఆలోచనకు సరిపోతుంది కూడా. అరిస్టాటిల్ భావాలకు సరిపోయోటట్లుండే అనేక సంఘటనలను మనం రోజూ చూస్తూనే ఉంటాం. మనం నడిచేటప్పుడు శ్రమపడుతుంటాం గదా. శ్రమ ఎక్కువైతే వేగంగా వెళ్ళగలం కూడా. ఇక బల్లను నెడుతుండగా, ఎప్పుడు నెట్టడం ఆపేస్తామో అప్పుడు బల్ల కదలకుండా ఆగిపోతుంది. గలీలియోకు పూర్వం ఒత్తిడికీ వేగానికీ సంబంధం ఉన్నదని ఇందలి భావన. వేగం (త్వరణం) ఎక్కువైందన్న మాట. ఒత్తిడి తగ్గితే ఆ మేరకు పదార్థ వేగం తగ్గుతుంది.
తుపాకి గుండు వెళ్ళే పద్ధతిలో ఈ నియమం పనిచేయడం లేదు. తుపాకి నుంచి పేల్చిన గుండు చాలా సేపటి వరకు, దానిపై ఎలాంటి ఒత్తిడి లేకుండానే, వేగంగా దూసుకుపోతుంది. ఆ గుండుపై గురుత్వాకర్షణ తప్ప మరే ఒత్తిడీ పనిచేయడం లేదు. తుపాకి పేల్చినప్పుడు మాత్రమే గుండుపై ఒత్తిడి పనిచేసింది. పేల్చడం అయిపోగానే గుండు బయటబడిన తరవాత ఇక తుపాకీ ఒత్తిడి అనేదేమీ లేదు. ఇలాగే ఇతర చలనాల విషయంలోనూ కొన్ని చిక్కులు ఎదురయ్యాయి. చేత్తో విసిరేసినరాయి, ఒకచోట నుంచి పడినరాయి, కర్రతో కొట్టినబంతి, నేలపై దొర్లుకుంటూ పోయే చక్రాలబండి ఇలాంటివి ఉదాహరణలుగా స్వీకరించవచ్చు. అరిస్టాటిల్ భావాలతో ఈ చలనాలను వివరించలేం.
ఇలా అనేక సందర్భాలలో చిక్కు ఏర్పడితే, మనం పొందుపరచ దలచిన చట్రంలో దీనికి సంబంధించిన సిద్ధాంత భావన ఉండి ఉండాలి. ఒత్తిడికీ వేగానికీ అరిస్టాటిల్ వివరించిన బావనలోనే, తుపాకి గుండు వేగాన్ని అధ్యయనం చేయడంలో గల చిక్కు ఇమిడి ఉందని గలీలియో విశ్లేషించి, నిర్ణయానికి వచ్చాడు. దీన్ని పరిష్కరించాలంటే ఒత్తిడికి సంబంధించి కొత్త భావన అవసరం. ఒత్తిడిని ఎలా నిర్వచించాలనేదే గలీలియోకు ఎదురైన సమస్య.
గలీలియో ఈ సమస్యను విశ్లేషించడంలో, మూలంలోనే చిక్కు ఉన్నదనే గాక ఇంకెంతో బయటపడింది. ఇలా కృషి చేయడానికి వీలైన సమాచారం ఆయన చేసిన పరిశోధనలో లభించింది. అన్ని విధాలైన చలనాలకు సంబంధించిన ఒత్తిడి విషయంలోనూ సమస్య ఒకటే గనక, వశ్లేషించడానికి గాను అతి సాధారణమైన చలనాన్ని పరిశోధనకు స్వీకరించాడు. తుపాకి గుండు వేగం కొంత జటిలమైంది. తుపాకీని పేల్చడం వల్ల వచ్చే ఒత్తిడితో బాటు, భూమిపైన కదిలే అన్ని పదార్ధాలపైన భూమికి చెందిన గురుత్వాకర్షణ ఒత్తిడి పనిచేస్తుంటుంది. ఎత్తైన ప్రదేశం నుంచి భూమిపై పడే వస్తువుపై భూమి గురుత్వాకర్షణ ఒత్తిడి మాత్రమే పనిచేస్తుంది. కనక ఇటువంటి దానిని విశ్లేషించడం సులభం. ఇటువంటి పరిశోధన ఆధారంగా ఒత్తిడికి సంబంధించిన భావన ఏర్పడితే, అన్ని విధాలైన చలనాలకూ అది అన్వయించవచ్చని గలీలియో అనుకొన్నాడు. ఆ విధంగా సమస్యను విశ్లేషించడంలో, ఎటువంటి సమాచారం కొరకు చూడాలో నిర్థారించవీలైంది. అంటే అన్వేషణలో రెండో దశకు చేరాడన్నమాట.
