Saturday, April 28, 2007

వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు -3

రాడికల్ హ్యూమనిస్ట్ - సమీక్ష

తెనాలి నుండి రాడికల్ హ్యూమనిస్ట్ వార, పక్ష పత్రికగా వచ్చేది. 1940 ప్రాంతాలలోనే రాడికల్ పత్రిక మొదలైంది. ఎం.ఎన్.రాయ్ భావాలు, మానవ వాదం ప్రధానంగా యీ పత్రికలలో వుండేవి. కోగంటి సుబ్రహ్మణ్యం ఎడిటర్ గా వెలువడుతున్నప్పుడు, 1958 నుండే నేను రాయడం ఆరంభించాను. విశాఖపట్టణంలో ఫిలాసఫి బి.ఎ. ఆనర్స్ చదువుతున్న రోజులవి. ఎం.ఎన్.రాయ్ వ్యాసాలు, కొందరు హ్యూమనిస్టుల రచనలు అనువదించి ప్రచురించాను. Heresies of 20th Century స్వదేశీ రంజనే రాసిన Why Co-operative Common Wealth తెనిగించాను. ప్రతి సంచికలో వ్యాసాలు రాసేవాడిని.

ఆవుల గోపాలకృష్ణ మూర్తి, ఎం.వి. రామమూర్తి ప్రభృతులెందరో వ్యాసాలు రాస్తుండేవారు. ప్రతిక అచ్చుతప్పులతో ఎడిటింగ్ సరిగా లేకుండా నడిచింది. ఎప్పుడూ ఆర్థిక యిబ్బందులతో సతమతమయ్యేది. కొన్నాళ్ళకు ఆగిపోయింది. తరువాత సమీక్ష అనే పేరిట మరో పత్రిక స్థాపించారు.

తెనాలి సమీపంలో కఠెవరంలో కొల్లి శివరామరెడ్డి అడ్వకేట్ గా వుండేవారు. ఆయన సంపాదకత్వాన సమీక్ష పత్రిక ఆరంభమైంది. ఆయనకు చేదోడుగా ఎం.వి. రమణయ్య పరమయ్య అడ్వకేట్, మేకా చక్రపాణి, పరుచూరి అచ్యుతరామయ్య వుండేవారు. ప్రధాన సలహాదారు ఆవుల. సమీక్షలో నేను నిరంతరం వ్యాస రచన చేశాను. అలాగే అనువాదాలు కూడా చేశాను. సి.హెచ్.రాజారెడ్డికి, ప్రెస్ వుండేది. శ్రద్ధగా పత్రికనడిపారు ఆర్ధిక యిబ్బందులు మామూలే. ఆయనా కొన్నాళ్ళకు సమీక్ష నిలిపేశారు. మాసపత్రికగా సమీక్ష వచ్చేది. కల్లూరి బసవేశ్వరరావు, భట్టిప్రోలు హనుమంతరావు, బచ్చు వెంకటేశ్వర్లు, జి. వెంకటస్వామి, సూర్యకుమారి, మల్లాది సుబ్బమ్మ యిలా ఎందరొ రచనలు చేశారు. ఎం.వి. రామమూర్తి ప్రోత్సాహం బాగా వుండేది. ఆవుల గోపాలకృష్ణ మూర్తి వ్యాసాలు 1967లో ఆయన చనిపోయే వరకూ వచ్చాయి. ఎన్.వి. బ్రహ్మం కలలో దేవుడు అనే రచన చేసి, చర్చ లేవనెత్తారు.

రాడికల్ హ్యూమనిస్ట్ (ఇంగ్లీషులో)

ఎం.ఎన్. రాయ్ స్థాపించిన రాడికల్ హ్యూమనిస్ట్ పత్రిక ఎందరో కొనసాగించారు. నేను 1965లో రాయడం మొదలు పెట్టేసరికి వి.బి.కార్నిక్, జి.డి.పరేఖ్ లు ఎడిటర్లుగా ఉన్నారు. ఆధునిక విజ్ఞాన తాత్విక ఫలితాలపై కొన్ని వ్యాసాలు రాశాను. బొంబాయి, కలకత్తా, ఢిల్లీ మారుతూ పత్రిక సాగింది. సునీల్ భట్టాచార్య, అనంతరం సంగీతమాల్, జస్టిస్ జాగీర్దార్లు ఎడిటర్లుగా ఉండేవారు. ప్రస్తుతం రేఖా సరస్వతి మీరట్ నుండి మేనేజింగ్ ఎడిటర్ గా నిర్వహిస్తున్నారు. ఆర్ధిక బాధలు, సర్క్యులేషన్ లేమి, ప్రకటనల కొరత ఉంది.

నేను తరచు వివిధ అంశాల పై వ్యాసాలు రాశాను. ఎం.ఎన్.రాయ్ పై విమర్శ చేసినప్పుడు వి.బి.కార్నిక్ వంటివారు రియాక్ట్ అయ్యారు. రాయ్ తన తొలి భార్య ఎవిలిన్ అంశం స్వీయగాథల్లో ప్రస్థావించక పోవడాన్నితీవ్రంగా విమర్శించాను. తార్కుండే, శిబ్ దారాయణ్ రే ఏవో సమర్ధనలు చేసినా అవేవీ సహేతుకాలు కావు. భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపకురాలిగా అంతర్జాతీయ రంగంలో పాత్రవహించిన ఎవిలిన్ పట్ల రాయ్ పక్షపాత ధోరణి అవలంబించాడని విమర్శించాను.

Tuesday, April 17, 2007

వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు - 2

వాహిని


ఆచార్య ఎన్.జి.రంగా స్థాపించిన పత్రిక వాహిని. 1938 నుండీ మద్రాసులో కార్యాలయం వుండేది. ఈ పత్రికకు ఎందరో సంపాదకత్వం వహించారు. న్యాయపతి నారాయణమూర్తి, పండితారాధ్యుల నాగేశ్వరరావు, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి, గోగినేని ఉమామహేశ్వరరావు, కె.వి. సుబ్బయ్య, జి. విశ్వనాధం, యిలా ఎందరో వున్నారు. రంగా గారి రాజకీయాల కోసం పెట్టుకున్న పత్రిక గనుక, వారి కార్యకలాపాలు యిందులో ప్రధానంగా వుండేవి.

ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత వాహిని, విజయవాడకు మారింది. 1955లో ఆంధ్రలో ఎన్నికలు జరిగినప్పుడు వాహిని తాత్కాలికంగా దిన పత్రికగా సాగింది. బి.ఎస్.ఆర్.కృష్ణ, నన్నపనేని వెంకట సుబ్బయ్య, జాస్తి జగన్నాధం ప్రభృతులు యిందులో పనిచేశారు.
నేను 1955 నుండీ వాహినికి వ్యాసాలు రాస్తూ తరచు వార్తలు కూడా పంపించేవాడిని. అయితే రంగాగారి రాజకీయాలతో ఎన్నడూ సంబంధం పెట్టుకోలేదు.

ఎ.సి. కాలేజీలో చదువుతూనే 1955-58 మధ్య వాహినికి వ్యాసాలురాశాను. నా క్లాస్ మేట్ ఎస్. రామాకృష్ణ నేనూ కలసి జంటగా సాహిత్య విమర్శలు చేశాం. ఎస్. రామకృష్ణ చాలా చురుకైన పదునైన కలంతో రాసేవాడు. రేపల్లెలో సిద్ధాబత్తుని దుర్గయ్య కుమారుడు. రామకృష్ణ కలం పేరు ఎస్. రాధారాణి. నా కలం పేరు ఎన్. శూలపాణి. ఇరువురం ఆ పేర్లతో రాస్తుండగా ఒక దశలో కాటూరి వెంకటేశ్వరరావు గారు మెచ్చుకుంటూ వ్యాఖ్యానించాడు. ప్రధానంగా విశ్వనాథ సత్యనారాయణ ఏకవీర, వేయిపడగలపై తీవ్ర విమర్శలు చేశాం.