ఈ దశలో గలీలియో సేకరించిన సమాచారాన్ననుసరించి భూమి గురుత్వాకర్షణ అనేది పదార్థపు ద్రవ్యరాశి అని గ్రహించాడు.
వస్తువు వేగాన్ని ఏ మేరకు మార్చగలదో ఆ నిష్పత్తిలో గురుత్వాకర్షణ పనిచేసిందన్నమాట.
ఒకానొక పదార్థ వేగంలో, నియమిత కాలంలో వచ్చే మార్పును పదార్థత్వరణం అంటారు. సెకండుకు 500 అడుగుల నుంచి 505 అడుగుల వేగానికి మార్చడానికి ఆ పదార్థంపై పనిచేసిన ఒత్తిడి ఎంతో, సెకండుకు 15 అడుగుల వేగం నుంచి 20 అడుగుల వేగానికి మారినప్పుడు పనిచేసే ఒత్తిడి అంతేనని గలీలియో ప్రతిపాదించాడు. రెండు సందర్భాలలోనూ పదార్థ ద్రవ్యరాశి ఒకటేనన్నమాట. ద్రవ్యరాశి మారితే, ఆ నిష్పత్తిలో వేగంపై ఒత్తిడి కూడా మారుతుంది.
ఒకసారి ప్రతిపాదనను రూపొందిస్తే, పరిశీలన ఆధారంగా రుజువుకు పెట్టడం చాలా సులభమైన విషయమే.


త్వరణం (వేగం దిక్కు) కాదుగాని, మార్పు ఏ మేరకు జరుగుతుందనేది ప్రధానం. ఆచరణ ప్రధానంగా గల సామాన్యుడికి ఇది చిక్కు సమస్యగా ఉంటుంది. గలీలియో రెండోదశ నుంచి మూడో దశకు పయనించడమేగాక, ఇంకా విజ్ఞానంలో మధ్యకాలాల నుంచి ఆధునిక స్థాయికి రావడాన్ని కూడా ఇది సూచిస్తుంది.
ఎఫ్.ఎఫ్.సి. నార్త్ రప్ (తన గ్రంథం ది లాజిక్ ఆఫ్ ది హ్యూమానిటీస్ అండ్ సైన్స్ స్ (అధ్యాయాలు 2, 3, 4)లో) పేర్కొన్నట్లు, విజ్ఞాన పద్ధతిలో మొదటి దశను విశ్లేషణస్థాయి అందాం. రెండో దశను సహజ చారిత్రకస్థాయి అని పిలుద్దాం. చివరి మూడవ దశలను సమిష్టిగా, నిగమన (Deductive) రీతిలో ఏర్పరచిన సిద్ధాంతం అని పేర్కొందాం. అందులో విశ్లేషణస్థాయి అంటున్నామంటే సమాచారాన్ని సేకరించడం, పరిశీలన, పరిశోధనల సహాయంతో సందర్భానికి ఉపకరించే సమాచారాన్ని వర్గీకరించడం తప్ప, చేయగలిగింది లేదన్నమాట. ఇది ఆగమనపద్ధతి (Inductive) నేటి మనోవిజ్ఞాన స్థాయి ఈ దశలోనే ఉంది. ఈ శతాబ్దారంభంలోని తొలి దశబ్దాలలో జీవశాస్త్రం ఇటువంటి స్థాయిలోనే ఉండేది. అంతమాత్రాన సహజ చారిత్రక స్థాయి అనేది మూడవ, నాలుగవ విజ్ఞాన దశలకంటే తక్కువదనిగాని, అప్రధానం అని గాని భావించరాదు. సహజ చారిత్రక స్థాయి పునాదులు సరిగా ఉంటేనే సిద్ధాంతం ఫలవంతంగా రాగలదని ఆశించవచ్చు.
మూడో అంచెలో తలపెట్టే ప్రతిపాదనలో, అంతకు ముందు స్థాయిలో సేకరించిన సమాచారాన్ని వివేచనాత్మకంగా వివరించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఈ సందర్భంలో వివరణ అంటే, చేసిన ప్రతిపాదన దాని తార్కిక ఫలితాలు కూడా ప్రాపంచిక అనుభవరీత్యా వాస్తవాలే. అంటే విజ్ఞాన సిద్ధాంతానికి ప్రతిపాదన అనేది ఒక మెట్టు అన్నమాట.