గీత సత్యాగ్రహ ఉద్యమంలోనూ, 1955 ఎన్నికల ప్రచారంలోనూ 1959లో స్వతంత్ర పార్టీ పెట్టిన సందర్భంగా రాజాజీ పర్యటనపైనా వార్తలు పంపేవాడిని. ఆవుల గోపాలకృష్ణ మూర్తి నా చుట్టూ ప్రపంచం అనే శీర్షిక రాసేవారు. రాజాజీ బాపట్లలో మొదలెట్టి బొబ్బిలి వరకూ పర్యటించారు. ఆయనతో బాటు రంగా, బెజవాడ రామచంద్రా రెడ్డి, లచ్చన్న ప్రభృతులు వున్నారు. రాజాజీని తరచు కలియడం ఒక అనుభవం. బెజవాడ రామచంద్రారెడ్డి, నేనూ ఒక కారులో ప్రయాణించాం. ఆయనతో సన్నిహితత్వం ఏర్పడింది. ఎన్నో విశేషాలు చెప్పేవారు. నాకు ఉత్తరం రాస్తూ, గోటితో చిత్రాలు వేసి పంపేవారు.

రంగా గారికి పి.ఎ.గా చేరి 1956-60 పని చేస్తున్న రోజులు. ఆయనతో బాటే అనేక ప్రాంతాలు పర్యటిస్తూ, వార్తలు వాహినికి పంపడంతో విలేఖరి అనుభవం పొందాను. వాహినిలో గెటప్ బాగుండేది కాదు. అచ్చుతప్పులుండేవి. రంగాగారు వ్యక్తులపై చక్కని స్కెచ్ రాసేవారు. ఎడిటర్ పేరు ఉమామహేశ్వరరావు. ఆయినా ఎవరెవరో చూచేవారు. రాగం తానం పల్లవి శీర్షికన ఉమేష్ పేరిట ఆయన చక్కని వ్యాసాలు రాసేవాడు.

రానురాను వాహిని ప్రమాణాలు లేని పత్రికగా నడచింది. నేను 6 ఏళ్ళు అడపదడప వాహినితో సంబంధం పెట్టుకున్నాను. ఆ తరువాత రామామూర్తి, చంద్రపాల్ యిత్యాదులు సంపాదకత్వం వహించారు. క్రమంగా పత్రిక క్షీణించి ఆగిపోయింది. రాధారాణి పేరుతో రాసిన రామకృష్ణ తరువాత ఫార్మసీ పత్రిక పెట్టాడు. నేను శూలాపాణి పేరుతో ప్రజావాణి, వాహిని, ఆంధ్రభూమి దినపత్రికలో 1965 వరకూ రచనలు చేసి, ఆపేరు విరమించాను.

Monday, April 9, 2007

డాక్టర్ ఇన్నయ్య - రచయిత - పరిచయం




నరిశెట్టి ఇన్నయ్య గారి వివిధ పత్రికలు,పాత్రికేయులతో అనుభవాలు ప్రచురించటానికి ఎంతో సంతోషిస్తున్నాను. అముద్రితమైన ఈ పుస్తకు తొలిసారిగా ఈ బ్లాగు ద్వారా వెలుగులోకి వస్తున్నది. Journalism విధ్యార్థులకు, సమకాలీన రాజకీయాలు పై ఆసక్తి గలవారికి ఈ పుస్తకం ఉపయుక్తకరంగా ఉండగలదు. వీరు పాత్రికేయులే కాకుండా మానవతావాది. M.N.Roy గారి మానవతావాద సిద్ధాంతాల్ని త్రికరణ శుద్ధిగా నమ్మి, వాటి ప్రచారానికై పలు పుస్తకాలను వెలువరించారు. Philosophy of Modern Science లో Doctorate తీసుకున్న వీరు పలు ఆదర్శ వివాహలకు పౌరోహిత్యం వహించారు. ఆంధ్ర జ్యోతి దినపత్రిక Hyderabad Bureau Chief గా కొన్ని సంవత్సరాలు పని చేశారు. వీరి గురించి సమగ్ర సమాచారానికై చూడండి, ఈ వెబ్ పేజీలు.

http://innaiahn.tripod.com/
http://en.wikipedia.org/wiki/Innaiah_Narisetti
http://amazon.com (search for innaiah)

వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు

ప్రజావాణి



ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది 1953లో. ఆంధ్రప్రదేశ్ యింకా రాలేదు. 1954లో నేను ఇంటర్మీడియట్ చదువుతుండగా, ప్రజావాణి వారపత్రికకు తొలి వ్యాసం రాశాను. గుంటూరు ఎ.సి. కాలేజిలో చదువుతూ చేసిన పని అది.

"అనంతశయనం అయ్యంగారి అనంత కోటి రూపాలు" అనే శీర్షికన రాసిన వ్యాసం ప్రజావాణి, మొదటి పేజీలో రావడం చూచి, సంతోషించాను. అప్పటినుండే ఆ పత్రికకు రాయడం మొదలుపెట్టాను. ప్రజావాణి రాజకీయ వారపత్రిక. వట్టి కొండ రంగయ్య సంపాదకులు. ఆయన కృష్ణాజిల్లా వీరులపాడుకు చెందినవారు. మద్రాసులో సంజీవరెడ్డి ఆధ్వర్యాన కాంగ్రెసు పత్రిక రాగా, దానికి సంపాదకుడుగా వుండేవారు.అభిప్రాయ భేదాలతో, కాంగ్రెస్ పత్రిక మూతపడగా, రంగయ్య గుంటూరు వచ్చి వారపత్రిక మొదలెట్టారు. గార్డన్ ప్రెస్ లో చాలాముచ్చటగా తప్పులు లేకుండా పత్రిక వచ్చేది.

రంగయ్య భార్య వట్టి కొండ విశాలాక్షి కథలు, నవలలు ప్రజావాణిలో రాసేది. ఆమెది చేబ్రోలు. ప్రజావాణిలో ఆనాడు శైలేంద్ర పేరిట బి.ఎస్.ఆర్. కృష్ణ ప్రతివారం రాసేవారు. ఆయన అప్పటికే పొగాకు లోకం అనే పత్రికకు ఎడిటర్ గా వున్నాడు. గుంటూరు జిల్లా బోర్డు నడిపే పత్రిక అది. వాసిరెడ్డి సత్యనారాయణ, నల్లమోతు సత్యనారాయణ కూడా రెగ్యులర్ గా ప్రజావాణిలో రాసేవారు. వాసిరెడ్డి సత్యనారాయణ లాం గ్రామస్తులు. హిందూ కళాశాలలో చదువుతూ, కృషి కార్ లోకీ పార్టీలో రంగా, లచ్చన్న, ఓబుల్ రెడ్డి ప్రభృతుల అనుచరులుగా వుండేవారు.స్ర్కీన్, ఫిలిం ఇండియా, మొదలైన బొంబాయి పత్రికల నుండి సినిమా వార్తల్ని ప్రజావాణి ప్రచురించేది.

వాసిరెడ్డి సత్యనారాయణ తరువాత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీలో చేరారు. ఉయ్యూరు నుండి వెలువడే చెరకు పత్రిక సంపాదకత్వం వహించారు. బి.ఎస్.ఆర్. కృష్ణ అమెరికన్ కౌన్సలేట్ లో ఇన్ ఫర్మేషన్ ఆఫీసర్ గా మద్రాసు వెళ్ళి, అక్కడే రిటైర్ అయ్యారు. ఆ ఉద్యోగంలో వుండగా ఇతరులకు రాయకూడదు కనుక ప్రజావాణికి ఆయన రచనలు ఆగిపోయాయి.1951లో విజయ ప్రభ అనే దినపత్రిక మద్రాసు నుండి వైద్యుల రమణరావు సంపాదకత్వాన వెలువడింది. అందులో బి.ఎస్.ఆర్ కృష్ణ పనిచేశారు.

నేను 1954 నుండి పదేళ్ళ పాటు ప్రజావాణికి రాశాను. అనేక అనువాదాలు కూడా చేశాను. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అనూహ్యంగా నేను ప్రజావాణిలో ఉద్యోగంలో చేరాను. రోజుకు రూపాయి యిచ్చేవారు. ఉదయం శంకర విలాస్ లో రంగయ్యతో బాటే టిఫిన్ చేసేవాడిని. పాత గుంటూరు నుండి, నడచి వచ్చేవాడిని. మా అన్న విజయ రాజకుమార్ కుటుంబాన్ని పోషించేవాడు. హఠాత్తుగా కల్లు గీత సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టు కాగా, రాజమండ్రి జైలుకు పంపారు. లచ్చన్న నాయకత్వంలో జరిగిన గీత సత్యాగ్రహం, రాష్ట్రంలో మద్య నిషేధం తొలగించాలని పోరాడి గెలిచింది. శొంఠి రామమూర్తి నివేదిక ప్రకారం మద్య నిషేధం విఫలమైందని తేలింది. కల్లు గీత పనివారికి వృత్తి పోయింది గనుక, కృషికార్ లోక్ పార్టీ సత్యాగ్రహం తలపెట్టింది. ఈ నేపధ్యంలో నేను ఉద్యోగం చేశాను. తొలుత గుంటూరువారి తోటలో అద్దెకుండేవాళ్ళం. మా తండ్రి రాజయ్య పొలాలు పోగొట్టుకుని, జబ్బు పడ్డాడు. నేను ఉద్యోగం చేస్తూ జబ్బుపడ్డాను. అయినా అన్న జైలు నుండి తిరిగి వచ్చే వరకూ ప్రజావాణిలో ఉద్యోగం చేశాను. అప్పుడు రచయితలతో రాజకీయవాదులతో పరిచయమైంది. ప్రజావాణి రాజకీయ వారపత్రికగా ప్రభావం చూపెట్టింది. కమ్యూనిస్టు వ్యతిరేకత పత్రికలో వుండేది. ప్రజావాణి విమర్శలకు రాష్ట్ర కమ్యూనిస్టు నాయకులు స్పందించారు. మద్దుకూరి చంద్రశేఖరరావు వంటి వారు ప్రతి విమర్శల్ని వారి పత్రికలలో రాశారు.

నేను హైస్కూలు చదువుతుండగా, మా నాన్న రాజయ్య ఆంధ్రప్రభ, భారతి తెప్పించాడు. మద్రాసు నుండి నార్ల వెంకటేశ్వరరావు సంపాదకత్వాన వచ్చే పత్రిక కోసం రోజూ ఎదురు చూచి చదివేవాళ్ళం. అప్పట్లో అన్నా ప్రగడకామేశ్వరరావు గారి అంకుశం, బండి బుచ్చయ్య గారి ములుకోల, సూర్యదేవర రాజ్యలక్ష్మిగారి తెలుగుదేశం, వాహిని చదువుతుండే వాడిని. రాజకీయ హడావుడి ఎక్కువగా వుండేది.
తెనాలినుండి జ్యోతి పక్షపత్రిక, రేరాణి, అభిసారిక వచ్చేవి. ధనికొండ హనుమంతరావు సంపాదకత్వాన అభిసారిక యువతను పెద్దలను ఆకట్టుకున్నది.మద్రాసు నుండి తెలుగు స్వతంత్ర వచ్చేది. ఆ విధంగా హైస్కూలులోనే నేను వివిధ పత్రికలు చదువుతుండడం వలన ప్రజావాణిలో రాయడానికి అలవాటుపడ్డాను.

మా అన్న విజయరాజ కుమార్ తొలుత ఫార్వర్డ్ బ్లాక్ లో, తరువాత కృషి కార్ లోక్ పార్టీలో వుండడం వలన, నాకు ఆ పార్టీల వారితో పరిచయాలు కలిగాయి. జైలు నుండి విడుదలై మా అన్న రాగానే, మళ్ళీ కాలేజీ చదువులు కొనసాగించగలిగాను. అయినా రచనలు మానలేదు.ఎం.ఎన్. రాయ్ రచనలు కొన్ని అనువదించి ప్రజావాణిలో ప్రచురించాను. 1964 వరకూ రాశాను. తరువాత ప్రజావాణికి మానేశాను. వట్టి కొండ రంగయ్య కొన్నేళ్ళ తరువాత ప్రజావాణి నిలిపేశారు. ఆయన గేయరచన కూడా చేసేవారు. ఉత్తరోత్తరా రియల్ ఎస్టేట్ రంగంలో వుంటూ చనిపోయారు. పార్టీలు అధికారం రాజకీయాలు అనే ఎం.ఎన్. రాయ్ వ్యాస సంపుటి, మెన్ ఐ మెట్ అనే వ్యక్తిత్వ అంచనాల రచన ప్రజావాణిలో అనువదించాను. నా రచన లేవీ సెన్సార్ కాకుండా రంగయ్య గారు ప్రచురించి నన్ను ప్రోత్సహించారు.

-- నరిశెట్టి ఇన్నయ్య